‘హుజురాబాద్ ఎన్నికని రద్దు చేయాలి’

ఎన్నికల కంటే వేలంపాట పెట్టడం మేలు. అప్రజస్వామ్యంగా జరుగుతున్న ఎన్నికని రద్దు చేయాలి: దేశ ఎన్నికల కమీషనర్ కి ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ వినతి.
‘హుజూరాబాద్ ఎన్నికలని టీఆర్ఎస్, బిజేపీ పార్టీలు వ్యభిచారం కంటే నీచంగా మార్చాయి. టీఆర్ఎస్ , బిజేపీల తీరు చూస్తుంటే.. ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికలు కంటే వేలంపాట పెట్టుకోవడం ఉత్తమమనే పరిస్థితి తీసుకొచ్చి ఎన్నికలని అత్యంత జుగుప్సాకరమై స్థితికి దిగజార్చారు” అని ధ్వజమెత్తారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.
హుజురాబాద్ ఎన్నికలలో టీఆర్ఎస్, బిజేపీల ఎన్నికల కోడ్ ని ఉల్లంఘిస్తూ., అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వివరిస్తూ ఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ని కలసి వినతి పత్రం అందజేశారు. టీఆర్ఎస్, బిజేపీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికలని అప్రజస్వామ్యంగా మార్చారని, అడుగడుగున ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించిన హుజురాబాద్ ఉప ఎన్నికని రద్దు చేయాలని కమీషర్ కి విజ్ఞప్తి చేశారు దాసోజు.
అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ.. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా ? ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందా? నేరుగా వేలం పాట పెడితే ఎవరు ఎక్కువకి పాడితే వారికే ఎమ్మెల్యే స్థానం ఇచ్చేస్తే సరిపోతుంది. అంతేకానీ ఎన్నికల పేరు మీద ప్రభుత్వం యంత్రంగాం అంతా వాడుకొని, ప్రజలని ప్రలోభాలకు గురి చేస్తూ .. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాల్సిన అవసరం ఏమింది ? అని ప్రశ్నించారు దాసోజు.
హుజురాబాద్ ఎన్నికలో బిజెపి అభ్యర్ధి సీల్డ్ కవర్ లో తన ఫోటో, పార్టీ ఫోటో పెట్టుకొని డబ్బులు పంచుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి కూడా అదే రకంగా డబ్బులు పంచుతున్నారు. మాకు ఓటు వేయకపోతే పెన్షన్లు కూడా ఇవ్వమని ప్రజలని బెదిరిస్తున్నారు. టీఆర్ఎస్, బిజేపీలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమీషన్ చోద్యం చూస్తుంది. అధికార పార్టీలకు కొమ్ముకాసే రీతిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ … వ్యవహారించడం దుర్మార్గం. అందుకే హుజురాబాద్ ఉపఎన్నికని రద్దు చేసి, శశాంక్ గోయల్ ని తొలగించి ఆయన స్థానంలో నిష్పక్షపాత ఆధికారిని నియమించి మళ్ళీ ఎన్నికని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని దేశ ఎన్నికల కమీషనర్ ని కోరాం ” అని వెల్లడించారు దాసోజు.

ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నిక ఓ బూటకం. గతంలో నక్సల్స్ గోడలపై ‘బూటకపు ఎన్నికలు బహిష్కరించాలి’ అనే నినాదాలు రాసేవారు. హుజురాబాద్ ఎన్నికల చూస్తుంటే నక్సల్స్ మాటే నిజం అనిపిస్తుంది. హుజురాబాద్ లో జరుగుతున్నవి ప్రజాస్వామ్య ఎన్నికలు కాదు ధన స్వామ్య ఎన్నికలు. ఎన్నికల కమీషన్ ని చేతులు జోడించి విజ్ఞప్తి చేశాం. ఈ ఎన్నికలని రద్దు చేసి ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నిక జరపమని కోరడం జరిగింది. కమీషన్ సానుకూలంగా స్పందించి ఆరోపణల పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది” అని పేర్కొన్నారు దాసోజు.
దాసోజు శ్రవణ్ తో పాటు.. ఎఐసీసీ సెక్రటరీ చల్లా వంశీ చంద్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ సినియర్ నేతలు కుసుమ్ కుమార్, హెచ్ వేణుగోపాలరావు ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ ని కలసి వినతి పత్రం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *