‘బకాసుర’ కథ! చెప్పే పాఠాలు (3)

(దివి కుమార్)
రాజ్యానికుండే అణచివేత స్వభావాన్ని మూడు పాత్రలు
1.బలభద్రుడనే సాహస యువకుడు, 2.బండివాడు,
౩.భీముడు ద్వారా కొ.కు. మరింత స్పష్టపడేటట్లు చేశారు.
బలభద్రుడు సాహసవంతుడైన సూత యువకుడు. పదిమంది కలసి, తమ స్వీయ శక్తియుక్తులతో ఒక పనిని సాధించగలుగుతామనే ఆత్మవిశ్వాసం గలవాడు. తనలాంటి మరికొందర్ని వెంట పెట్టుకొని బకాసురుణ్ణి చంపాలని బయలుదేరతాడు. అతనికి రాజ్యానికి వుండే వర్గ స్వభావంగానీ, క్రౌర్యంగానీ తెలియవు. బకుడి సమస్య చాలా చిన్నదిగానే అతను భావిస్తాడు. తీరా పదిమంది యువకులతో కలసి వెళ్ళి బకునికోసం వెదికినా వాడు దొరకలేదు. కానీ, అలా వెళ్ళినవారు రాజ్యానికి దొరికిపోయారు. అప్పుడు బలభద్రుడిని–
నువ్వేనా జనాన్నిరాక్షసుడిపై యుద్ధానికి తీసుకుపోయే ప్రయత్నంలో వున్నది. అని రాజు అడిగాడు. చిత్తం మహారాజా అన్నాడు బలభద్రుడు.
“నువ్వీనగరానికి రాజువా?”
“కాను మహారాజా తమరుండగా….?”
“నిన్ను నగర రక్షకుడిగా నియమించానా?”
“లేదు మహారాజా!”
మరి నీకు జనాన్ని పోగుచేసే అధికారం ఎవరిచ్చారు? రాక్షసుడంటూ నిజంగా ఉన్నప్పటికీ వాడి సంగతి చూడవలసింది మేము. అవునా?
“ఈ భాగ్యానికి తమకు శ్రమదేనికి మహారాజా? మేము పదిమంది కర్రలు తీసుకొనిపోతే వాడు మా కళ్ళపడకుండా దాక్కున్నాడు”
“మీకు వాడు కనిపించనుకూడా లేదా?”
“లేదు మహారాజా”
“లేనివాడు ఎలా కనబడతాడు?”
“ఉన్నాడు మహారాజా! వాడిప్పటికి ముప్పైమందిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ముఫ్పైమంది ఒక్కసారిగా వాణ్ణి ఎదిరించి కొట్టినట్లయితే పీడ వదిలిపోయుండేది.”
రాజుగారు అకస్మాత్తుగా కళ్ళనిప్పులు రాలుస్తూ “పాపీ! నీ దొంగవేషాలు చాలించు. నీవు జనరక్షకుడననిపించుకుని జనాన్నికూడగట్టుకొని రాజువు కావాలని చూస్తున్నావు. ఒక వంక జనాన్ని హడలగొట్టడానికి రాక్షసుడున్నాడన్నావు. నీ ఎత్తు సగం పారింది. ఈ అమాయకులను వెంటేసుకొని తిరిగి వచ్చావు. ఇలా నాలుగుసార్లు తిరిగి ఏ అభాగ్యుణ్లో చంపి, రాక్షసుణ్ణి చంపినట్లు చెప్పుకుని, ఏకచక్రపురాన్ని రాక్షసుడి బారినుండి కాపాడానని మూఢులైన ప్రజలను సులువుగా నమ్మిస్తావు.
మంత్రీ! ఈ రాజద్రోహి తలతీయండి. ఈ మిగిలిన వాళ్ళందరినీ కారాగృహంలోకి తోయించండి” అన్నాడు.
ప్రజలకు మేలు చెయ్యాలనే బలభద్రుని ఆలోచనను రాజ్యాన్ని కూల్చివేసి అధికారాన్ని పొందాలనే పన్నాగంగా ‘రాజ్యం’
భావించింది. శాంతిభద్రతలు, దేశరక్షణ తను మాత్రమే నిర్వహించాల్సిన కర్తవ్యంగా భావించటమే కాక, అందుగురించి ప్రజల ప్రయోజనం మేరకు సొంత చొరవతో ప్రజలు చేసుకొనే జోక్యాన్ని కూడా ఈ రాజ్యం సహించలేదు.
రెండవపాత్ర – బండివాడు. అతడే బకాసురుణ్ణి ప్రత్యక్షంగా ఎరిగినవాడు. బకుడు అందరూ అనుకునేంత బలవంతుడేమీ కాదని గ్రహించినవాడు. అది రాజ్యానికి ప్రమాదం. కనుక వాడికీ ప్రమాదమే. నిజం తెలిసిన బండివాడిని చంపినా మర్నాడు మరొకడైనా ఆ నిజాన్ని తెలుసుకుంటాడు. అందుకే బండివాని నాలుక కోయించి మూగవానిగా మార్పిస్తాడు రాజు. నిజాలు తెలిసినా, తెలియనట్టు మూగవాళ్ళుగా ప్రజలు బతకాలని రాజ్యం కోరుకుంటుంది అనేదానికిది చక్కని ఉదాహరణ.
సమాచారహక్కు చట్టం ద్వారా నిజాలు తెలుసుకున్న కొందరు సామాజిక కార్యకర్తల, జర్నలిస్టుల జీవితాలు, మాఫియా పోలీసుల జోక్యంతో ముగియటం పత్రికల ద్వారా మనం చూస్తూ వున్నాం. రాజ్యానికి ముప్పుకలిగించే నిజాలు జనాంతికంగానే వుండాలి తప్ప స్పష్టమైన రుజువులతో దొరకకూడదన్నది, ముఖ్యంగా రాజ్యానికి పరీక్ష కాకూడదన్నది ఇక్కడి సారాంశంగా మనం గ్రహించటం ముఖ్యం.
చివరిదీ, మూడవదీ – బకాసుర సంహారం తర్వాత రాజ్యం  అసలు స్వరూపాన్ని గగుర్పాటు కలిగించేంత భయంకరమైన నగ్నసత్యంగా కొ.కు. చెబుతారు.
బకుడిని చంపేసినట్లు తెలియగానే అజ్ఞాని సహజంగానే అంటాడు. ఒక్క కుర్రాడి చేత చచ్చే రాక్షసుడి కోసం ఎంతమంది ప్రాణాలు బలిచేశామండీ అని. ఆరాత్రి రాజుకూ మంత్రికీ నిద్రపట్టలేదు.
“ఇక ఈ నగరంలో మనం తలెత్తుకు తిరగలేం.” అన్నాడు మంత్రి.
“ఇప్పటికైనా నిజాన్ని అబద్ధం చేసేటందుకు ఏదైనా ఉపాయం ఉందేమో”నని రాజు!
“ఆ చంపినవాడు మనిషికాదని ప్రచారంచేస్తే” – మంత్రి.
“ఆ ప్రచారం ప్రజలే చేస్తున్నారు – వాడి మీద గౌరవం కొద్దీ!!
వాణ్ణి రాజుని చేసేస్తారు. నిశ్చయం! – రాజు.
అజ్ఞాని చెప్పినట్లు ఆ కుర్రాణ్జి మనం విందుకు పిలిచి విషంపెట్టి చంపేస్తే…
“బాగానే వుందికానీ అదికూడా మననే కట్టికుడిపితే”
“ఒక ఆలోచన”
“ఏమిటది?”
“వాడు బకాసురుణ్జిమించిన రాక్షసుడని ప్రచారం చేస్తే
“సాధ్యమా?”
ఈ నగరంలో రోజు కొకణ్ణి చంపేసి, అదీ వీడిపనే అంటే సరి!
“దివ్యంగా ఉంది అలోచన”
రాజ్యం ప్రజా సంక్షేమం కోసమే ఏర్పడ్డదిగా, అది ప్రజలందరిదిగా భావించే అమాయకులను, అలాగని నమ్మించాలని చూసే మాయకుల నుండి ‘బకాసుర’ కథ కనువిప్పు కలిగిస్తుంది.
సాధారణ ప్రజలందరూ బాగా ఎరిగిన ఒక పౌరాణికగాధ ద్వారా సులువుగా అర్ధం గాని ఎంతో సంక్లిష్టమైన రాజ్యం యొక్క వర్గ స్వభావాన్ని తేలికగా అర్ధం చేసుకునే రీతిగా మార్చిన విధం, గొప్ప సృజనాత్మక విశేషం. అంతేకాదు కొ.కు. మేధాశక్తికీ, సామాజిక పరిజ్ఞానానికీ కూడా ఈ కథ నిదర్శనంగా నిలుస్తుంది.
దీని ద్వారా….
1. రాజ్యం- సాధారణ ప్రజలందరి ప్రయోజనాల కొరకు కాక ఉన్నతవర్గాలకు సేవచేసేదిగా ఉంటుంది.
2.సత్యాన్ని మూగబుచ్చుతుంది, 3.అదిప్రజల చొరవను విరిచేస్తుంది.
4. రాజ్యానికి వర్ణస్వభావం ఉండి తీరుతుంది.
ఉదా! ప్రభుత్వం భూసంస్కరణల చట్టం చేస్తుంది. దాని ప్రాతిపదికన ప్రజలు చొరవ చేసి భూములు పంచుకునే ప్రయత్నం ఎంత నిజాయితీగా చేసినా, అది చట్టవిరుద్ధమంటుంది. కేసులు పెడుతుంది. జైలుపాలు చేస్తుంది. సంపన్నుల దోపిడీకి మాత్రం అండగా ఉంటుంది.
మరో ఉదాహరణ: ప్రజలకేదైనా విపత్తు సంభవించినపుడు, ఆ విపత్తునుండి ప్రజలను కాపాడటమనే ధర్మాన్ని కాక, ఆ విపత్తును తమ సంపన్న వర్గ ప్రయోజనాలకు వాడుకోవటమెట్లాగనే రాజ్యం ఆలోచిస్తుంది.
ఉదాహరణకు!
1. అమెరికా రాజ్యం టెర్రరిజమనే ప్రపంచవ్యాపిత ప్రమాదాన్నెదుర్కొంటున్నామని చెబుతుంది. నిజంగా అది టెర్రరిజాన్ని లేకుండా చేసి ప్రపంచ ప్రజలను కాపాడుతోందా, అంటే అదేమీ లేకపోగా దానిపేరుతోనే దేశదేశాల్ని పునరాక్రమించుకోవటానికి టెర్రరిజాన్ని సాధనంగా చేసుకుంది. ఇంకా లోతుకెళ్ళి మాట్లాడుకుంటే అమెరికన్‌ సమ్రాజ్యవాదమే టెర్రరిజాన్ని సృష్టించి – దానితో యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తూ తనతో కలసిరాక తప్పని స్థితిని పరాధీన రాజ్యాలకు సృష్టించి ప్రజల్ని మరింత లోబరుచుకుంటుంది.
2. ఒక సమస్యగా తీసుకొని ఆలోచిస్తే నేటి ప్రత్యేక తెలంగాణ’ ను భారతరాజ్యం ఎలా సుదీర్హకాలం నలుగుతూ ఉండే సమస్యగాచేసి నడిపిస్తోందో గమనించవచ్చు. ప్రజల్ని మౌలిక సమస్యలైన అధికధరలు, నిరుద్యోగం, గ్రామాలకు గ్రామలను, వారి భూములను సెజ్‌లు పేరిట స్వాధీనపరుచుకోవటం; అవినీతి, కుల, మత పీడనలు, స్త్రీలపై పెచ్చరిల్లుతున్న హత్యాచారాలు, నీచ సాంస్కృతిక విధానాలు…లాంటివాటిపై ఐక్యంగా, సంఘటితంగా ఉద్యమించనీయకుండా…. ఎంత బాగా పక్కదారి పట్టించగలుగుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
3. పూర్వజన్మ, పునర్జన్మలు లాంటి సమస్త మూఢ విశ్వాసాల్నీ, ప్రజల శక్తియుక్తులను నిర్వీర్యపరచే భావజాలాల్నీ… అంతిమంగా ప్రజల్ని నిమిత్త మాత్రులుగా, దేవునిపైనో, రాజ్యంపైనో అధారపడి సహాయానికి దేబిరించేవారిగా ‘రాజ్యం’ మారుస్తుందని మేధావి పాత్ర ద్వారా ఈ కథ చెబుతుంది.
4. ప్రజలలో `సత్యం’ దాగి వుంటుందనీ పాలకులు దాన్ని `అజ్ఞానం’ అన్నా అది వ్యక్తమవుతూనే వుంటుందనీ, అది ప్రజల అనుభవాలనూ, అకాంక్షలనూ ప్రతిబింబిస్తుందని చెబుతుంది.
5. నేటి ఆధునికయుగంలో భీముడి పాత్రని ఎలా అర్ధం చేసుకోవాలి? అంతటి బలసంపన్నత ఎక్కడి నుండి వస్తుంది? ప్రజల సంఘటిత ఐక్య ఉద్యమ శక్తి మాత్రమే, ఒక్కమాటలో `ప్రజాశక్తి’ మాత్రమే నేటి విపత్తులను ఓడించి ప్రజలను కాపాడగలుగుతుంది. భగత్‌సింగ్‌ చెప్పినట్లు అలాంటి విప్లవశక్తులు గ్రామాలలో రైతుకూలీలుగా, పట్టణాల్లో కార్మికులుగా ఉన్నారు. శ్రామిక ప్రజలు సాగించే సంఘటిత ఉద్యమం మాత్రమే అధునికదోపిడీ రాజ్యాలను వాటి కుట్రలూ, కూహకాలనూ ఓడించి ప్రజాస్వామిక రాజ్యాన్ని నిర్మించగలుగుతుంది. అందుకు పూనికవహించటమే నేటివిద్యార్ధి యువజనులు నిర్వహించాల్సిన మొదటి కర్తవ్యం.
ముగింపు
1961లో సరిగా 52 సంవత్సరాలక్రితం (నేటికి 60 ఏళ్ళ క్రితం– దివి) కొ.కు. ఈ `బకాసుర’ కథను రాశారు. అప్పటికి భారతస్వాతంత్రం వచ్చి 14సంవత్సరాలు. జవహర్‌లాల్‌నెహ్రూ ప్రారంభించిన పంచవర్ష ప్రణాళికలు రెండు పూర్తయి మూడవదానికి సిద్ధమవుతున్న కాలంలో ఈకథ రాశారు. ప్రపంచ రాజ్యాలలో మనది అతిపెద్ద ప్రజాస్వామిక దేశమనీ, ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజలే నిర్మించుకుంటున్న దేశమనీ `మేధావు’లచేత ప్రశంసలండుకుంటున్న రోజులలో యిది బడా పెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాలకొరకు, సామ్రాజ్యవాదులతోషరీకయిన రాజ్యమని వాదించే ‘అజ్ఞాను’లు కూడా వుండేవారు . అయితే సాధారణ జీవితానుభవం ఎలా వుండేది?
అకాశం అంటుకునే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు.
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు – శ్రీశ్రీ – (రచన 1961- బకాసుర రాసిన సంవత్సరమే)
వ్యక్తిగత ఆస్తులను కాపాడే రాజ్యం సంపన్నవర్గాల ప్రయోజనాల పరిరక్షణకే పూనుకుంటుంది. శ్రామిక పేదవర్గాలను ఇంకా దోచుకోవడానికే దోహదం చేస్తుంది. రాజ్యానికి ధనికులు – పేదలలో ఏదో వొక వర్గ అనుకూల స్వభావం మాత్రమే ఉంటుందనీ వర్గాలకు అతీతంగా, అందరికి ప్రాతినిధ్యం వహించదనీ చెప్పటమే కొ.కు. ఉద్దేశ్యం.
అందుకు అయన ‘బకాసుర’ కథను ఎంపిక చేసుకుని మనకు అతిసులువుగా దోపిడీ వర్గాల ‘రాజ్యం’ యొక్క స్వభావాన్ని
తెలుసుకొనేట్టు చేశారు. లెనిన్‌ రాసిన ‘రాజ్యంగయంత్రం-విప్లవం’ అనే గొప్ప మార్కిస్టు సిద్ధాంత గ్రంధం అర్థం చేసుకోవటానికి ఈ `బకాసుర’ సులువైన దారిని చూపే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. (అయిపోయింది)
ఈ కథ విశ్లేషణ క్రమం ఇదీ!
‌ (కొడవటిగంటి కుటుంబరావు గారి ‘బకాసుర’ కథ అచ్చులో 26 పేజీలుంటుంది. దీనిని కేతు విశ్వనాధరెడ్డిగారు నవలిక అన్నారు. దీని ఆధారంగా నెమలికంటి తారక రామారావు గారు ఒక నాటకాన్ని ( బకాసుర ) రూపొందించి హైదరాబాదు, తెనాలి , బొంబాయి లాంటి చోట్ల ప్రదర్శించారు. నేను మొదటి సారి 2006లో కొ.కు . బకాసురుడింకా సజీవుడే అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. ఆ తర్వాత నెమలికంటి వారి నాటకంపై కొ.కు. శతజయంతి ప్రత్యేక సంచిక ప్రజాసాహితిలో (2009 అక్టొబర్) విమర్శనాత్మక సమీక్ష చేశాను. నెమలికంటి తారకరామారావు గారు రాజ్యం యొక్క వర్గ తత్త్వాన్ని అర్థమే చేసుకోలేదని నా విమర్శ. నూతన తరాలకు ఈ కథ లోతుగా అర్థమవాలనే ఉద్దేశ్యంతో సోదాహరణంగా వివరించి ఇలా 2013లో ఈ రూపంలో తిరిగి రాశాను. ఇది 2015 వ సంవత్సర0లో సి.పి.ఐ.(ఎం) వారి సైద్ధాంతిక మాస పత్రిక మార్క్సిస్టు లో ప్రచురణయింది.)
ఈ వ్యాసం మొదటి భాగం

‘బకాసుర’ కథ! చెప్పే పాఠాలు (1)

ఈ వ్యాసం రెండో భాగం ఇక్కడ చదవండి

‘బకాసుర’ కథ! చెప్పే పాఠాలు (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *