‌ 57 యేళ్లు నిండిన వాళ్ళంద‌రికీ పెన్ష‌న్లు: తెలంగాణ ప్రభుత్వ పరిశీలన

*దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలోనే అత్య‌ధిక పెన్ష‌న్లు

*మిగ‌తా రాష్ట్రాల‌కంటే కూడా అధికంగా పెన్ష‌న్ మొత్తం

*రాష్ట్ర పెన్ష‌న్ల‌లో కేంద్రం ఇస్తున్న‌ది కేవ‌లం 1.2 శాతమే

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వెల్లడి

హైద‌రాబాద్ః 57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళంద‌రికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచ‌న ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణ‌భివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చెప్పారు.

2021-22-బ‌డ్జెట్ స‌మావేశాల్లో  స‌భ్యులు ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి, అరూరి రమేశ్, బొల్లం మ‌ల్లయ్య యాద‌వ్ త‌దిత‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మంత్రి స‌వివ‌రంగా స‌మాధాన‌మిచ్చారు.

క‌రోనా కార‌ణంగా కొంత ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ,  57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళంద‌రికీ పెన్షన్లు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ద‌ని అన్నారు.

అయితే, క‌రోనా క‌ష్ట కాలంలోనూ పెన్ష‌న్ల‌ను ఏమాత్రం ఆప‌కుండా ఇస్తున్న ఘ‌న‌త సీఎం కెసిఆర్ దే అన్నారు. రాష్ట్రంలో 39ల‌క్ష‌ల 36వేల 521 మందికి పెన్ష‌న్లు ఇస్తున్నామ‌న్నారు. 13,19,300 మంది వృద్ధుల‌కు, 14,43,648 మంది వితం‌తువుల‌కు, 4,89,648 మంది వికలాంగుల‌కు, 37,342మంది చేనేత‌ల‌కు, 62,942 మంది క‌ల్లుగీత కార్మికుల‌కు, 28,582 మంది ఎయిడ్స్, 14,140 మంది బోద‌కాలు బాధితుల‌కు, 4,08,621 మంది బీడీ కార్మికుల‌కు, 1,32,298 మంది ఒంట‌రి మ‌హిళ‌ల‌కు పెన్ష‌న్లు ఇస్తున్నామ‌న్నారు.

ఆస‌రా పెన్ష‌న్ల కింద ప్ర‌తి ఏడాది 11,724కోట్ల 70ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

సుర‌క్షిత సామాజిక భ‌ద్ర‌త కోసం పెన్ష‌న్లు

పేద వారు సామాజిక బ‌ధ్ర‌త‌తో కూడి సుర‌క్షిత‌మైన జీవితం గ‌డ‌పాల‌నే ల‌క్ష్యంతో దేశంలో ఎక్క‌డాలేని విధంగా అత్య‌ధికంగా సాధార‌ణ పెన్ష‌న‌ర్ల‌కు, 2,016 రూపాయ‌లు, వికాలంగుల‌కు 3,016 రూపాయ‌లు అందిస్తున్నామన్నారు. దీంతో గ‌తం కంటే అధికంగా ఆయా పెన్ష‌న్ల‌కు గౌరవ‌, మ‌ర్యాద‌లు ద‌క్కుతున్నాయ‌న్నారు.

కేంద్రం ఇచ్చేది 1.2 శాతం మాత్ర‌మే

కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం 6 ల‌క్ష‌ల 66 వేల మందికి రూ.200 చొప్పున 105 కోట్లు మాత్ర‌మే ఇస్తున్న‌ద‌న్నారు. కేంద్రం ఇస్తున్న డ‌బ్బుల‌కు అద‌నంగా రూ.1,816 కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తున్న‌ద‌న్నారు. మొత్తం పెన్ష‌న్ల‌లో రాష్ట్రం 98.8శాతం ఇస్తుంటే, కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం 1.2శాతం మాత్ర‌మే ఇస్తున్న‌ద‌ని మంత్రి స‌భ‌కు తెలిపారు. అయితే, తెలంగాణ రాక ముందు అర‌కొర‌గా, రూ.200 చొప్పున 29ల‌క్ష‌ల మందికి ఇస్తే, తెలంగాణ వ‌చ్చాక సీఎం కెసిఆర్ గారు 39ల‌క్ష‌ల మందికి పెన్ష‌న్లు ఇస్తున్నార‌ని చెప్పారు. గ‌త ప్ర‌న‌భుత్వం ఏడాదికి రూ.8,710 కోట్లు ఖ‌ర్చు చేస్తే, తెలంగాణ ప్ర‌భుత్వం కేవ‌లం నెల‌కే 9 వంద‌ల కోట్లు పెన్ష‌న్ల కోసం ఇస్తున్న‌ద‌ని మంత్రి తెలిపారు.

ఇత‌ర రాష్ట్రాల‌కంటే… ఎక్కువ‌

దేశంలో పెన్ష‌న్ల ప్ర‌క్రియ‌పై ప్ర‌భుత్వం చేసిన ప‌రిశోధ‌న‌లో మిగ‌తా అన్ని రాష్ట్రాలు మ‌న‌కంటే చాలా త‌క్కువ పెన్ష‌న్ మొత్తాన్ని ఇస్తున్న‌ట్లు తేలింద‌న్నారు. గుజ‌రాత్ లో రూ. 750, మ‌ధ్య ప్ర‌దేశ్ లో రూ. 600, రాజ‌స్థాన్ లో రూ. 750, క‌ర్ణాట‌క‌లో రూ. 600 చొప్పున మాత్ర‌మే ఇస్తున్న‌ట్లు మంత్రి శాస‌న స‌భ‌కు వివ‌రించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *