కోఠి గూటికి చేరిన కొవిడ్ వ్యాక్సిన్

హైద‌రాబాద్ : కరోనా టీకా హైదరాబాద్ చేరింది. నగరంలోని కోఠి ఆరోగ్య కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన  శీత‌లీకర‌ణ కేంద్రం దీనిని భద్రపరుస్తున్నారు. తెలంగాణలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ (పుణే ) తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలివిడత వాడుతున్నారు. పుణే నుంచి ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న 3.72 లక్షల డోసులున్న వ్యాక్సిన్ కన్ సైన్ మెంట్   మధ్యాహ్నానికి  శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకుంది. అక్కడి నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో మ‌ధ్యాహ్నం భద్రత మధ్య  ఒంటి గంటకు కోఠిలోని శీత‌లీక‌ర‌ణ కేంద్రం చేరింది. ఈ టీకాలను నిల్వ చేసేందుకు అక్కడ‌ 40 క్యూబిక్ మీట‌ర్ల వ్యాక్సిన్ కూల‌ర్‌లను ఏర్పాటు చేశారు.

ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో  కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభమవుతుంది.

తెలంగాణలో  1,213 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్‌కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను త‌ర‌లించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా వేయ‌నున్నారు. మొత్తంగా తొలుత 2.90 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్య సిబ్బందికి టీకా వేయ‌నున్నారు. వారంలో నాలుగు రోజులు వైద్య సిబ్బంది టీకాలు వేయ‌నుంది. బుధ‌, శ‌నివారాల్లో య‌థావిధిగా సార్వ‌త్రిక టీకాల కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది. ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు టీకా పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది.

ముందుగా ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి.. ఆ తర్వాత కొవిడ్‌ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందించ‌నున్నారు. ఆ తర్వాత 50 ఏండ్లకు పైబడిన వారికి, అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్య క్రమంలో అందించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

మంగ‌ళ‌వారం ఉద‌యం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి వ్యాక్సిన్‌ను ట్ర‌క్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు త‌ర‌లించారు. అక్క‌డ్నుంచి ప్ర‌త్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమాన‌శ్ర‌యానికి త‌ర‌లించారు. 3.72 ల‌క్ష‌ల డోసుల కొవిడ్‌ టీకాలు ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో రాష్ర్టానికి చేరుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *