తెలంగాణ వానకారు పై ఒక వ్యాఖ్య

-కన్నెగంటి రవి,

తెలంగాణా వ్యవసాయం ఒక గందరగోళ దశలో కొనసాగుతున్నది . జాతీయ రాజకీయాల సన్నాహాలలో పడిపోయి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పాలనను,ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయాన్ని గాలికి వదిలేసింది . ఇతర రాష్ట్రాల రైతు సంఘాలను ఆహ్వానించి , ఇక్కడ రైతులకు చాలా మేలు జరుగుతున్నట్లుగా, ఇక్కడ పథకాలు అద్భుతంగా అమలు అవుతున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నది.
నిజానికి రైతు బంధు నిధులు పంపిణీ చేయడం తప్ప, ఇతర ఏ విషయం లోనూ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంలో ఒక ప్రణాళిక అంటూ లేదు. రైతు బంధు నిధులు కూడా కౌలు, పోడు లాంటి వాస్తవ సాగు దారులకు కాకుండా , వ్యవసాయం చేయని రైతులకు, భూములకు కూడా పంపిణీ చేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నది. ఉద్యాన పంటలలో కూరగాయల సాగుకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకుండా , ఆయిల్ పామ్ లాంటి పంట గురించి విస్తృత ప్రచారం చేస్తున్నది. ప్రోత్సహిస్తున్నది.

అమలు కాని పంటల ప్రణాళిక :

గత మూడేళ్ళ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని , రాష్ట్ర రైతులు కూడా పంటల ప్రణాళిక విషయం లో ప్రభుత్వం మాట వినే స్థితిలో లేరని, ఈ సంవత్సరం సాగయిన పంటల విస్తీర్ణం స్పష్టం చేస్తున్నది .
రాష్ట్రంలో 70 లక్షల ఎకరాలలో పత్తి, 50 లక్షల ఎకరాలలో వరి , 15 లక్షల ఎకరాలలో కంది సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి రైతులకు పిలుపు ఇచ్చింది . రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు అనేక జిల్లాలలో రైతులతో, అధికారులతో సమావేశాలు జరిపి ఈ పంటల ప్రణాళిక అవసరాన్ని వివరించారు. అయితే రైతులు తమకు తోచినట్లు గా పంటలు సాగు చేశారు.
2021 సెప్టెంబర్ 14 నాటికి రైతులు 50,95,678 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులు ఈ సారి ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా కేవలం 49,79,225 ఎకరాలలో పత్తి సాగు చేశారు. గత మూడు సంవత్సరాలుగా భారీ వర్షాల వల్ల దిగుబడులు పడిపోయి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవడమే దీనికి కారణం.

వరి విషయానికి వస్తే 2021 లో 52,09,639 ఎకరాలలో వరి సాగు చేసిన రైతులు ఈ సారి 63,82,345 ఎకరాలలో సాగు చేశారు. గత సంవత్సరం వరి వేయవద్దనీ, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనీ పిలుపు ఇచ్చి ప్రచారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం , సీజన్ చివరిలో వరి ధాన్యాన్ని కనీస మద్ధతు ధరలకు సేకరించింది. అదే సమయం లో ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులను అసలు పట్టించుకోలేదు. ప్రభుత్వం మాట విని వరి మానేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అందుకే ఈ సారి ప్రభుత్వం మాట వినకుండా తిరిగి వరి సాగు వైపు వెళ్ళిపోయారు.

2021 లో 42,558 ఎకరాలలో మినుము సాగు చేసిన రైతులు ఈ సారి కేవలం 29,293 ఎకరాలలో మాత్రమే సాగు చేశారు. గత సంవత్సరం 1,39,355 ఎకరాలలో పెసర సాగు చేసిన రైతులు ఈ సంవత్సరం కేవలం 66,838 ఎకరాలలో సాగు చేశారు. గత సంవత్సరం 57,163 ఎకరాలలో జొన్న సాగు చేసిన రైతులు ఈ సంవత్సరం కేవలం 35,907 ఎకరాలలో మాత్రమే సాగు చేశారు. గత సంవత్సరం 18,762 ఎకరాలలో వేరు శనగ సాగు చేసిన రైతులు ఈ సంవత్సరం 15,971 ఎకరాలలో మాత్రమే సాగు చేశారు. నిజానికి గత సంవత్సరం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసిన రైతులను ప్రభుత్వం పట్టించుకుని ఉంటే, ఈ సంవత్సరం వీటి విస్తీర్ణం గణనీయంగా పెరిగి ఉండేది.

అమలు కాని పంటల బీమా పథకం :

2020 ఖరీఫ్ నుండీ రాష్ట్రం లో పంటల బీమా పథకాలు అమలు కావడం లేదు. భారీ వర్షాలు , వడగండ్లు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలతో గత సీజన్లుగా రైతులు పంటలను నష్ట పోతూనే ఉన్నారు. కానీ రైతులకు ఒక్క రూపాయి కూడా బీమా పరిహారం అందడం లేదు. పైగా నష్ట పోయిన సందర్భంలో రైతులకు ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా అందడం లేదు .
2020 ఖరీఫ్ లో భారీ వర్షాలకు నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ, రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో రాష్ట్ర హైకోర్టు 2021 సెప్టెంబర్ 28 న అద్భుతమైన తీర్పు ఇచ్చింది. నష్ట పోయిన రైతులకు మూడు నెలలలోపు వివరాలు సేకరించి జనవరి 28 లోపు నష్ట పరిహారం చెల్లించాలని , పంటల బీమా పరిహారం కూడా చెల్లించాలని, కౌలు రైతులకు కూడా ఈ పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా , సుప్రీం కోర్టు కు వెళ్లింది. గత రెండు సంవత్సరాలుగా ఏ సీజన్ లోనూ నష్ట పోయిన రైతుల వివరాలను సేకరించలేదు. పరిహారం చెల్లించలేదు. గత మూడేళ్లుగా ప్రతి సంవత్సరం ఎత్తిపోతల రిజర్వాయర్ల తప్పుడు డిజైన్లతో పంట పొలాలు ముంపుకు గురై నష్టపోతున్నరైతుల గురించి కూడా ప్రభుత్వం అసలు మాట్లాడడం లేదు. వారికి పరిహారం చెల్లించడం కోసం ఆలోచించడం లేదు.

ఈ సీజన్ లో కూడా రైతులు అతి భారీ వర్షాలతో తీవ్రంగా నష్ట పోయినా, ఇంత వరకూ నష్ట పోయిన రైతుల వివరాలు ప్రభుత్వం సేకరించనే లేదు. అసలు అటువంటి చర్చ కూడా ప్రభుత్వం చేయడం లేదు. సంవత్సరం క్రితం రాష్ట్ర మిరప రైతులు తీవ్రంగా నష్ట పోయిన సందర్భంలో హడావుడి చేయడం తప్ప, ఆ రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదు .

రైతులకు అందని బ్యాంకు రుణాలు :

2014 జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండీ తెరాస ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఋణ మాఫీ హామీలను సరిగా అమలు చేయడం లేదు . 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఐదు విడతలుగా అమలు చేయడం వల్ల , రైతులకు ప్రయోజనం కలగలేదు సరి కదా , మొత్తం సంస్థాగత ఋణ వ్యవస్తే చిన్నాభిన్నమైపోయింది. పెండింగ్ బకాయిలు ఉన్నాయనే కారణంగా బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వడం మానేశాయి.

పైగా జీరో శాతం వడ్డీ రాయితీ పథకం కూడా రైతులకు అందుబాటులో లేకుండా పోయింది. బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ రాయితీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. 2018-2022 మధ్య కూడా ప్రభుత్వం రెండవ సారి ఇచ్చిన ఋణ మాఫీ హామీ కూడా సరిగా అమలు కావడం లేదు. అందుకే రైతుల పేరున బ్యాంకులలో బకాయిలు పేరుకు పోతున్నాయి.

పంట సాగు పెట్టుబడి కోసం రైతులకు ఖరీఫ్ పంట రుణాలు ( జూన్- సెప్టెంబర్ మధ్య ) అందడం అత్యంత కీలకం . కేవలం రైతు బంధు పెట్టుబడి సాహయం రైతులకు ఏ మూలకూ సరిపోదు . పత్తి, వరి లాంటి పంటలకు ఎకరానికి 35,000 వరకూ పెట్టుబడి అవుతుందని ప్రభుత్వమే అంచనా వేసింది. అందుకే బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు అత్యంత కీలకంగా రైతులకు ఉపయోగ పడతాయి.

2018 ఖరీఫ్ లో 50,25,000 మంది రైతులకు ప్రభుత్వం రైతు బంధు సహాయం చేస్తే , ఈ సీజన్ లో బ్యాంకులు కేవలం 17,65,858 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు అందించాయి. 2019 ఖరీఫ్ లో ప్రభుత్వం 51,61,000 మంది రైతులకు రైతు బంధు సహాయం అందిస్తే , బ్యాంకులు 18,60,155 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు అందించాయి. 2020 ఖరీఫ్ లో 58,02,000 మంది రైతులకు రైతు బంధు సహాయం అందిస్తే, బ్యాంకులు కేవలం 17,35,999 ఖాతాలకు పంట రుణాలు అందించాయి. 2021 ఖరీఫ్ లో ప్రభుత్వం 60,84,000 మంది రైతులకు రైతు బంధు పెట్టుబడి సహాయం అందిస్తే, బ్యాంకులు 15,46,804 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు అందించాయి. 2022 ఖరీఫ్ ఋణ పంపిణీ కూడా ఇందుకు భిన్నంగా ఉండక పోవచ్చు. పైగా నిజంగా వీటిలో ఎన్ని తాజాగా పంట రుణంగా అందించాయి, ఎన్ని కేవలం బుక్ అడ్జస్ట్ మెంట్ చేశాయి అన్నది చిదంబర రహస్యం.

రైతులకు రుణాలు బ్యాంకుల నుండీ అందడం లేదని ఎస్‌ఎల్‌బి‌సి నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ రుణాలపై ఆధార పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్ట పోతే, రుణాలు తీర్చలేని స్థితిలో పడుతున్నారు. అందుకే రైతుల ఆత్మహత్యలు భారీగా జరుగుతున్నాయి.

ఇతర సబ్సిడీ పథకాల అమలు తీరు :

తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం , ఈ సంవత్సరం నుండీ ధనూకా అనే పురుగు విషాలు అమ్మే కంపెనీ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది . రైతులకు పురుగు విషాలు ఎలా వాడాలో ఈ కంపెనీ అవగాహన కల్పిస్తుందని ప్రకటించారు . కానీ ఈ కంపెనీ సరఫరా చేసే పురుగు విషమే నాణ్యత కలిగినది కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిషేధం విధించింది. మీటర్ అనే కంపెనీ పురుగు విషాన్ని కూడా నిషేధించారు . ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తతంగమే. వ్యవసాయ శాఖ అధికారులు ముందుగా అవినీతికి పాల్పడి నకిలీ విత్తనాలకు, పురుగు విషాలకు అనుమతులు ఇవ్వడం ,చెదురు మదురుగా అక్కడక్కడా విత్తన కంపెనీల గోదాములపై దాడులు చేయడం , ఒకటి రెండు విషాలను నకిలీ పేరుతో నిషేధించడం సర్వ సాధారణమై పోయింది.
ప్రభుత్వ విత్తన రాయితీ పథకాల అమలు కూడా గత నాలుగేళ్లుగా క్రమంగా తగ్గుతూ వచ్చి ఈ సంవత్సరం పూర్తిగా నిలిచిపోయింది. ఈ సారి రైతులు విత్తనాల కోసం పూర్తిగా ప్రైవేట్ కంపెనీలపై ఆధార పడ్డారు. వివిధ పంటలలో నకిలీ విత్తనాల బారిన పడి తీవ్రంగా నష్టపోయారు.

రైతులకు అవసరమైన యంత్రాలను సబ్సిడీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పథకాలు కూడా నిలిచిపోయాయి. బడ్జెట్ లో నిధుల కేటాయింపు కూడా తగ్గిపోయింది. కేటాయించిన నిధులను కూడా సరిగా ఖర్చు పెట్టడం లేదు.

పంటల కొనుగోలుకు ఏర్పాట్లేవీ?

గత రెండు సంవత్సరాలుగా ప్రతి సీజన్ లో వరి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు మనం చూస్తున్నాం . ప్రభుత్వం సేకరణ ఏర్పాట్లు చేస్తున్నాను అని చెబుతుంది కానీ, అవి అరకొరగా ఉంటున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి సేకరణ కేంద్రాలను తెరవకుండా , కనీసం ఒక నెల ఆలస్యం చేస్తున్నారు. అక్టోబర్ ప్రారంభం లోనే పంట చేతికి వచ్చే ధాన్యం రైతులు , ప్రభుత్వ సేకరణ వ్యవస్థ లేక తక్కువ ధరలకే పంటను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడం మనం చూస్తున్నాం. ధాన్యం నింపడానికి సంచులు ఉండడం లేదు . హమాలీల కొరత, ట్రాన్స్ పోర్ట్ వాహనాల కొరత ప్రతి సీజన్ లో రైతులు ఎదుర్కుంటున్నారు . పంట కోతకు వచ్చాక అకాల వర్షాలు కూడా రైతులకు నష్టం చేస్తున్నాయి. గ్రామాలలో ధాన్యం ఆరబోయడానికి సరైన డ్రయ్యింగ్ యార్డులు అందుబాటులో ఉండడం లేదు. గ్రామ పంచాయితీ స్థాయిలో గిడ్డంగులు కూడా అందుబాటులో లేవు. రైస్ మిల్లర్లు ఇదే అదనుగా నాణ్యత పేరుతో , ధాన్యంలో విపరీతంగా కోత పెడుతున్నారు. కనీస మద్ధతు ధరలు కూడా అందక రైతులు నష్టపోతున్నారు.

గత రెండు సీజన్ లలో ఎఫ్‌సి‌ఐ కీ, రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవి పరిష్కారం కావడం లేదు. తెరాస, బీజేపీ మధ్య రాజకీయ వివాదాలు కూడా ఇందుకు కొంత కారణమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం లో రైస్ మిల్లర్లు పావులుగా మారారు. తమకు లాభం వచ్చే విధంగా , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో దోబూచు లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతి సీజన్ లో ఎఫ్‌సి‌ఐ కి సరఫరా చేయాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి‌ఎం‌ఆర్ ) సకాలంలో సరఫరా చేయడం లేదు. సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యత కూడా ఉండడం లేదు. దీనిపై ఎఫ్‌సి‌ఐ సీరియస్ గా ఉండడంతో , నాయన్య్త లేని బియ్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సరఫరా చేస్తూ మిల్లర్లు చేతులు దులుపుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆర్ధికంగా నష్ట పోవడమే కాక , రేషన్ బియ్యం వినియోగదారులు కూడా వాటిని తినలేక ఇబ్బంది పడుతున్నారు.

మరో 15 రోజుల్లో మళ్ళీ పంటలు కోతకు వస్తాయి. ఎఫ్‌సి‌ఐ ఈ సీజన్ లో 50 లక్షల టన్నుల బియ్యం సేకరిస్తాను అని ఇప్పటికే చెప్పింది. అంటే దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం అన్న మాట. ఈ సీజన్ లో వరి సాగు విస్తీర్ణాన్ని బట్టి రాష్ట్రం లో సుమారు కోటీ 30 లక్షల టన్నుల వరకూ ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం సేకరించే ధాన్యానికి రెట్టింపు అన్నమాట.
మరి ఇంత ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు సరిగా చేయకపోతే ఈ సీజన్ లో కూడా రైతులు నష్ట పోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు కూడా కనీస మద్ధతు ధరలు అందించడానికి ప్రభుత్వం వాటిని సేకరించాలి.

 

కన్నెగంటి రవి

*కన్నెగంటి రవి,   రైతు స్వరాజ్య వేదిక ,
ఫోన్: 99129 28422

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *