రేపు విశాఖలో సీఎం జగన్‌ కు ఘన స్వాగతం, విశాఖ రాజధానికి టిడిపి మద్దతు

విశాఖపట్నంను పరిపాలనా రాజధాని గా ప్రకటించిన తర్వాత నగరానికి వస్తున్నరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆయన శనివారం నగర పర్యటనకు రానున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి విశాఖ ఉత్సవం జరుగుతున్న చోటు దాకా దాదాపు 24 కి. మీ పొడవునా మానవహారం ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి స్వాగతం చెప్పేుందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. విశాఖపర్యటనలో ముఖ్యమంత్రి దాదాపు రు. 1290 కోట్ల విలువయిన నగరాభివృద్ధి పనులకు శంకు స్థాపన చేస్తారు.
జగన్ విజయవాడ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు కైలాసగిరి మీదకు చేరుకుని వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం అక్కడి నుంచి 4.40 గంటలకు సెంట్రల్‌ పార్కుకు చేరుకుని జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు. ఆరు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి విజయవాడ వెళ్లిపోతారు.
చంద్రబాబు పిలుపును వ్యతిరేకించిన విశాఖ టిడిపి
ఇది ఇలా ఉంటే విశాఖ రాజధాని ప్రకటన తెలుగు దేశం పార్టీలో విబేధాలు సృష్టించింది. నిజానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. విశాఖ లోని ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్ స్థానాలను తెలుగుదేశమే గెల్చుకుంది. విశాఖను పాలనా రాజధాని చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు తెలుగుదేశం శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నాయకుడు ఆహ్వానించారు. అమరావతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చినా విశాఖ టిడిపి నేతలు పట్టించుకోలేదు. వారంతా నగరంలోని ఒక హోటల్ సమావేవమయి జగన్ ప్రకనట పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్ని వసతులున్న విశాఖ రాష్ట్ర రాజధాని చేయాలని ఇక్కడి తెలుగుదేశం నేతలు ఎపుడో 2014లొనే విజ్ఞప్తి చేశారని, దానిని పట్టించుకోలేదని, ఇపుడు ఆ అవకాశం వచ్చిందని , దానిని తిరస్కరించలేమని వారు చెబుతున్నారు. రాజధాని కావాలని శ్రీక్రిష్ణ కమిషన్ కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా వారు గుర్తుచేస్తున్నారు.