నంద్యాల RARS అధికారి బదిలీపై భగ్గుమన్న రైతు, ప్రజా సంఘాలు*

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ADR ని అకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేయడం మీద పెద్ద ఎత్తున నిరసన భగ్గుమంది.

నంద్యాల RARS కేంద్రం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి,కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ప్రజా, రైతు,వ్యవసాయకూలీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.

 

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల బదాలాయింపు చేయడం సరైన చర్య కాదని విశ్వవిద్యాలయం గత సంవత్సర అనేక సందర్భాలలో ప్రభుత్వానికి తెలిపిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాద్యక్షులు Y.N.రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలిపారు.

నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం విశిష్టతను, ఆవశ్యకతను వివరిస్తూ ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, పరిశోధనా అధికారులు, రిజిస్ట్రార్ పలు సందర్భాల్లో ప్రభుత్వానికి ఉత్తరాలు ద్వారా తెలిపారని అన్నారు.

నంద్యాల పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు బదలాయింపు చేయవద్దని ఈ ఉత్తరాల ద్వారా ప్రభుత్వాన్ని కోరారని, వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు బదలాయింపు చేపట్టవద్దని వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు సమావేశంలో కూడా తీర్మానం చేసారని తెలిపారు.

 

వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు బదలాయింపుకు వ్యతిరేకంగా రైతులు కోర్టుకు పోయిన సందర్భంలో కూడా పరిశోధనా స్థానం భూముల పరిరక్షణకై కోర్టులో అఫడవిట్ వేయడానికి నంద్యాల పరిశోధనా స్థానం ఏ డి ఆర్ కు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అనుమతులిచ్చారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసారు.

ఉన్నతాధికారుల అనుమతుల ప్రకారం వ్యవసాయ పరిశోధనకు భూములు అవసరమని, వైద్య కళాశాలకు బదలాయింపుకు వ్యతిరేకంగా కోర్టులో ఏ డి ఆర్ అఫిడవిట్ వేసారని వారు పేర్కొన్నారు.

నంద్యాల పరిశోధనా స్థానం భూముల పరిరక్షణకు అనుకూలంగా కోర్టులో విశ్వవిద్యాలయం అఫిడవిట్ దాఖలు చేసిన తదనంతరం, స్థానిక రాజకీయ నాయకుల వత్తిళ్లు విశ్వవిద్యాలయం పైన పెరిగాయనీ, దీనితో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు బదలాయింపుపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయం పైన ఒత్తిడి పెంచిందని వారు విమర్శించారు.

ఒక చారిత్రక, రైతు సంక్షేమానికి, దేశ ఆహార భద్రతకు కీలకమైన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంను పరిరక్షించాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గారని రైతు నాయకులు ఆరోపించారు.

రాజకీయ ఒత్తిళ్లతో విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు గతంలో అనేక సందర్భాలలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు ఇవ్వడానికి సానుకూలంగా స్పందించారనీ, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు బదలాయించడానికి సానుకూలం అంటూ ప్రభుత్వానికి ఉత్తరం వ్రాసారని తెలిపారు. అత్యవసర విశ్వవిద్యాలయం బోర్డు సమావేశం ఏర్పాటు చేసి పరిశోధనా భూములు బదలాయింపుకు తీర్మానం చేసారని పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయం ఆదేశాలు ప్రకారమే పరిశోధనా స్థానం పరిరక్షణకు కోర్టులో అఫడవిట్ వేసిన నంద్యాల పరిశోధనా స్థానం ఏ డి ఆర్ ను డిమోట్ చేసి, ఆంధ్రప్రదేశ్ చివర విజయనగరం జిల్లాలో ఒక చిన్న కొండ ప్రాంతాలలోని కేంద్రానికి బదిలీ చేయడం అన్యాయం,అవాంచనీయం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిరక్షణకు తిలోదకాలు ఇచ్చి, రాజకీయ ఒత్తిళ్లుకు తలొగ్గి, ఏ డి ఆర్ ను బలి పశువును చేయడాన్ని నిరసిస్తూ రైతులు,ప్రజా సంఘాలు, కూలీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని పరిశోధనా స్థానం వద్ద చేపట్టారు

ఇప్పటికైన విశ్వవిద్యాలయం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని తమ ఆదేశాలు ప్రకారమే పని చేసిన ఏ డి ఆర్ బదిలి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయి.

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, తమ అంతఃకరణ శుద్ధితో, తాము ముందుగా అనేక సందర్భాలలో నంద్యాల పరిశోధనా స్థానం భూముల పరిరక్షణకు తీసుకున్న నిర్ణయానికి కట్టబడాలని సాగు నీటి సాధన సమితి, ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయి.‌

ఈ ధర్నా కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాద్యక్షులు ఏర్వ రామచంద్రారెడ్డి, బెక్కం రామసుబ్బారెడ్డి,ఆరికట్ల శివరామకృష్ణారెడ్డి,పాణ్యం మండల రైతు సంఘం నాయకులు శంకరయ్య, రాంపుల్లారెడ్డి, CPIM నాయకులు రమేష్,శ్రీనివాసమూర్తి,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సద్దాం హుస్సేన్, గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలయ్య, ఊకొట్టు వాసు,భాస్కర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి,రైతులు మరియు, రైతు,ప్రజా,వ్యవసాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *