సింగరేణికి కేసీఆర్ వరాలు… రిటైర్మెంట్ వయసు 61

*సింగరేణీలో పదవీ విరమణ వయసు 61కి బోర్డు ఆమోదం

*పెళ్లైన, విడాకులు పొందిన కుమార్తెలకు కూడా కారుణ్య నియామకాల్లో అవకాశం

*ఇ బి సి లకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ అమలుకు ఆమోదం

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ లోని అధికారులు, ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో సోమవారం జరిగిన 557వ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం దీనికి ఆమోదం తెలిపినట్లు సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్ఎన్‌.శ్రీధర్‌ ప్రకటించారు.

ఆయన అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో సింగరేణి డైరెక్టర్లతో పాటు కేంద్ర, రాష్ట్రాల నుంచి బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సింగరేణి సంస్థలో కూడా దీన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

జులై 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి ప్రాంత ప్రజానిధులు, సంస్థ ఛైర్మన్‌ తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సింగరేణిలో కూడా 61 సంవత్సరాల వయో పరిమితి పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సమావేశంలో బోర్డు తన ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్‌, ఎండీ ప్రకటించారు.

వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు నిర్ణయాన్ని మార్చి 31వ తేదీ నుంచి అమలు చేయడానికి బోర్డు అంగీకరించింది. దీని వలన సింగరేణి ఆధికారులు, కార్మికులు కలిపి మొత్తం 43,899 మందికి లబ్ది చేకూరనుంది. మార్చి 31 తేదీ నుంచి జూన్‌ 30వ తేదీ మధ్య కాలంలో రిటైర్‌ అయిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. దీనిపై సమగ్రమైన విధివిధానాలు రూపొందించాలని సంస్థ సీఎండీ శ్రీ ఎన్‌.శ్రీధర్‌ సంబంధిత శాఖల వారిని ఆదేశించారు. ఈ వయో పరిమితి పెంపును సింగరేణి విద్యా సంస్థల్లో కూడా అమలు జరపనున్నారు.

కాగా, కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు కేవలం కుమారులకు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే అవకాశం కల్పిస్తుండగా, కార్మికుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు పెళ్లైన లేదా విడాకులు తీసుకొని విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుమార్తెలు, ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ వయో పరిమితికి లోబడి కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో వారసత్వ ఉద్యోగం పొందేందుకు బోర్డు ఆమోదించింది.

ఈ సమావేశంలో సమీప గ్రామాల అభివృద్ధికి ఉద్దేశించిన సామాజిక బాధ్యతా కార్యక్రమాల (సీఎస్‌ఆర్‌) నిర్వహణకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు వెచ్చించడానికి బోర్డు ఆమోదించింది. అలాగే వివిధ గనులకు అవసరమైన యంత్రాలు, కాంట్రాక్టు పనులు తదితర అంశాలకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. రామగుండం లో కొత్తగా ప్రారంభించనున్న ఆర్జీ ఓసీ-5కు సంబంధించి రెండు కొత్త రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే బడ్జెట్‌ కు ఆమోదం తెలిపింది. ఫస్ట్‌ క్లాస్‌ మైన్‌ మేనేజర్‌ సర్టిఫికెట్‌ ఉన్న మైనింగ్‌ అధికారుల డిజిగ్నేషన్‌ మార్పు పై కూడా బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఎగ్జిక్యూటీవ్‌, ఎన్‌.సి.డబ్ల్యు.ఎ. ఉద్యోగ నియామకాలలో గతంలో ఉద్యోగ నిబంధనల ప్రకారం కొన్ని లింగపరమైన ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అన్ని పోస్టులకు లింగ భేదాన్ని తొలగిస్తూ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడాలికి వీలుగా బోర్డు అంగీకరించింది.

రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు శ్రీరాంపూర్‌ ఏరియా నస్పూర్‌ కాలనీ వద్ద జాతీయ రహదారి విస్తరణ లో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం గల 201 ప్లాట్లను కేటాయించడానికి కూడా బోర్డు ఆమోదించింది.

సంస్థ చైర్మన్‌ & ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ఆద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్‌ శ్రీ పి.ఎస్‌.ఎల్‌.స్వామి, డిప్యూటీ సెక్రటరీ శ్రీ అజితేష్‌ కుమార్‌, వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ చైర్మన్‌ & ఎం.డి. శ్రీ మనోజ్‌ కుమార్‌, సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్స్‌ & ప్లానింగ్‌, పర్సనల్‌) శ్రీ ఎన్‌.బలరామ్‌, డైరెక్టర్‌ (ఈ&ఎం) శ్రీ డి.సత్యనారాయణ రావు పాల్గొన్నారు. కంపెనీ సెక్రటరీ శ్రీమతి సునితా దేవి పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *