‘కెసిఆర్ పాలన: రైతు కంట కన్నీరు… ఫార్మ్ హౌస్ పంట పన్నీరు’

కేసీఆర్   మీ ఏడేళ్ల పాలన మీద తెలంగాణ బిజెపి అధ్యక్షుడు 15 ప్రశ్నలు సంధించారు. ఏడేళ్ల పాలనలో  రైతు కంట కన్నీరు… మీ ఫార్మ్ హౌస్ పంట పన్నీరు అప్ప జరిగిందేమిటి అని ఆయన ప్రశ్నించారు.
కెసిఆర్ సారు,  మీకు నిజం  చెప్పకూడదు  అనే  శాపం  ఏమైనా  ఉందా? అని గుచ్చుకునేలా ప్రశ్నించారు.

‘ఏనాడు మీరు నిజాలు చెప్పారు? అందుకే అబద్ధాలతో ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా?’,అని అన్నారు. తాను  చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర కు జనం బాగా వస్తుండటంతో బండి సంజయ్ మాటలు, ప్రశ్నలు కూడా బాగా పదునెక్కుతున్నాయ్. ఇది ఈ రోజు ఆయన సంధించిన పదునైన ప్రశ్నలు, వీటికి ఎవరు సమాధానం చెబుతారో చూడాలి.

  1. 2014 టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్ నెం.9, 10, 11లో వ్యవసాయ రంగం అనే అంశం కింద రైతాంగానికి అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీల్లో ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? దీనిపైన చర్చించడానికి సిద్దమా?
    ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని 2014లో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్ నెం. 7లో మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో మీరు వివరాలు అందించగలరా?

2) నిజాం షుగర్స్ ను పునరుద్ధరించాలని టీఆర్ఎస్ భావిస్తున్నది అని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్ నెం.23లో పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసి చెరకు రైతులను ఎప్పుడు ఆదుకుంటారు?
నిజామాబాద్ జిల్లాలో చెరకు పరిశోధన కేంద్రం, పాలమూరు జిల్లాలో చేపల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని మీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోల పేజ్ నెం.11లో హామీ ఇచ్చారు. ఈ పరిశోధన కేంద్రాల ఏర్పాటు ఎక్కడి వరకు వచ్చాయి?

3) కొత్తగా 10 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభిస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోల పేజ్ నెం.8లో మీరు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్ని థర్మల్ విద్యుత్కేంద్రాలు ప్రారంభించారు? కనీసం ఒక్క యూనిట్ అయినా కొత్తగా ఉత్పాదన చేశారా?

4) మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయగా మార్చి కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని మీ పార్టీ వారు దోచుకోలేదా? దీనిపైనా జ్యూడిషల్ ఎంక్వయిరీకి మీరు సిద్ధమా?

5) మిషన్ కాకతీయ కార్యాక్రమంలో కమిషన్ల కోసం ప్రాధాన్యం లేని  చెరువులకు పనులు చేపట్టారని ‘కాగ్’ తప్పుపట్టిన మాట వాస్తవం కాదా?
కమ్యూనిటీ బేసెడ్ ట్యాంక్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద తీసుకున్న చెరువులనే తిరిగి మిషన్ కాకతీయలో చేపట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీ పార్టీ వారు దోచుకున్నారని ‘కాగ్’ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్న విషయం మీ దృష్టికి వచ్చిందా? దీనిపై మీరు ఏం చర్యలు తీసుకున్నారు?

6) ‘‘జలయజ్ఞం-ధనయజ్ఞం’’గా గతంలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ రాజేశేఖర రెడ్డి గారు వాటిపై ఆయా ప్రాజెక్టులు వద్ద అఖిలపక్షం నేతలతో, నిపుణులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించి, వారి ముందు అన్ని ఫైల్స్ ఉంచి అనుమానాలను నివృత్తి చేశారు.. మీరు కూడా సాగునీటి ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అటువంటి కార్యక్రమం నిర్వహించే దమ్మూ, ధైర్యం ఉందా?

7) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై  మీకు సోయి ఉందా? దీనిపైన తెలంగాణ శాఖ మీకు అనేక సార్లు ఫిర్యాదు చేసింది… ఈ అక్రమ ప్రాజెక్టులు ఆపడానికి మీరు ఏమి చర్యలు తీసుకొన్నారు?
కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి  575  టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా 299 టీఎంసీలు నీటి వాటాకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి మీరు తీరని ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా?

8) ఏపీ నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులకు మీరు పరోక్షంగా సహాయ, సహకారాలు అందిస్తున్నారా? లేదా? మీ ఆత్మసాక్షిగా నిజం చెప్పండి?

9) తెలంగాణ నీటిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం దోచుకుపోతుంటే  మీరు తీసుకున్న చర్యలు  ఏమిటి?
2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి బోర్లు, కాలువలు క్రింద సాగులో వున్నది ఎంత? ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు అధికారం చేపట్టిన తరువాత కాలువలు, బోర్లు క్రింద సాగులోనికి వచ్చిందెంత? వాటి వివరాలు ఇవ్వగలరా?

10) రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని 2014, 2018 ఎన్నికల్లో మీరిచ్చిన హామీ ఎంతమేరకు నెరవేర్చారు? మాకున్న సమాచారం ప్రకారం ఇంకా 39 లక్షల మంది రైతులకు 27వేల 500 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉంది. ఈ హామీని ఎప్పటిలోగా మీరు నెరవేరుస్తారు?
మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ 7 సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు ఎంత నష్ట పరిహారం చెల్లించారు?
రాష్ట్రంలో ఇప్పటికే 28వేల 500ల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మీ అసమర్థ పాలన వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి మీ సమాధానమేంటి?
రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని మీరు 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించారు. ఇప్పటివరకు ఎన్ని బస్తాల ఎరువులను ఉచితంగా ఇచ్చారు?

11) ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన వాటాచెల్లించకుండా రైతులకు అందాల్సిన పంట నష్టం రాకుండా వారిని మోసం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది కాదా?

రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ రావడం లేదు, పంట నష్టపరిహారం అందడం లేదు. దీనికి మీ సమాధానమేంటి?

12) తెలంగాణలో పండే పంటనంతా మేమే కొంటాం, పొలం దగ్గరకు వచ్చి ప్రతి గింజా కొంటాం, 48 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తాం.. అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన మీరు కేంద్ర ప్రభుత్వంపై నింద వేసి వరి పంట వేయొద్దని, వరి వేస్తే ఉరి అని మీరు ప్రకటించడం మీ అసమర్థత పాలనకు నిదర్శనం కాదా?

13) మీరే గతంలో దొడ్డు రకాలు వేయకూడదని, సన్నాలు వేయాలని ప్రకటించారు. ఇప్పుడు వరి పంట వేయొద్దని, వేస్తే ఊరే అని అంటున్నారు. పూటకోమాట మాట్లాడి రైతులను మీరు ఎందుకు ఆందోళనకు గురిచేస్తున్నారు?

14 ) కేంద్ర ప్రభుత్వం స్వదేశీ పంటల ఉత్పత్తులను విదేశాలకు మార్కెటింగ్ చేసేందుకు దిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే ఈ సమావేశానికి మీరు ఎందుకు హాజరు కాలేదు?

15) రైతులకు కనీస ధర ఇప్పించడానికి ప్రభుత్వం తానుగా జోక్యం (మార్కెట్ ఇంటర్ వెన్షన్) చేసుకుంటుందని 2014 మీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్ నెం.10లో అక్షరరూపంలో హామీ ఇచ్చారు. ఈ 7 సంవత్సరాల కాలంలో కనీస ధర రైతులకు ఇప్పించడం కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు? అందులో ఎంత ఖర్చు చేశారు? వాటి వివరాలు ఇవ్వగలరా?

16) తెలంగాణలోని ప్రతి రైతు భూమిలో భూసార పరీక్షలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని 2014 మీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్ నెం.10లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షల కోసం ఇచ్చిన రూ.126 కోట్లను దారి మళ్లించిన మాట వాస్తవం కాదా? కేవలం మీ ఫార్మ్ హౌస్ లో మాత్రమే భూసార పరీక్షలు నిర్వహించుకున్నారు. ఇది వాస్తవం.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రైతు వేదికలు నిర్మించారు. ఈ వేదికల నిర్మాణం లక్ష్యం నెరవేరిందా? రైతులకు ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *