షర్మిలను కలుసుకున్న అజార్ కొడుకు, సానియా మీర్జా సోదరి

తెలంగాణ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల కదలికలు ఆసక్తి రెకెత్తిస్తున్నాయి. లోటస్ పాండ్ లో రకరకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇంతవరకు షర్మిల వివిధ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో సమావేశమవుతూ వచ్చారు. కాని ఈ రోజు మరొక చిత్రమయిన సమావేశం జరిగింది. భారత క్రికెటె మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్, భార్య  ఆనం మీర్జా  (టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి) షర్మిలను కలుసుకున్నారు.  ఇది  కేవలం మర్యాదపూర్వకంగా కలయిక మాత్రమేనని చెబుతున్నారు.

ఇది పైకి చెప్పే రొటీన్ విషయమే. రాజకీయాల్లోకి రావాలనుకుని, అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న వ్యక్తిని  కలుసుకోవడం లో రాజకీయం కాకుండా ఉత్తుత్తి మర్యాదేముంటుంది? ఇందులోని రాజకీయమేదో వెల్లడయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఇది తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ లోని ముస్లింలకు ఒక సందేశమని అనిపిస్తుంది.

ఎందుకంటే, వైఎస్ మీద ముస్లింలకు ప్రత్యేకాభిమానం ఉండేది.  2004 వైఎస్ అఖండ విజయంలో ముస్లింల పాత్ర చాలా ఉంది. అందువల్లే ఆయన ముస్లింలను బిసిలలో చేర్చి నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా ప్రకటించి చరిత్ర  సృష్టించారు.

తెలంగాణలో ముస్లింల అండ లేకుండా గెలవడం కష్టం. ఈ మర్మం తెలుసు కాాబట్టే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్లు, ప్రత్యేక తెలంగాణలో కెసిఆర్ ముస్లిం ప్రతినిధి పార్టీగా గుర్తింపు ఉన్న ఎఐఎంఐఎం తో ఎపుడూ స్నేహంగా ఉంటూ వస్తున్నారు.

కాబట్టి ముస్లింల మనసు దోచుకునేందుకు షర్మిల చేసిన తొలి ప్రయత్నం ఇది కావచ్చు. దీని గురించి లోటస్ పాండ్ కు సన్నిహితులయిన వారిని వాకబు చేస్తే మరొక ఆసక్తి కరమయిన సమాచారం అందింది. ఇపుడు జిల్లాల వారీగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లే  షర్మిల తొందర్లో వైఎస్ అభిమానులయిన ముస్లిం మైనారీటీ నేతలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు  చేసే వీలుందని  వారు తెలిపారు.

ఇది ఇలా ఉంటే, షర్మిల ఎవరు వదిలిన బాణమని జరుగుతున్న చర్చకు సమాధానమిచ్చారు.”నేను ఎవరో వదిలిన బాణం కాదు తెరాస,బీజేపీలకు మేము బీ టీం కాదు. ఉండాల్సిన అవసరము లేదు. రాజన్న రాజ్య స్థాపనే నా ద్యేయం” అని ఆమె తరఫున ట్వీట్ విడుదలయింది.

 

 

తొందర్లో  షర్మిల పాదయాత్ర చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *