మళ్ళీ శ్రీవారి ఆర్జిత సేవల క‌రంట్ బుకింగ్

తిరుమ‌ల‌, 2022 మార్చి 30:

రెండేళ్ల విరామం త‌రువాత ఆర్జిత సేవా టికెట్ల క‌రంట్ బుకింగ్ పునఃప్రారంభం. మార్చి 31 నుండి ల‌క్కీడిప్ సేవ‌లు, అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్ల కేటాయింపు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ను ఆఫ్‌లైన్‌లో ల‌క్కీడిప్ ద్వారా భ‌క్తుల‌కు కేటాయించే విధానం రెండేళ్ల విరామం త‌రువాత మార్చి 31న పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం సిఆర్‌వో జ‌న‌ర‌ల్ కౌంట‌ర్ల‌లో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా 2020, మార్చి 20న శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం నిలుపుద‌ల చేయ‌డంతోపాటు ఆర్జిత సేవల కేటాయింపును నిలిపివేసిన విష‌యం తెలిసిందే. దాదాపు రెండేళ్ల త‌రువాత ఈ విధానాన్ని టిటిడి తిరిగి ప్రారంభించింది.

టికెట్ల కేటాయింపు ఇలా జ‌రుగుతుంది…

– నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం యాత్రికులు తిరుమలలోని కరంట్ బుకింగ్ కౌంటర్‌లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

– రెండు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లు వ‌స్తాయి. ఒక స్లిప్ యాత్రికునికి అందిస్తారు. ఇందులో వారి నమోదు సంఖ్య, సేవ‌ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్ నంబర్ మొదలైనవి ఉంటాయి. మరొక స్లిప్ రెఫ‌రెన్స్ కోసం కౌంటర్ సిబ్బంది ఉంచుకుంటారు.

– నమోదు చేసుకున్న గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంట‌ల‌కు ఆటోమేటెడ్ రాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా ఎల్ఇడి స్క్రీన్ల‌లో మొద‌టి డిప్ తీస్తారు.

– సాధారణంగా, శుక్రవారం అడ్వాన్స్‌డ్ బుకింగ్ టికెట్లు కలిగి ఉన్న గృహస్తులు గురువారం రాత్రి 8 గంటలలోపు ఆర్జితం కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. అలా ఎవ‌రైనా చేయ‌ని ప‌క్షంలో ఆ టికెట్ల‌ను రాత్రి 8.30 గంటలకు రెండోసారి నిర్వహించే లక్కీడిప్ కోసం కరంట్ బుకింగ్‌కు మళ్లిస్తారు.

– ల‌క్కీడిప్‌లో టికెట్లు పొందిన గృహస్తులు వాటిని కొనుగోలు చేసేందుకు రాత్రి 11 గంట‌ల‌లోపు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్‌ ద్వారా స‌మాచారం తెలియ‌జేస్తారు. టికెట్లు పొంద‌ని వారికి కూడా ఎస్ఎంఎస్ ద్వారా తెలియ‌జేస్తారు.

– యాత్రికులు డిప్ విధానంలో అవకాశాన్ని పొందడం కోసం ఆటో ఎలిమినేషన్ ప్రక్రియ అమలవుతుంది.

– యాత్రికులు డిప్ విధానంలో ఏదైనా ఆర్జిత సేవ పొంది ఉన్న‌ట్ట‌యితే ఆరు నెల‌ల వ‌ర‌కు తిరిగి వారు ఆర్జిత సేవల‌ను పొందేందుకు అనుమతించబడరు. యాత్రికులు ఒక ఆర్జిత సేవకు మాత్రమే నమోదు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.

– సేవ‌ల‌ నమోదు కోసం ఆధార్ తప్పనిసరి. ఎన్ఆర్ఐలు అయితే పాస్‌పోర్ట్ చూపాల్సి ఉంటుంది. యాత్రికులు ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డుతో స్వ‌యంగా హాజ‌రుకావాలి.

– కొత్తగా పెళ్లయిన జంటలకు నిర్ణీత కోటా ప్రకారం వివాహ కార్డు, లగ్న పత్రిక, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు స‌మ‌ర్పిస్తే కల్యాణోత్సవం టికెట్ల‌ కేటాయింపు జ‌రుగుతుంది. వివాహం జ‌రిగి 7 రోజులు మించ‌కుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న టికెట్లు కేటాయిస్తారు.

– భక్తులు పై మార్గదర్శకాలను గమనించవలసిందిగా కోర‌డ‌మైన‌ది.

మార్చి 31 నుండి అంగప్రదక్షిణం టోకెన్ల జారీ…

అంగప్రదక్షిణం టోకెన్లను కూడా టిటిడి పునరుద్ధరించింది. కోవిడ్‌కు ముందు ఉన్న త‌ర‌హా ఏర్పాట్లతో మార్చి 31వ తేదీ నుండి ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుమలలోని పీఏసీ- 1లో రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేస్తారు.

సాధార‌ణంగా శుక్రవారాల్లో అభిషేకం కారణంగా భక్తులకు దర్శనం లేకుండా అంగ ప్రదక్షిణకు మాత్రమే అనుమతిస్తారు. ఈ కార‌ణంగా ఏప్రిల్ 1న శుక్ర‌వారం అభిషేకం కార‌ణంగా అంగ‌ప్ర‌ద‌క్షిణ భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *