టిటిడి పై ‘త‌ప్పుడు ప్ర‌చారం’, 18 మందిపై కేసు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు నగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మంది పై టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

జనసేన పార్టీ, పండుబుద్దాల అనే పేర్లతో ఉన్న ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలా కుట్ర పూరిత పోస్ట్ లు పోస్ట్ చేయడం, షేర్ చేయడం చేశారని టిటిడి ఒక ప్రకటనలో పేర్కొంది.

మరో 16 మంది ఈ దుష్ప్రచారాన్ని తమ ట్విట్టర్ ఖాతాల నుంచి పోస్ట్, షేర్ చేశారు. “తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చెందిన 1500 కిలోల బంగారాన్ని ఎస్‌బిఐలో తాక‌ట్టు పెట్టి అప్పు తెచ్చిన ఎపి ప్ర‌భుత్వం. మ‌మ్మ‌ల్ని త‌రువాత కాపాడండి. ముందు మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోండి. స్వామీ ఏడుకొండల వాడా వెంక‌ట‌ర‌మ‌ణా గోవిందా గోవింద‌” అని టిటిడి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డంతో పాటు హిందూ మ‌తానికి చెందిన భ‌క్తుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచి విద్వేషాలు ర‌గిల్చే ఆలోచ‌న‌తో వీరు ఈ దుష్ప్ర‌చారం చేశార‌ని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఇందుకు సంబంధించి ఆధారాల‌తో గురువారం ఈస్ట్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *