జియో చేతికి టిటిడి ఐటి- శ్రీవారి సేవలన్నీ ఓకే యాప్ లో

టీటీడీ – జియో ఎంఓయు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో టిటిడికి సహకరించేందుకు
జియో సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి టిటిడి- జియో శుక్రవారం ఎంఓయు చేసుకున్నాయి.

తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈవో  ఎవి ధర్మారెడ్డి జియో ప్రతినిధి  అనిష్ ఎంఓయు పై సంతకాలు చేశారు.

అనంతరం చైర్మన్  వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయడంతో ఒకేసారి లక్షల మంది భక్తులు టికెట్ కోసం ప్రయత్నించారన్నారు.  దీంతో టిటిడి సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఈ సమస్యలను అధిగమించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం టోకెన్లు జారీ చేయడం కోసం జియో సంస్థ ముందుకు వచ్చిందని సుబ్బారెడ్డి చెప్పారు.

గత నెలలో జియో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేశామన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు గంటల లోపు టికెట్ల బుక్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
టిటిడికి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్ తయారుచేయడానికి ముందుకు వచ్చిందన్నారు.

ఈ యాప్ లో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని  సుబ్బారెడ్డి చెప్పారు రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఈ యాప్ ను ఆవిష్కరించే ఏర్పాటు చేయాలని చైర్మన్ కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. గత ఐదేళ్లుగా టిటిడికి ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టిసిఎస్ సమన్వయంతో జియో సంస్థ ఉచితంగా టిటిడి ఐటి విభాగానికి మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. జియో సంస్థ ప్రతినిధులు  బీపీ సింగ్, అమర్,  దుగ్గల్ , కె.భారతి, టిటిడి ఐటి విభాగం HOD  శేషారెడ్డి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సందీప్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *