రఘురామకృష్ణ లోక్ సభ సభ్యత్వం రద్దు అవుతుందా?

నర్సాపురం ఎంపి, వైసిపి రెబెల్, బిజెపి మిత్రుడు అయిన రఘురామకృష్ణరాజును లోక్ సభలో లేకుండా  చేయడానికి పార్టీ చాలా ప్రయత్నాలుచేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలు మొదలయి సరిగ్గా 12 నెలలయింది.

ఈ మధ్య కాలంలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభసభ్యుడు విజయ సాయి రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలు రాశారు. వ్యక్తిగతంగా కలిశారు. పదే పదే గుర్తు చేస్తున్నారు. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు.అందుకే వైసిపిలో అసహనం ఉంది.

ఇలాంటి జాప్యం మీద పార్టీలు చాలా కాలంగా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టుకు వెళ్లాయి. ఇటీవల  సుప్రీంకోర్టు ఈ అంశం మీద రెండు తీర్పులిచ్చింది. తాజా తీర్పు జవనరిలో వచ్చింది. స్పీకర్ జాప్యం చేయడం మీద కోర్టులు కూడా అసహనం వ్యక్తం చేశాయి. స్పీకర్ నుంచి అనర్హత అధికారాలను తీసేయాల్సిన అసవరం ఉందని, అపుడు నిర్ణయాలు తొందరగా వస్తాయని కోర్టు అభిప్రాయపడింది.దీనికోసం రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్రానికి సూచించింది. అయితే, ఇపుడున్న  స్పీకర్ అధికారాలను మార్పు చేయలేదు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడుతున్నందున వైసిపి రఘురామను వైసిపి నుంచి సస్పెండ్ చేశారు. దీనితో ఆయనను లోక సభ సభ్యత్వానికి  అనర్హుడిగా ప్రకటించాలని పార్టీ స్పీకర్ ను కోరింది.

ఒక ఎంపిని ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద  లోక్ సభకు అనర్హుడిగా ప్రకటించడమనేది పూర్తిగా స్పీకర్ చేతిలోనే ఉంది.

స్పీకర్ అనే వ్యక్తి ఒక పార్టీకి చెందిన వాడైనందున మరొక పార్టీ ఎంపిని అనర్హుడిగా ప్రకటించే అధికారం ఆయన చేతిలో పెట్టడం ఎంతవరకు సబబు అనేది విషయం ఈ మధ్య జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ అధ్వర్యంలో ని సుప్రీం కోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది.

అనర్హత వేటు అధికారాలు స్పీకర్ నుంచి తొలగించాలని బెంచ్ అభిప్రాయపడింది. దీనికోసం  రాజ్యంగంలోని 10 షెడ్యూల్ ను సవరించి , యాంటి డిఫెక్షన్ చట్టంలోని కొన్ని అంశాలకు పదునుపెట్టాలని 31 పేజీల తీర్పునిచ్చింది. అంతే తప్ప ఇపుడు స్పీకర్ చేతిలో ఉన్న అధికారాలను తీసేయలేదు.

“It is time Parliament had a rethink on whether disqualification petitions ought to be entrusted to a Speaker as a quasi-judicial authority when such Speaker continues to belong to a particular political party either de jure or de facto,”అని నారిమన్ ఈ తీర్పులో పేర్కొన్నారు.

పార్టీల డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్లను పరిశీలించే బాధ్యతలను రిటైర్డు సుప్రీం కోర్టు లేదా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్వర్యంలో ఏర్పాటయిన ఒక శాశ్వత ట్రిబ్యునల్ కు అప్పగించాలని కోర్టు కేంద్రానికి సూచించింది.

Disqualification petitions under the Tenth Schedule should be adjudicated by a mechanism outside parliament or the Legislative Assemblies. There should be a permanent tribunal headed by a retired Supreme Court Judge or a former High Court Chief Justice..అని కోర్టు సూచించింది.

అందువల్ల ఇప్పటికయితే, పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్ల మీద మనస్సాక్షిగా స్పీకర్   మాత్రమే  నిర్ణయం తీసుకుంటారు. ఇందులో మార్పులేదు. స్పీకర్ నిర్ణయాన్ని  కోర్టులు కూడా తప్పు పట్టలేవు. అదే విధంగా తొందరగా నిర్ణయం తీసుకోమని కూడా చెప్పలేవు.

ఈ కారణాల రఘురామ మీద అనర్హత వేటు వేయాలన్న లేఖ మీద స్పీకర్ నిదానంగా చర్య తీసుకుంటారు. తీసుకోక పోవచ్చు కూడా. లేదా లోక్ సభ ముగిసేటపుడు తీసుకోవచ్చు. లేదా   లేఖను తిరస్కరించవచ్చు. దీనికి ఎంత కాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు.

దీని వల్ల రఘురామ జగన్ వ్యతిరేక కార్యకలాపాలను ఉధృతం చేయడమే ఉంటుంది తప్ప తగ్గదు. దీనిని  వైసిపి భరించడం మినహా మరొక పని చేయలేదు.

ఈనేపథ్యంలో వైసిసి అనర్హత వేటు లేఖ మీద వైసిపి రెబెల్ ఎంపి స్పందించారు. నేరుగా ఆయన  ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు.

ఇప్పటికి ఏడు సార్లు తనపై అనర్హత వేటు వేయాలంటూ గౌరవ లోక్ సభ స్పీకర్ కు వివిధ సందర్భాలలో వినతి పత్రాలు సమర్పించారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

జాప్యం భరించలేక వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ‘గౌరవ చట్ట సభల చైర్ లను దూషించడాన్ని’ కూడా ఆయన జగన్ దష్టికి తీసుకువచ్చారు.

“మీరు గౌరవ న్యాయస్థానాలపైనా, గౌరవనీయులైన న్యాయమూర్తులపైనా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసినట్లుగానే అత్యున్నతమైన, గౌరవప్రదమైన వ్యవస్థలపైన విజయసాయి రెడ్డి పలు దఫాలుగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాబోయే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తాం అని ఆయన లోక్ సభ స్పీకర్ ను నేరుగా హెచ్చరించే సాహసానికి కూడా ఒడిగట్టారు. గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ ను ఉద్దేశించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు నేను ఆయనపై ఇప్పటికే సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చాను కూడా,” అని కూడా లేఖలో రాశారు. దానితో పాటు ఆయన జగన్ కు ఒక చిక్కు ప్రశ్న వేశారు.

 అందేంంటే…

“రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మీ బృందం, ఎందుకు సభలను స్థంభింప చేయడం లేదు? మీరు స్పెషల్ క్యాటగిరి స్టేటస్ పై చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు మన పార్టీకి అనూహ్యమైన మెజారిటీని కట్టబెట్టారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నది ఏమిటంటే ఒక సహచర ఎంపిపై అనర్హత వేటు వేయించేందుకు పార్లమెంటును స్థంభింప చేసే శక్తి ఉంటే అదే శక్తిని మన రాష్ట్రానికి ప్రత్యేక క్యాటగిరి స్టేటస్ తెప్పించేందుకు ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం పార్లమెంటును స్తంభింప చేయవచ్చు కదా అని వారు అడుగుతున్నారు.
ఒక పార్లమెంటు సభ్యుడిపై అనర్హత వేటు వేయమని ఇన్ని లేఖలు రాస్తున్నారే పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురావడానికి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి,విశాఖపట్నం రైల్వే జోన్ వ్యవహారం ముందుకు సాగకుండా ఆగిపోయినప్పుడు, రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుకు  ఎందుకు లేఖలు రాయడం లేదని కూడా ప్రజలు పరిపరి విధాలుగా ప్రశ్నలు సంధిస్తున్నారు?” దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“ఒక ఎంపిని అనర్హుడిగా ప్రకటించే అధికారాన్ని లోక్ సభ స్పీకర్ నుంచి తీసేసి పార్టీ అధ్యక్షుడికే ఇవ్వాలనే మీ తలంపును అమలులోకి తెచ్చుకోవాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో మూడు వంతుల మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. అది మీకున్న 22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులతో సాధ్యం కాదు.
మీకు మరో అదనపు సమాచారాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే, పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుల విషయంలో కోర్టులు ఏ మాత్రం జోక్యం చేసుకోలేవు. ఫిరాయింపుల ఫిర్యాదుల పరిష్కారంపై కాలపరిమితిని నిర్ణయించడం కూడా కోర్టుల పరిధిలోకి రాదు. ఇది పూర్తిగా రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, లోక్ సభ స్పీకర్ విచక్షణపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అని,” కూడా ఆయన గుర్తు చేశారు.

“ఏనాడూ పార్టీ విప్ ను ధిక్కరించని వాడిని, ఏనాడూ పార్టీ ఫిరాయించని వాడిని ఎవరినైనా సరే 10వ షెడ్యూలు కింద దోషిగా నిలబెట్టి పార్లమెంటు సభ్యత్వం నుంచి తప్పించలేరు, అనర్హత వేటు కూడా వేయలేరు. అందువల్ల నేను మీకు సూచించేది ఏమంటే నా శక్తియుక్తులను పార్టీ బాగు కోసం, పార్టీ నాయకుడి మేలు కోసం, నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వాడుకోండి తప్ప ఇలా ప్రవర్తించ వద్దు,” అని రఘురామలేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *