నిజాయితీకీ నిలువుటద్దం మొదటి దళిత ముఖ్యమంత్రి

(సేకరణ: చందమూరి నరసింహారెడ్డి)

దామోదరంసంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడము వలన నేత పనిచేసి, కూలిపని చేసి జీవనము సాగించేవారు.

దామోదరంసంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మునెయ్య చనిపోగా కుటుంబము మొత్తం మేనమామ వద్దకు పాలకుర్తికి తరలివెళ్లినది. అక్కడ దామోదరంసంజీవయ్య పశువులను కాసేవాడు. మూడు సంవత్సరాల తరువాత తిరిగి పెద్దపాడు చేరుకున్నారు. దామోదరం సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు.

పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరాడు. 1935లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938లో SSLC (ఎస్.ఎస్.ఎల్.సీ) జిల్లాలోనే ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యాడు.

ఆ తరువాత చిన్నయ్య ఆర్థిక సహాయముతో అనంతపురం దత్తమండల కళాశాలలో గణితము, ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. 1942లో బి.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధము వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉంది. దామోదరం సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు.

1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు.

ఈ గెజిటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబరు 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటు పనిచేశాడు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు.


ఫిబ్రవరి 14 సమైక్యాంధ్ర  మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శత జయంతి


 

దామోదరం సంజీవయ్య 1946లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో ‘ఎఫ్.ఎల్’ (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్ ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన దామోదరం సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ ఉన్నత పాఠశాలలో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు.

లా చదువుతున్నపుడు సంజీవయ్యకు రోమన్ న్యాయానికి సంబంధించిన లాటిన్ పదాలు గుర్తుపెట్టుకోవడము కష్టమయ్యేది. లాలో ఆయనకు సహాధ్యాయి అయిన ప్రముఖ రచయిత రావిశాస్త్రి వాటిని తెలుగు పాటగా మలిచి పాడుకుంటే బాగా గుర్తుంటాయని సలహా ఇచ్చాడు.

లా చదివే రోజుల్లో దామోదరం సంజీవయ్య చంద్రగుప్త అనే నాటకములో పాత్ర ధరించాడు. శివాజీ అనే ఇంకొక నాటకాన్ని తనే రచించి రంగస్థలము మీద ప్రదర్శించాడు. ఈయన గయోపాఖ్యానము గద్యముగా రచించాడు అయితే ఇందులో ఏ ఒక్కటి ప్రస్తుతము అందుబాటులో లేవు.

లా పట్టా చేతపుచ్చుకొని దామోదరం సంజీవయ్య 1950 అక్టోబర్ లో మద్రాసు బార్ లో న్యాయవాదిగా నమోదు చేసుకొన్నాడు. ఈయన గణపతి వద్ద ఆ తరువాత జాస్తి సీతామహాలక్ష్మమ్మ వద్ద సహాయకునిగా పనిచేశాడు
సంజీవయ్యకు విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము, సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది.

దామోదరం సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు.

1950 జనవరి 26న రాజ్యాంగము అమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించింది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదోఒక సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చింది. షెడ్యూల్డ్ కి చెందిన సర్దార్ నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వము అట్టి పెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానమును పూరించడానికి బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు కమిటీ తరఫున దామోదరం సంజీవయ్యను ఎంపిక చేశాడు.

ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణస్వీకారము చేయడముతో 1952 మే 13 న ప్రొవిజనల్ పార్లమెంటు రద్దయినది.

టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గములో ఆరోగ్యశాఖా మంత్రిగా ఉండగానే సికింద్రాబాదులో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కృష్ణవేణిని దామోదరం సంజీవయ్య 1954, మే 7 న పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు. వీరికి సంతానము లేదు. సుజాత అను ఒక బాలికను దత్తత తీసుకున్నారు.

దామోదరం సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బకొట్టాలని కర్నూలు జిల్లాలోని బస్సు రూట్లను జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. కనుక దామోదరం సంజీవయ్య శాసన సభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు.

ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.
దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రు నిర్ణయం తీసుకున్నారు.

అగ్ర కులాల ఆధిపత్యం అధికమైన కాంగ్రెస్ లోని కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక హరిజనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. దామోదరం సంజీవయ్య అవినీతిపరుడు అని, లక్షలాది రూపాయలు సంపాదించారని నెహ్రు కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దామోదరం సంజీవయ్య నీతి, నిజాయితీ కూలంకుషం గా ఎరిగిన నెహ్రు వారి ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు. సరే, విచారిస్తాలే అని హామీ ఇచ్చారు నెహ్రు.

అప్పుడు నెహ్రు తన ఆంతరంగిక మిత్రుడు అయిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పర్మార్ ను పంపించారు .సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. దామోదరం సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడికి ఇవి అబద్ధం అని చెప్పారు. అయినప్పటికీ, ప్రధాని ఆదేశం కావడం తో వెళ్లాల్సిందే అన్నారు ఆయన.

ఇద్దరూ కలిసి దామోదరం సంజీవయ్య గారి గ్రామం వెళ్లారు కారులో. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యి పై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగ గొట్టం తో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. ఏమిటి ఇక్కడ ఆపారు?అని ప్రశ్నించాడు నాయకుడు. దామోదరం సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి అన్నారు చక్రపాణి. పర్మార్ నివ్వెరపోయాడు.

చక్రపాణి ఆమెకు నమస్కరించి “అమ్మా…ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు” అన్నారు. ఆమె చెమటలు తుడుచుకుంటూ “అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా బాబు? ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు” అన్నది.

నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. “సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?” అడిగారు చక్రపాణి. “అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి” అన్నాడు పర్మార్.

ఆ తరువాత వారం రోజుల్లో దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తోలి హరిజన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవారు మరి!!!

బలీయమైన రెడ్డి వర్గం ఎ.సి.సుబ్బారెడ్డి నాయకత్వాన ఎదురు తిరిగి సొంత పక్షం పెట్టుకున్నారు. 1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినపుడు దామోదరం సంజీవయ్య పోటీ చేద్దామనుకున్నారు కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు.

ఎ.సి. సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి దామోదరం సంజీవయ్యను ఎద్దేవ చేసాడు.1962లో ముఖ్యమంత్రిగా దిగిపోయిన దామోదరం సంజీవయ్య, గవర్నరుకు రాజీనామా సమర్పించిన మర్నాడే సికిందరాబాదులో తన భార్యను వెంటబెట్టుకుని అజంతా టాకీసులో సినిమాకని నడచి వెళ్ళారు.

దారిలో ఎస్.వి.పంతులు కనిపిస్తే రా పంతులూ సినిమాకి పోదాం అని ఆయనను కూడా వెంటబెట్టుకు వెళ్ళారు. దామోదరం సంజీవయ్య వ్రాసిన లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు. భీష్మ జననం హరికధ , సీతా రాముల కళ్యాణం,
ఉషా పరిణయం వంటి గ్రంధాలు రచించాడు.

రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా సంజీవయ్య కావడం విశేషం.

ఒక ముఖ్యమంత్రిగా ఆయన రిక్షాలో అసెంబ్లీకి వెళ్లి నిజాయితీ చాటుకున్నారు. ఆయన మృతి చెందే వరకు ఆయనకున్న ఆస్తి.. దుస్తులు, భోజనం చేసేందుకు ఒక పళ్లెం, గ్లాసు తప్ప మరొకటి లేవు.

గొప్ప భావుకుడు, నిరాడంబరుడు,స్నేహశీలి ,
మంచి వక్త, నేర చరిత్ర లేనివాడు.

మొదట “పులిచింతల ప్రాజెక్టు”శంకుస్దాపన చేసింది దామోదరం సంజీవయ్య హయాంలోనే. 1960లో దళితులకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పట్టాలను అందించారు. జీఓ 559తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు.

కమలా నెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను హైదరాబాదు లో ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి మహిళా పాలిటెక్నిక్ కళాశాల. ఇది సంజీవయ్య కృషి ఫలితమే. బోయల సామాజిక జీవన స్థితిగతులును బట్టి వారిని బీసీ జాబితాలో చేర్చింది సంజీవయ్యే.

దామోదరం హయాంలోనే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్, మైనింగ్‌ కార్పొరేషన్, మౌలిక సదుపాయల సంస్థ, బీహెచ్‌ఈఎల్‌ ప్రారంభమయ్యాయి.

తెలుగును అధికార భాషగా, ఉర్దూను రెండవ భాషగా ప్రోత్సహించడంతో పాటు వృద్ధాప్య పెన్షన్‌ పథకాన్ని ఏర్పాటు చేశారు. 961లోనే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం, ఉపకార వేతనాలు ప్రవేశ పెట్టారు.

మద్య నిషేధాన్ని విభాగం, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ మున్సిపల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఏర్పాటు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ‘లా’ కమిషన్‌ ఏర్పాటు తెలంగాణలో భూమిని రీ సర్వే చేయించారు.

దామోదరం సంజీవయ్య నిర్వహించిన పదవుల వివరాలు:

*1950 – 1952 ప్రొవిజనల్ పార్లమెంటు సభ్యుడు
*1952 ఏప్రిల్ 20 – 1953 అక్టోబర్ 1 రాజాజీ మంత్రివర్గములో మద్రాసు రాష్ట్ర మున్సిపల్, సహకార శాఖా మంత్రి
*1953 అక్టోబర్ 1 – 1954 నవంబర్ 15 ప్రకాశం మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య, హరిజనోద్ధరణ, పునరావాస శాఖా మంత్రి
*1955 మార్చి 28 – 1956 నవంబర్ 1 బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర రవాణా, వాణిజ్య పన్నుల శాఖా మంత్రి
*1956 నవంబర్ 1 – 1960 జనవరి 10 నీలం సంజీవరెడ్డి మంత్రివర్గములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రమ, స్థానిక స్వయంపరిపాలనా శాఖా మంత్రి
*1960 జనవరి 11 – 1962 మార్చి 29 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
*1962 జూన్ – 1964 జనవరి 6 అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు.
*1964 జనవరి 24 – 1964 జూన్ 9 నెహ్రూ ప్రభుత్వములో కేంద్ర శ్రమ, ఉద్యోగ శాఖామంత్రి
*1964 జూన్ 9 – 1966 జనవరి 23 లాల్ బహుదూర్ శాస్త్రి ప్రభుత్వములో కేంద్ర శ్రమ, ఉద్యోగ శాఖామంత్రి
*1966 జనవరి 24 – 1967 మార్చి 12 ఇందిరా గాంధీ ప్రభుత్వములో కేంద్ర పరిశ్రమల శాఖామంత్రి
*1970 ఫిబ్రవరి 18 – 1971 మార్చి 18 ఇందిరా గాంధీ ప్రభుత్వములో కేంద్ర శ్రమ, పునరావాస శాఖామంత్రి
*1971 మార్చి 18 – 1972 మే 7 అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు.
*1967లో ఎన్నికల ప్రచార సమయములో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు.

*1972 మే 7 వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు మే 9వ తేదీన సికింద్రాబాదులోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి.

ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా దామోదరం సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు.
సంజీవయ్య జ్ఞాపకార్దంగా 2008 సం,, లో స్దాపించిన ఆంద్ర ప్రదేశ్ నేషనల్ లా యునివర్సిటికి, “దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటి”గా
2012 సం, లో మార్చడం జరిగింది.

ఏన్ని పదవులు అలంకరించినా తనకంటూ ఏమి సంపాదించుకోని నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా దామోదరంసంజీవయ్య పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలచి ఉంటుంది.

Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు,ఖాసాసుబ్బారావు అవార్డు  గ్రహీత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *