తిరుమల: కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం పూర్తి

 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ(ఎఫ్ఏసి) శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ మధుసూదన్ యాదవ్, అదనపు ఈఓ(ఎఫ్ఏసి) శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌ కుమార్‌, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *