పోలవరం ఎత్తు విషయంలో బాధ్యతాయుతమైన చర్చ జరగాలి…

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)
పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (FRL)150 – 135 అడుగులుగా మార్పుచేసినా ప్రయోజనంలో మార్పులేనపుడు భావోద్వేగాలతో కాకుండా బాధ్యతతో చర్చ జరగాలి.
పోలవరం ప్రాధాన్యత……
రాష్ట్రంలో నీటి అవసరాలు తీర్చేది ప్రధానంగా గోదావరి , కృష్ణా నదులు. కృష్ణ నీటిని మిగులు జలాలతో సహా పంపిణీ చేసిన నేపద్యంలో అపారమైన నీటి లభ్యతకు అవకాశం ఉన్న గోదావరిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణా , గోదావరి , విశాఖ నగర మరియు పారిశ్రామిక అవసరాలకు గోదావరి నీరు ప్రదానం. అలా పోలవరం కీలక ప్రాజెక్టు అనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా , గోదావరి , విశాఖనగర మరియు పారిశ్రామిక అవసరాలకుగాను దాదాపు 360 టీఎంసీల నీటిని సరఫరా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
పోలవరం నీటి నిల్వ ప్రాజెక్టు కాదు
ప్రస్తుత డిజైన్ 150 అడుగులు నిల్వ 196 టీఎంసీలు. కుడికాలవ ( పట్టిసీమ) కృష్ణా డెల్టా , ఎడమ కాలువ (పురుషోత్తపట్నం) గోదావరి మరియు విశాఖ అవసరాలు. ఈ కాల్వల ద్వారా 360 టీఎంసీల నీటి సరఫరా చేయాలని ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇక్కడే కీలక విషయం పరిశీలన చేయాలి. 196 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేసి 360 టీఎంసీల నీరు ఎలా తీసుకుంటారు. 196 టీఎంసీల నిరులోకూడా డెడ్ స్టోరేజ్ పోను 150 టీఎంసీల నీరు కూడా వాడుకోలేము మరి 360 టీఎంసీల నీరు ఎలావాడుకుంటారు. అంటే పోలవరం నాగార్జున సాగర్ , శ్రీశైలంలాగా నిల్వ ఉంచిన నీటిని సరఫరా చేసే ప్రాజెక్టు కాదు. గోదావరినది 120 రోజులు ప్రవాహం ఉంటుంది. కనుక గ్రావిటీతో కుడి , ఎడమ కాల్వలకు నీరు డ్రాచేసుకునే అవకాశం ఉండేవిధంగా ఎత్తుమట్టం ఉంటే సరిపోతుంది.
కోస్లా కమిటీ , CWC ల పరిశీలన
గోదావరినదిని కేంద్రప్రభుత్వ పరిధిలోని CWC 29 సంవత్సరాలు పరిశీలించిన పిదప ఒక నివేదికను విడుదల చేసింది. అనేక అంశాలు ఉన్నప్పటికి పోలవరంతో ముడిపడి ఉన్న అంశాలు వరకే చర్చకు పెడుతున్నాను.
గోదావరి నది పెద్ద స్థాయిలో నీటిని తీసుకు వస్తుంది. ముఖ్యంగా పోలవరం సమీపంలో 51 కిలోమీటర్ల పొడవు , 2 కిలోమీటర్ల వెడల్పుతో నది ఉదృతంగా ప్రహిస్తుంది. ఈ మధ్య వచ్చిన వరదలలో కూడా దాదాపు 70 టీఎంసీల ప్రవాహం కొన్ని రోజుల పాటు ఉన్నది. ఇంతకు 2 , 3 రేట్లు కూడా చరిత్రలో నమోదు అయినది.
కీలక విషయం ఈ ప్రాంతంలో రోజుల వ్యవధిలో 30 టీఎంసీలు సిపిజి (సాదారణ భాషలో ఆవిరి , నీరు ఇంకడం) ఉంటుంది. జియాలజిస్టులు కూడా సిపిజిని గుర్తించినారు కానీ అందుకు గల కారణాలపై మరింత అధ్యయనం చేయాలని చెపుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా నీటిని నిల్వ చేసినా సిపిజి వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
ప్రవాహం ఉన్నపుడే నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం ఒక్కటే పరిస్కారం. కీలకమైన మరో అంశం శ్రీశైలం డ్యాం ఉన్న ప్రాంతం రాతితో కూడిన నేల. అదే పోలవరం శాండ్ రాతికూడి గోదావరితో పోల్చుకుంటే తక్కువ ప్రవాహం కలిగిన శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో చాలాసార్లు అనుమానాలు కలిగింది.
అలాంటిది శాండ్ స్వభావం కలిగి భారీ నీటి ప్రవాహం ఉన్న ప్రాంతంలో ఎక్కువ ఎత్తు కలిగి భారీగా నీటిని నిల్వ చేయడం రాజమండ్రితో సహా దిగువ ప్రాంతానికి భద్రత రీత్యా 150 అడుగులు సముచితమా అన్న కోణంలో కూడా ప్రభుత్వాలు పరిశీలన చేయాలి.
135 అడుగులతోనే 150 అడుగుల ప్రయోజనం పొందే అవకాశాలను నిరాకరించడం తగదు…
పోలవరం ప్రధాన ప్రయోజనం 360 టీఎంసీల నీరు డ్రా చేయడమే. కుడికాలవకు 131 అడుగులతో నీటి విడుదల చేయవచ్చు. ఎడమ కాలువకు 132 అడుగులతో విడుదల చేయవచ్చు. గోదావరి 120 రోజుల ప్రవాహం ఉంటుంది. కుడి , ఎడమ కాలువల ప్రస్తుత సామర్ధ్యం రోజుకు 17500 క్కుసెక్వ్యూలు. ఉభయ కాల్వల సామర్థ్యం కలిపితే రోజుకు 3 టీఎంసీలు. 120 రోజులు ఉంటుంది కాబట్టి 360 టీఎంసీల నీరు విడుదలకు 135 అడుగులు సరిపోతుంది. భవిష్యత్తులో అదనపు నీరు డ్రా చేయాలనుకుంటే కాల్వల సామర్ధ్యం పెంచుకుంటే సరిపోతుంది. కోస్లా నిపుణుల కమిటీ రెండు కాల్వలకు నీరు విడుదలకు సరిపడ స్థాయిలో మాత్రమే ప్రాజెక్టు ఎత్తుమట్టం ఉండాలని స్పష్టంచేసింది. దాదాపు ఇలాంటి అభిప్రాయాన్ని కేయల్ రావు గారు వ్యక్తం చేశారు. పోలవరం ప్రయోజనాలలో వ్యత్యాసం లేనపుడు. వేలకోట్ల రూపాయల ప్రజాధనం , డ్యాం భద్రత , రాజమండ్రి నగరంతో సహా క్రింద ప్రాంత ప్రయోజనాలతో ముడిపడిన పోలవరం ఎత్తు విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేయాలి….
పోలవరం ఎత్తుమట్టంతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు…
నేడు పోలవరం ఎత్తుమట్టంపై జరిగే చర్చలో రాజకీయ కోణం ప్రధానంగా కనిపిస్తుంది. కేసీఆర్ , జగన్ మైత్రి తెలంగాణ కోసం రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు పెట్టారని విమర్శలు. వారి ఇద్దరి రాజకీయ మైత్రిపై నేను వివరణ ఇవ్వడం లేదు. కానీ పోలవరం ఎత్తుమట్టం చుట్టూ తెలంగాణ ప్రయోజనాలు లేవు అని మాత్రం చెప్పగలను.
1. పోలవరం ప్రాజెక్టు ఉన్నది తెలంగాణ రాష్ట్రం తర్వాత అన్న విషయం మరిచిపోకూడదు. పోలవరంలో ఎక్కువ నీరు నిలిపితే సముద్రంలోకి వెళ్లే నీరు తగ్గుతుంది. వాడుకోలేకపోతే సముద్రంలోకి వెళుతుంది.
2. ఒక వేల నిర్వాసితుల సమస్య అనుకుంటే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన తర్వాత ఆ అంశానికి కూడా ప్రాధాన్యత లేదు.
3. గోదావరి ఎక్కువగా ప్రవహిస్తున్న రాష్ట్రం తెలంగాణ కానీ వారు గ్రావిటీతో నీరు వాడుకోలేని పరిస్థితి. ఒక వేల మొత్తం గోదావరి నీటిని వారి రాష్ట్రంలో నిలుపుకున్నా ( అసాధ్యం) పోలవరం ప్రాజెక్టు నీటి లభ్యతకు నష్టం రాదు. కారణం తెలంగాణతో సంబందం లేకుండా పుష్కలంగా ఉపనది శబరి నీటిని తీసుకువస్తుంది. అందుకే 7 ముంపు మండలాలను ఏపీలో కలిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సహకరించినా సహకరించకపోయినా పోలవరం ఆగదు. కేంద్రం మరియు ఒడిశా , ఛత్తీస్ గడ్ రాష్ట్రాలతో మాత్రమే సాంకేతికంగా సమస్యలు ఉంటాయి.
నేను ప్రతిపాదిస్తుంది నావ్యక్తిగత అభిప్రాయం ఏమాత్రం కాదు. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి అలుపెరగని కృషి చేస్తున్న విశ్రాంత ఇంజినియర్ సుబ్బరాయడు గారు పరిశీలించిన అంశాలు , విధానపరమైన కమిటీల నివేదికలలోని సిపార్సులను ఒక చోటికి చేర్చడం మాత్రమే నేను చేసింది. నీటి ప్రాజెక్టుల విషయంలో అపారమైన అనుభవం ఉన్న CWC , కోస్లా నిపుణుల కమిటీల సిపర్సులు. కేయల్ రావు  , పుచ్చలపల్లి సుందరయ్య  లాంటి గొప్పవారి చూచనలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ఎత్తుమట్టం విషయంలో నిర్ణయం తీసుకోవాలి…..