ముదురుతున్న నీళ్ల రగడ, పోతిరెడ్డి పాడును గుర్తించం: కెసిఆర్ హకుం

కృష్ణాజలాలను రాయలసీమకు తరలించకుపోయేందుకు  ఆంధ్రప్రదేశ్ చేపట్టిన  పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు చట్టవ్యతిరేకమని దానిని గుర్తించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

ఈ రోజు  ముఖ్యమంత్రి  అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ఈ మేరకు తీర్మానించింది.

ఎపిలో ఎపుడో ఈ ప్రాజక్టును నిర్మించారు. ఇపుడు ఆధునికీకరిస్తున్నారు. ఒక్క చుక్క కూడా నీటి కేటాయింపులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వున్నాకూడా.. కృష్ణా నదిపై ప్రాజక్టులు నిర్మిస్తున్నారని తెలంగాణ ఆరోపించింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, జెన్కో డైరక్టర్ (హైడల్) వెంకటరాజం, అడ్వకేట్ జనరల్ ప్రసాద్, అధనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సాగునీటిశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తీర్మానించి విషయాలుఫ

• పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక అక్రమ ప్రాజెక్టు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. పోతిరెడ్డి పాడు కాలువకు నీటి ఎత్తిపోసే రాయల సీమ లిప్టు ఇరిగేషన్ స్కీం కూడా అక్రమ ప్రాజెక్టేనని సమావేశం తీర్మానించింది.

• కృష్ణా జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఎన్ బ్లాగ్ అలొకేషన్స్ కేటాయించినా, వాటిని నిఖర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి.

• జులై 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( కేఆర్ఎంబీ) నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలి. జులై 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలి.

• పోతిరెడ్డిపాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని అనుమతించబోమని, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబీ సమావేశంలో తమ వాదనలను వినిపించాలని సమావేశం తీర్మానించింది.

• ఇందుకు సంబంధించి తెలంగాణ ఎజెండా అంశాలను కెఆర్ఎంబీకి వెంటనే తెలపాలని నిర్ణయించింది.

• ఆంధ్రా – తెలంగాణ నడుమ ఇప్పటిదాకా తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగాన్ని సమావేశం తిరస్కరించింది. ఈ సంవత్సరం నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలని, కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో ఆంధ్ర తెలంగాణ చెరి సగం అనగా, 405.5 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపేదాకా వినియోగించుకోవాలని సమావేశం తీర్మానించింది.

• రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు.. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని తీర్మానించింది.

• విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కేఆర్ఎంబీకి లేదు. జల విద్యుత్ కు సంబంధించి ఇరు రాష్ట్రాల నడుమ ఎటువంటి ఒప్పందాల నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అంశంలో కేఆర్ఎంబీకి జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపింది.

• పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నదనే ఏపీ ప్రభుత్వ దుష్ప్రచారాన్ని సమావేశం తిప్పికొట్టింది. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి తమ కృష్ణా జిల్లా అవసరాలను తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ కు సూచించింది. తద్వారా పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వినియోగించే విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని సమావేశం ఆంధ్రా ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.

• సాగునీటిని ఎత్తిపోయడమేగాకుండా, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాలకు.. రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతగానే ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని చట్టబద్దంగా తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని సమావేశం స్పష్టం చేసింది.

• థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నదని, ఈ నేపథ్యంలో 51శాతం ‘ క్లీన్ ఎనర్జీని’ ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు విడుదల చేసిన మార్గదర్శకాలను, జల విద్యుత్ ఉత్పాదన ద్వారా తెలంగాణ రాష్ట్రం అమలు పరుస్తున్నదని, ఇక ముందు కూడా కొనసాగించాలని సమావేశం తీర్మానించింది.

• విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ప్రత్యేకమైన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటిని వాడుకుంటుంటే, విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఆంధ్రా ప్రభుత్వం కెఆర్ఎంబీకి ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదం అని సమావేశం అభిప్రాయ పడింది.

• పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని గ్రీన్ ట్రిబునల్ స్టే ఇచ్చినా., స్టేని ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించిందని, అయినా మొండిగా .. సర్వేల ముసుగున పోతిరెడ్డి పాడు వద్ద పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రిని డంప్ చేసి, నిర్మాణాలు చేపట్టడం అన్యాయమని సమావేశం అభిప్రాయ పడింది.

• జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలి, చెరువులను, కుంటలను నింపాలని సమావేశం నిర్ణయించింది.

• ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న సమ్మక్క బ్యారేజీ సహా సీతమ్మసాగర్ ప్రాజెక్టులను.. ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు గా పిలువాలని సమావేశం తీర్మానించింది.

• శ్రీశైలం డ్యామ్ మీద తెలంగాణ భూభాగంలోకి గుర్తింపు కార్డులున్న విద్యుత్ ఉద్యోగులను తప్ప, వేరెవరినీ అనుమతించవద్దని, శ్రీశైలం సహా కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *