(నల్లెల్ల రాజయ్య)
సందర్శకులకు విజ్ఞానంతో పాటు ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని, ఆక్సిజన్ అందించాల్సిన వరంగల్ వన విజ్ఞాన కేంద్రం అధ్వాన్నమైన వాతావణంలో కొనసాగుతుండటం బాధాకరమని రం ఫర్ బెటర్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షులు పుల్లూరి సుధాకర్ , వరంగల్ పౌర స్పందన వేదిక కో-ఆర్డినేటర్ నల్లెల్ల రాజయ్య వ్యాఖ్యానించారు.
ఈ రోజు వారు హన్మకొండలోని జంతుప్రదర్శన శాల ( కాకతీయ వన విజ్ఞాన కేంద్రం)లో మౌళిక వసతుల పరిశీలించారు.
ఈ వనం జంతువుల నివాసానికి ఏ మాత్రం అనుకూలంగా లేదని, వాటికి తలదాచుకునేందుకు సరైన నీడనిచ్చే చెట్టు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జంతు ప్రదర్శన శాలలోని ప్రాణుల పట్ల ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు చూపుతున్నట్లు లేదని వారి పరిశీలనలో వెల్లడయింది. ఈ జంతు ప్రదర్శన శాల గుండు ఆ ప్రాంతాం కాలనీల నుంచి వచ్చే మురుగు కాలువలను అనుమతించడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జంతువలు ఉనికి పట్ల ఏ మాత్రమూ కారుణ్యం లేదనేందుకు ఇది నిదర్శనమని అన్నారు.
వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం వెరశి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితి నెలకొన్నదని జూపార్కుల చట్టాలు మరియు వన్య ప్రాణుల చట్టాలు ఇక్కడ నిర్వీర్యమై పోతున్నాయని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వారింకా ఏమన్నారంటే..
ఈ వన విజ్ఞాన కేంద్రం గుండా రెండు డ్రైనేజీ కాలువలు వెళ్తున్నాయి. అందులోని మురుగు నీరు దుర్వాసన అందులోని జంతువులు. పక్షులు సందర్శకులకు కూడా ఆరోగ్యరీత్యా హానికరం. ఒక డ్రెయిన జులైవాడ ,సహకార నగర్ ,నందినీ హిల్స్ తదితర కాలనీల ద్వార ప్రవహించి రాజ్ హోటల్ ఎదురుగుండా జంతుప్రదర్శన శాలలో ప్రవేశిస్తున్నది.
మరొక డ్రెయిన్ బాల సముద్రం అడ్వకేట్ కాలనీ, శ్రీనివాస్ నగర్ ల గుండా ప్రవహించి జూపార్కులోనే కలుస్తున్నది.
అట్లాగే లేళ్ళు జింకలు ,దుప్పులు ,కొండగొర్రెలు.సుక్కల దుప్పులు ,మనుబోతులు ఉండే ఆవాస ప్రాంతాలు చెట్లులేక మైదాస ప్రాంతాలను తలపిస్తున్నాయి.
ఎండ ధాటికి తట్టుకోలేక జంతువులు విలవిలలాడే దీన పరిస్థితి దాపురించడం విచారకరం. అక్కడక్కడ ఏమాత్రం నీడనివ్వని తుమ్మచెట్లు తప్ప మరో వృక్షం లేని దుస్థితి. పచ్చటి ప్రకృతి వాతావరణమే లేదు.
మొన్నటీ భారీ వరదలకు కూడా జంతువులు వారం రోజుల పాటు నీళ్లలోనే తడిసి విలవిలలాడి పోయినాయని జూపార్కు సిబ్భంది చెపుతూ వాపోయారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ కమీషనర్ కుడా వరంగల్ సహకారంతో జూపార్కు లోనికి ప్రవేశించే రెండు మురుగు కాలువలను డైవర్ట్ చేస్తూ బొంది వాగులోనికి పంపించేందుకు భూగర్భ డ్రైనేజీలను నిర్మించాలి.
జూపార్కు చుట్టూర అటవీ సిబ్బంది వాహనంలో తిరుగడానికి స్థలం ఉండాలి. కానీ ఈ స్థలమంతా జూ పార్కు ప్రహరీ గోడనానుకొని లేచిన అక్రమ బహుళ అంతస్తుల భవనాలతో నిండిపోయింది.
మున్సిపల్ అధికారుల అండదండలతో పది ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికై వదిలిన ఖాళీ స్థలమంతా కబ్జాలమయమైపోయింది.
నిర్మించిన ప్రహరీ గోడలు కూడా జంతువుల భద్రతకు అనుకూలంగా లేని రీతిలో ఉన్నాయి. ఎత్తైన గోడపై ఇనుప ముళ్ళతీగలను అమర్చాలి.
జూపార్కులో నాలుగు వైపులా నాలుగు ఎత్తైన మంచెల ఏర్పాటు జరగాలి. అవి లేవు.
మున్సిపల్ కమీషనర్ జిల్లా కలెక్టర్, కుడా అధికారులు ఈ పరిస్థితి గమనించాలి. సందర్శకులకే కాదు, వన్య ప్రాణుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా డ్రైనేజీల రూటు మార్చాలి.