ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ లోని ప్రతి నిరుద్యోగికి రు. 75400 బకాయి ఉందని, దీనిని తక్షణం వారి వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ డబ్బును జమ చేయక పోతే, తాను ఉద్యమం చేస్తానని ఆయన హెచ్చరించారు
రాష్ట్రంలోని నిరుద్యోగులందరికి నిరుద్యోగ భృతి ఇస్తామని 2018లోనే ప్రకటించారు. 2018 ఎన్నికల్లో టిఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. దీనితో నిరుద్యోగులకు ఉద్యోగాల ప్రకటన ఇవ్వలేదు. ఇస్తామన్న నిరుద్యోగ భృతీ ఇవ్వలేదు. సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులు భృతికోసం నమోదు చేసుకున్నారు. వీరు నమోదు చేసుకున్నప్పటినుంచి ఇప్పటి దాకా తీసుకుంటే ఒక్కొక్కరికి రు. 75400 బకాయీపడ్డారు దానిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
‘ఈ 25లక్షలకు పైగా నమోదై ఉన్న నిరుద్యోగులకు 2018 సంవత్సరం నుంచి నిరుద్యోగ భృతి చెల్లించాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగి అకౌంట్లో 75వేలు జమ చేసి, ప్రతి నెల రూ. 3016 అకౌంట్లో వేసి తీరాల్సిందే,’నని ఆయన అన్నారు.
వంశీ చంద్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే…
తెలంగాణ వచ్చినంకా టిఆర్ఎస్ పాలనలో ఎక్కువ నష్టపోయింది యువత, నిరుద్యోగులు.
తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో యువకులకు దొరికిన ఉద్యోగాలకంటే పొగొట్టుకున్న ఉద్యోగాలే ఎక్కువ.
14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం వాళ్ళ పోరాటాన్ని, త్యాగాన్ని పునాదిగా చేస్కొని వాళ్లు పేర్చిన మెట్ల మీద ముఖ్యమంత్రి గద్దె ఎక్కిన కేసీఆర్, వాళ్లకు తీరని ద్రోహం చేశారు..
ఉద్యమంలో కీలక భూమిక అయిన ఉద్యోగ ఉపాధి రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యం చేసింది .
ఇప్పుడు 50 వేల ఉద్యోగాలు, త్వరలో నిరుద్యోగ భృతి అంటూ మరో మోసానికి పూనుకున్నారు.
ఇప్పటి వరకు ఎవరు నిరుద్యోగి, ఎంతమంది నిరుద్యోగులు అనే అంశంపైనా ఒక కమిటీ వేయలేదు.. విధి విధానాలు రూపొందించలేదు.
టిఆర్ఎస్ కు మరోసారి ఓటమి భయం వెంటాడుతోంది. దాంతో రాబోయే మండలి, కార్పొరేషన్, నాగార్జున సాగర్ ఎన్నికలలో లబ్ది కోసం కేసీఆర్ మరోసారి యువతను మోసం చేసే కుట్ర చేస్తుంది.
కేసీఆర్ హయాంలో ప్రభుత్వం నియమించిన ఉద్యోగాల కన్నా తొలగించిన ఉద్యోగాలే ఎక్కువ.
యువత కేసీఆర్ కుట్రలను అర్థం చేసుకొని ఆయన ఎత్తులను, మోసాన్ని తిప్పికొట్టాలి.
వివిధ శాఖల్లో 2 లక్షలకు పైగా ఉన్న కాళీలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి.
ఉద్యోగ భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలి.
కాంట్రాక్ట్, ఔట్ సోర్చింగ్, గెస్ట్ ఫాకల్టీ పేరుతో శ్రమ దోపిడీ ఆపి నిరుద్యోగులకు అండగా నిలవాలి.
ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.