ఒదిషా నుంచి ఏపీకి ఆక్సిజన్ రైళ్ళు నడపండి

విశాఖపట్నం, మే 11: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆక్సిజన్‌ రవాణాకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒదిషా నుంచి కేంద్ర నుంచి రాష్ట్రానికి ప్రాణవాయువు తరలించడానికి ప్రత్యేక ఆక్సిజన్‌ రైళ్ళను నడపాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్‌ సునీత్ శర్మకు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు  మంగళవారం ఆయన  సునీత్ శర్మకు లేఖ రాశారు.

లేఖలోని అంశాలు

సకాలంలో ఆక్సిజన్ రవాణా ద్వారా వేలాది మంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో భారతీయ రైల్వేలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆక్సిజన్ రైళ్ళు విజయవంతం అయ్యాయి.

దేశంలోని వివిధ రాష్ట్రాలు మాదిరిగానే కోవిడ్ 19 సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌ను కూడా అతలాకుతలం చేస్తున్న విషయం మీకు తెలిసిందే. రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన అత్యధిక కోవిడ్‌ కేసుల కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో కేసులు ఇప్పుడు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి.

ఈ నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం అపరిమితంగా పెరిగిపోయింది. కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ఆక్సిజన్‌ ఆవశ్యకత కీలకంగా మారింది. తగినంత ఆక్సిజన్ సరఫరా కేటాయింపు, రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయంపైనే ఆధారపడింది.

ఆపత్కాలంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ఇప్పటికే తాను ఢిల్లీలోని అనేక మంది ఉన్నతాధికారుల సహాయాన్ని అర్థించాను. ఒడిషా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ రవాణా కోసం 10 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కేటాయించవలసిందిగా ఎంపవర్డ్ గ్రూప్ చైర్ పర్సన్ శ్రీమతి సునితా దావ్రాను కోరడం జరిగింది. అయితే రాష్ట్రానికి కేవలం 2 క్రయోజెనిక్ ట్యాంకర్లను మాత్రమే కేటాయించారు. సాయం చిన్నపాటిదే అయినా ఆమెకు ధన్యవాదాలు.

ఒదిషా నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ నిల్వలను రవాణా చేయడానికి ఈ రెండు క్రయోజెనిక్ ట్యాంకర్లు ఏమూలకూ చాలవు.

 

ఒదిషా నుంచి కేంద్ర నుంచి రాష్ట్రానికి తగినంత ఆక్సిజన్ కేటాయింపులు ఉన్నప్పటికీ ప్రాణవాయువును అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకురావడానికి సరిపడినన్ని ఆక్సిజెన్ ట్యాంకర్లు అందుబాటులో లేవు. ఫలితంగా ఈ కేటాయింపులు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యాయని తెలిపారు.

ఈ విపత్కర పరిస్థితులలో ఒదిషా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఆక్సిజన్‌ రవాణా కోసం యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ రైళ్ళను నడిపేందుకు చొరవ తీసుకోవాలి.

ఈ మేరకు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే లేదా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలి. ఒడిషా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్‌ రవాణా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు, వాణిజ్యం)  పరీడా తో ఆక్సిజన్‌ రైళ్ళ నిర్వహణను సమన్వయం చేసుకునేలా రైల్వే జీఎంలకు తగిన సూచనలు చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *