సొంత జిల్లాకు పివి పేరు పెట్టాలి : తెలంగాణ కాంగ్రెస్

శత జయంతి ఉత్సవాలు పురష్కరించుకుని మాజీ ప్రధాని పివి నరసింహారావు పుట్టిన జిల్లాకు ఆయనపేరు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.  ఇది సరైన గౌరవమని పార్టీ అభిప్రాపడింది.

ఏడాది పొడవునా మాజీ ప్రధాని, ప్రపంచ మేధావి పివి నర్సింహారావు శతజయంతి వేడుకలు నిర్వహించే విషయం చర్చించేందుకు  శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమావేశమయిన  పివి నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ ఈ డిమాండ్ చేసింది.  జిల్లాకు ఆయన పేరు పెట్టేలా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావాలని కూడా కమిటి నిర్ణయించింది.

వీడియో కాన్ఫరెన్స్ లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి ప్రధాన కార్యదర్శి కుంతియా, కమిటీ వైస్ చైర్మన్ ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేష్ కుమార్ గౌడ్ లతోపాటు ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, కోదండ రెడ్డి, మల్లు రవి, దాసోజు శ్రవణ్ , మాజీ మంత్రి వినోద్ నిరంజన్, కమలాకర్ రావ్, శ్యామ్ మోహన్, రాపోలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై గీతారెడ్డి ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ బిడ్డ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పివికి, కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉన్నదని అన్నారు.

‘పివి, కాంగ్రెస్ ఆత్మ, శరీరం లాంటివి అన్నారు. వాటిని విడదీయడం ఎవరికి సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీ లో ఉన్నత శిఖరాలు ఎక్కిన గొప్ప మహనీయుడు.  కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు ఆయన్ను స్వంతం చేసుకోలేరు ’ అని డాక్టర్ గీతా రెడ్డి అన్నారు.

సంస్కరణల పితామహునిగా పేరున్న పివి జులై 24న 1991 లో పార్లమెంట్లో ఆర్థిక సంస్కరణల బిల్లు ప్రవేశపెట్టారని అదే నేడు భారత దేశం ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేసిందని న్నారు.

అందువల్ల ఈ నెల 24న పివి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ముఖ్య నేతలు, పివి సన్నిహితులు అభిమాన నేతలు పాల్గొనేలా కార్యక్రమాన్ని చేయనున్నామని చెప్పారు.

ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసిన స్వాగతిస్తామని పివి కాంగ్రెస్ మనిశని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పక్షాన చేయబోయే కార్యక్రమాలలో పివి నర్సింహారావు కుటుంబసభ్యులను కూడా బాగస్వామ్యులను చేసి వారి సూచనలు కూడా తీసుకుంటామని ఆమె వివరించారు. పివి నర్సింహారావు శత జయంతి వేడుకలు ఘన విజయం అయ్యేందుకు అంత సహకరించాలని ఆమె కోరారు..