జోరుగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం

దేశానికే ఆదర్శవంతమైన రీతిలో తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో, అందుకు తగ్గట్టుగా రూపొందించి సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని నిర్మాణ సంస్థలను, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు. నలుమూలలా కాలి నడకన కలియతిరిగి పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు.

 

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… ఏడేండ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో సాగుతున్న ఆదర్శవంతమైన పరిపాలనకు కేంద్ర బిందువు గా వుండే సెక్రటేరియట్ నిర్మాణ కౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా, గౌరవం ఉట్టిపడేలా ఉండాలని సిఎం అన్నారు.

తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో,సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకునే విధంగా సచివాలయ నిర్మాణం వుండబోతోందని తెలిపారు. ప్రజలవద్దకే నేరుగా పాలనాఫలాలు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగానే నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని సిఎం తెలిపారు.

సెక్రటేరియట్ ముందు, చుట్టుపక్కలనుంచి వర్షపు నీరు పోవడానికి అనువైన విధంగా వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ ను నిర్మించాలన్నారు. విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా వుండాలన్నారు. కాంక్రీట్ నిర్మాణపనులు పూర్తయ్యేలోపే ముందస్తు వ్యూహంతో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

దర్వాజలు, కిటికీలు, తదితర ఫర్నిచర్, విద్యుత్, ప్లంబింగ్ టైల్స్ వంటి సచివాలయ నిర్మాణంలో వినియోగించే అన్ని రకాల విభాగాలకు చెందిన ఇంటీరియర్ మెటీరియల్ ను ముందస్తుగా సమకూర్చుకోవాలన్నారు. తద్వారా పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించడానికి వీలవుతుందన్నారు.

సచివాలయం ముఖద్వారాన్ని, బయటి గేటు నిర్మాణాలను, వాటికి అమర్చవలసిన గ్రిల్స్ తదితర అంశాలను, సీఎం కెసిఆర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.

ప్రహరీ గోడలకు అమర్చాల్సిన లాంప్ పోస్టుల గురించి సూచనలిచ్చారు. విశాలంగా నిర్మిస్తున్నకారిడార్ ప్రాంతాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సిఎం సిఎస్ సహా మంత్రుల కార్యాలయాలు, ఇతర సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల కార్యాలయాల నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు.

సచివాలయం చుట్టూ కాలినడకన తిరిగి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ఇతర రాష్ర్ట్రాలనుంచే కాక, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ప్రముఖుల కోసం నిర్మితమౌతున్న‘వెయిటింగ్ హాల్’ ల నిర్మాణాల తీరును, సందర్శకులు కూర్చునే ప్రదేశాలను సిఎం పరిశీలించారు. పార్కింగ్ వ్యవస్థ గురించి ఆరాతీశారు. కార్లు, టూ వీలర్స్, బస్సులు తదితర వాహనాల పార్కింగు స్థలాలను పరిశీలించారు.

హెలీపాడ్ నిర్మాణం గురించి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులు తదితర సందర్శకులు, సెక్రటేరియట్ కు వచ్చే విఐపీల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సిఎం వివరించారు. అవసరమైన వారికోసం బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు.

సచివాలయ నిర్మాణంలో కీలకమైన గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో, ప్రత్యేక చర్యలు చేపట్టి పై అంతస్తుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అందుకోసం ఎటువంటి చర్యలు చేపట్టాలో చర్చించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని సిఎం కెసిఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *