సిఎ కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో నీళ్ల రాజకీయం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్న తర్వాత జరిగిన ప్రచారం నిజం చేస్తూ రెండు మూడు రోజులు ఢిల్లీలో వేచి వుండి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ తో సమావేశమై కృష్ణ నదీజలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపకానికి మూడవ ట్రిబ్యునల్ నియమించాలని డిమాండ్ చేశారు.

మంత్రి షెకావత్ అందుబాటులో లేకున్నా వచ్చేంత వరకు ఢిల్లీలో మకాం వేశారు. అంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ఇతర అంశాల కన్నా మూడవ ట్రిబ్యునల్ నియామకం కోసమే ఢిల్లీ పర్యటన పెట్టుకొన్నారని జరిగిన ప్రచారం నిజం చేశారు. వాస్తవంలో ఇది న్యాయ పరంగా సాధ్యమా?

1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 కింద నియమింప బడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అతీ గతీ తేల కుండా అదే చట్టం అదే సెక్షన్ అదే అంశంపై మరో ట్రిబ్యునల్ ను అయితే గియితే కేంద్రం నియమించితే న్యాయ స్థానాల్లో సమీక్షకు నిలబడుతుందా? రెండు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాలు తిరిగి పంపకానికి మూడవ ట్రిబ్యునల్ నియామకం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

ఒకందుకు ఆయనను మెచ్చుకోవాలి! చట్ట బద్దం కాని అంశాల కోసం కూడా వెరవకుండా చివరకంటా పోరాటం సాగించడం ఆయనకే చెల్లు. ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అమలులో వుందని విభజన చట్టం కూడా అదే చెబుతున్నదని కృష్ణ బోర్డు కూడా అదే చెబుతుందని తెలిసి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ నీటి వాటా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయి కూడా మరచి తనే వచ్చి బోర్డు సమావేశంలో తేల్చుకుంటానని పెద్ద హడావుడి చేశారు. తుదకు ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో బోర్డు అధికారులు తెలంగాణ వాదనను తిరస్కరించారు.

ఇది తెలంగాణకు తీవ్ర పరాభవమే. దీనికి తోడు రిజర్వాయర్ లపై విద్యుదుత్పత్తి భేషరతుగా నిలుపుదల చేయాలని బోర్డు తేల్చి చెప్పడం అంత కన్నా ఎదురు దెబ్బే. అయితే మొండి వాడు రాజు కన్నా బల వంతుడన్న సామెతను నిజం చేస్తూ విద్యుదుత్పత్తి సాగిస్తున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కృష్ణ బేసిన్ లోని ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నదనే భావన ఏర్పడి చులకన అయింది. అంత వరకైతే ఫర్వాలేదు.

ఈ సంఘటనలు సంభవించిన వెను వెంటనే ముఖ్యమంత్రి ఢిల్లీలో మకాం బెట్టి ప్రధాన మంత్రి మొదలు కొని కేంద్ర మంత్రులందర్నీ కలిశారు
ఒక ముఖ్య మంత్రి ఈలా కలవడంలో తప్పు పట్ట వలసినది లేదు. కాని కృష్ణ నదీ జలాలు రెండు రాష్ట్రాల మధ్య పంపిణీకి మూడవ ట్రిబ్యునల్ నియామకం కోసం వెళ్లారనే ప్రచారం జరగడం గమనార్హం.

ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకటి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అతీ గతీ తేల కుండా మూడవ ట్రిబ్యునల్ వేస్తానని కేంద్ర మంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏలా హామీ ఇచ్చారు? అయితే కేంద్ర మంత్రి మెలిక పెట్టారు. న్యాయ పరమైన సమస్యలు లేకుంటే అని చెప్పారు. కాని ఆ సమావేశంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఏలా ఆమోదించారు? ఈ సమావేశంలో డిసెంట్ నోట్ ఎందుకు పెట్ట లేదు? అన్ని అడ్డంకులు తప్పించుకొని ట్రిబ్యునల్ నియామకం జరిగితే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టమని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు తేలకుండా మరో ట్రిబ్యునల్ నియామకం చట్ట విరుద్ధమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశంలో వాదించారా? ఈ అంశంపై ముఖ్యమంత్రికి వందలాది వున్న సలహాదారులు ఐఏఎస్ అధికారులు ఫీడ్ ఇచ్చారా? ఈ అంశంలో రాష్ట్ర ప్రజలకు జల వనరుల శాఖ స్పష్టత ఇవ్వ వలసి వుంది. ఇప్పటివరకు బోర్డు చట్ట పరంగా తమకు అండగా వుందని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు సంత్రుప్తి పడితే చాలదు. న్యాయ పరంగా మూడవ ట్రిబ్యునల్ నియామకం సాధ్యం కాకున్నా ఒక వేళ కేంద్రం సిద్దమైతే తీవ్ర ఇబ్బందులకు తప్పవు. వాస్తవం చెప్పాలంటే సమయానుకూలంగా వ్యవహరించడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. వాస్తవంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చినపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి వుంటే కేంద్ర మంత్రి దాన్ని సాకుగా తీసుకోనే వారు కదా? లేదా చర్యల్లోనికి వచ్చేది. ఇంత జరుగుతున్నా ఆంధ్ర ప్రదేశ్ తాము వ్యతిరేకించినట్లు వెల్లడి చేసి వుండేది. ప్రస్తుతం ఈ ఫైల్ కేంద్ర న్యాయ శాఖ వద్ద వుందని చెబుతున్నారు.

2010 లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు వెల్లడించినపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తిరిగి 2013 లో తుది అవార్డు వెలువరించగానే తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు నుండి స్టే తేవడంతో అవార్డు నోటిఫికేషన్ ఆగి పోయింది. నోటిఫై చేయ బడే వరకు దానికి చట్ట బద్దత వుండదు . అంటే ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అమలులో వుంది.

ఈ లోపు రాష్ట్ర విభజన జరిగింది. అయితే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు రెండు రాష్ట్రాలు అవతరించిన తర్వాత పంపిణీ కాని జలాల వుంటే పంపిణీ చేస్తూ నీటి ఎద్దడి రోజుల్లో ప్రొటొకోల్ నిర్ణయించే బాధ్యతను మాత్రమే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఈ అంశాలపై ననే ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వైమనష్యాలు వివరించ నక్కర లేదు. ఈ నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా సరైన సమాధానం రాలేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. గమనార్హమైన అంశమేమంటే ఒక్క బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోనే కాకుండా కోర్టు స్టే తో వున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో కూడా న్యాయం జరగ లేదని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ లోపు కర్నాటక ప్రభుత్వం కూడా ఆర్డీయస్ కు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నాలుగు టిఎంసిలు కేటాయించడంపై సుప్రీంకోర్టు కెక్కింది. ఈ మూడు పిటిషన్లు 2015 లో సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు విచారణకు వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే విచారణ జరగాలని చెప్పింది. అయితే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది అవార్డు పై వున్న కేసు ఇప్పటికీ ఏళ్ల తరబడి సుప్రీంకోర్టులోనే వుంది. ఈ కేసునే తెలంగాణ ఇప్పుడు వెనక్కి తీసుకొనేందుకు సిద్ధమైంది. బేషరతుగా ఉపసంహరించు కొనేందుకైతే తమకు అభ్యంతరం లేదని కర్నాటక ఆంధ్ర ప్రదేశ్ లు అభ్యంతరం పెట్టడంతో కేసు ధర్మాసనానికి వెళ్లింది. రేపు విచారణ సందర్భంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై తాము వేసిన కేసు కొనసాగించాలని ఆంధ్ర ప్రదేశ్ గట్టిగా కోరాలి. అంతే కాకుండా ఈ కేసు పరిష్కారం అయ్యేంత వరకు మూడవ ట్రిబ్యునల్ నియామకం కూడదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే ధర్మాసనం దృష్టికి తేవాలి. ఫలితంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు నోటిఫై అయ్యే అవకాశాలు వుండవు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మూడవ ట్రిబ్యునల్ నియామకానికి ఆమోదం ఇచ్చే అవకాశాలు వుండక పోవచ్చు.

తెలంగాణ ఒక్క బచావత్ ట్రిబ్యునల్ అవార్డుపై వేసిన కేసు వెనక్కి తీసుకుంటుందా?లేక బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు విషయంలో ఏ వైఖరి తీసుకుంటుందో తేల వలసి ఉంది

గత సంవత్సరం అక్టోబర్ జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మూడవ ట్రిబ్యునల్ ప్రతి పాదన వచ్చినపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంట్ నోట్ పెట్టకుండా వుండి వుంటే అది తప్పిదమే అవుతుంది. ప్రస్తుతం కృష్ణ బోర్డు తెలంగాణ కు వ్యతిరేకంగా తమకు అనుకూలంగా వ్యవహరించుతోందని దానితోనే రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ఆదమర్చితే పొరపాటున కేంద్రం మూడవ ట్రిబ్యునల్ నియామకానికి సిద్దమైతే ఇప్పటిలాగే రాష్ట్ర జలవనరుల శాఖ వేచి చూచే ధోరణి అవలంభించితే రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలకే కాకుండా డెల్టా సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ప్రమాదం పొంచి వుంది. (విశాలాంధ్ర సౌజన్యం)

(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *