హైదరాబాద్:ఈ రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ను నర్సులు ముట్టడించారు. ఏడాదిన్నర కాలంగా కోవిడ్ కోసం సేవలు చేయించుకుని అర్థాంతరంగా తొలగించారని వారు నిరసన తెలిపేందుకు ఈ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1640 మంది నర్సులను తొలగించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నర్సులంతా కలిసి పై అధికారులను సంప్రదించగా తమకు సంబంధలేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని వారు చెప్పడంతో ఇవాళ ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి బాధితులకు సేవలు అందించామని, ఇప్పుడు ఉన్నఫలంగా తమను తొలగించడం దారుణమని, తీసుకునేటప్పుడు పర్మినెంట్ చేస్తామని చెప్పారని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా తమకు నాలుగు నెలల జీతాలు కూడా ఇవ్వలేదని వాపోయారు.