‘మునుగోడులో బీజేపీని ఓడించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’

 

  • మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి- ప్రొ.ఎస్.సింహాద్రి- సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు

మునుగోడు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటాపోటీగా మద్యం, డబ్బును ఓటర్లకు విచ్చలవిడిగా పంచుతూ
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ప్రొ. ఎస్ సింహాద్రి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కేంద్రంగా జరగాల్సిన ఎన్నికలు, విద్వేషం, మతతత్త్వం, డబ్బుల కేంద్రంగా రాజకీయాలు చేస్తూ, సమస్యలను దూరం చేయడం జరుగుతుందని ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి మాట్లాడుతూ.. విద్యా, వైద్యం, ఉపాధి, రైతు, స్త్రీ, యువకుల చర్చే లేకుండాపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజా ఆకాంక్షలకు ప్రమాదకరంగా తయారైందని అన్నారు.. దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ, దేశ ఆస్తులను, వనరులను, మౌలిక వసతులను, సేవలను కార్పొరేట్ మిత్రులకు పేలాలు, పుట్నాలు అమ్మినట్టుగా అప్పజెప్పుతోందని విమర్శించారు.
విద్వేషంతో దేశ ప్రజలను విభజిస్తూ, భారత జాతిని నిర్వీర్య పరుస్తోందని అన్నారు. దేశంలో విపరీతమైన ధరల పెరుగుదలను, నిరుద్యోగాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధి విధ్వంసకర రాజకీయాలను జరుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని కీలక అంశాలుగా పరిగణిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసి, ఆ పార్టీని ఓడించాలని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని
మునుగోడు నియోజక వర్గ ప్రజలకు ప్రొ.ఎస్.సింహాద్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కల బాబు గౌడ్, మారం తిరుపతి యాదవ్, మేకల కృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *