భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

తిరుమల, జూన్, 20: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు.ఈ విగ్రహాన్ని పల్లవ రాణి సమవాయి పేరిందేవి క్రీ. శ 614లో తిరుమల ఆలయానికి కానుగా ఇచ్చారు.

 

ఆగమ శాస్త్రంలో దీనిని కౌతుక మూర్తి అని పిలుస్తారు. ఈ కానుక జ్ఞాపకార్థమే ఆలయంలో ఈ విగ్రహానికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకం తర్వాత ఆలయంలో ఇతర పూజా కార్యక్రమాలు మొదలవుతాయి.

పల్లవరాణి కానుకకు సంబంధించిన శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.

ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి నుంచి  భోగ శ్రీనివాసమూర్తిని బయటకు తీసుకువస్తారు.

తర్వాత అర్చక స్వాములు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. నేటి కార్యక్రమంలో  టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డి, కుమారగురు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *