ఈ రోజు మరణించిన వైసిపి ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి (72) నటుడు కూడా. బాగా వాగ్ధాటి ఉన్నవాడు. ఒక సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా పేరు ‘సత్యాగ్రహం’. 1987లో విడుదల యింది. ఈ సినిమా డైరెక్టర్ జంధ్యాల. చిత్రం బాక్సాఫీస్ దగ్గిర విజయవంతం కాలేదు గాని, బాగుందనే పేరు వచ్చింది. సరిత, బ్రహ్మానందం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు పాటలు, శ్రీశ్రీ వేటూరి రాశారు.సంగీతం రమేష్ నాయుడు.
సినిమా విజయవంతంకాలేదు. తర్వాత ఈసినిమాను అంతా మర్చిపోయారు.చివరకు వికిపీడియాలో కూడా సినిమా సమాచారం లేదు.
తమాషా ఏంటంటే నటుడిగానే కాదు, రాజకీయాల్లో జిల్లాలో చల్లా ప్రముఖ నాయకుడు కాలేకపోయారు. కర్నూలు జిల్లా అంటే ఇద్దరే నాయకులు ఒకరు కోట్ల విజయభాస్కరెడ్డి, రెండో వ్యక్తి కెయి కృష్ణమూర్తి. తర్వాత వచ్చిన నేతలెవరూ ఇలా స్వతంత్ర నాయకులు కాలేకపోయారు. వాళ్లంతా ఇద్దరి వర్గాల్లో ఒక వర్గంలోనో లేదా అనామకంగానో ఉండిపోయారు.
చల్లాకు సుదీర్ఘమయిన రాజకీయ చరిత్ర ఉంది.మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. కొవెలకుంట్ల, పాణ్యం నియోజక వర్గాలనుంచి గెలుపొందాడు. మూడు పార్టీలలో ఉన్నాడు.
చల్లా సొంతవూరు కర్నూలు జిల్లాలోని అవుకు గ్రామం.ఫ్యాక్షన్ రాజకీయాల సెంటర్ ఒకపుడు.
ఆగ్రామాన్ని ఒక పాలెగాడులాగా ఒకపుడు పరిపాలించాడు. ఆయన మాటే చెల్లబాటయ్యేది. ఇంతకు మంచి రాజకీయాల్లో ఆయన ఎందుకో ఎదగలేకపోయాడు.
కాంగ్రెస్ లో ఉన్నాడు, తర్వాత టిడిపిలోకి వచ్చాడు. టిడిపిలో ఉన్నపుడు పౌరసరఫరాల కార్పొరేషన్ ఛెయిర్మన్ గా ఉన్నాడు. 2014 మార్చిలో ఆయన టిడిపిలో చేరాడు. అంతకు ముందు కాంగ్రెస్ లో ఉన్నారు. టిడిపిలో బాగానే గుర్తింపు వచ్చింది. గాలి వైసిపి వైపు వీస్తుండటంతో 2019 ఎన్నికల ముందు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేసి జగన్ తో శాలువ కప్పించుకున్నారు. తర్వాత ఆయనను జగన్ ఎమ్మెల్సీ చేశారు. ఈ డిసెంబర్ 5 నుంచి ఆయన ఆరోగ్యం బాగా లేదు. కరోనా పాజిటివ్ అని తేలింది. మరణించే దాకా అపోలోలో చిక్సి త్స పొందుతున్నారు.
అసెంబ్లీలో వివాదం
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నపుడు చల్లా రామకృష్ణారెడ్డి కోయిటకుంట్ల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక రోజు అసెంబ్లీ లో మాట్లాడుతూన్నపుడు ‘ఇదిరెడ్డి రాజ్యం ’ అని వ్యాఖ్యానించారు. దీనితో ముఖ్యమంత్రి కూడా ఏకీభవించలేదు.సభలో తీవ్ర రచ్చజరిగింది. తెలుగుదేశం నాయకుడు దేవేంద్రగౌడ్ చల్లా రామకృష్ణారెడ్డికి ధీటైన జవాబు ఇచ్చి రాజశేఖర్ రెడ్డి ని ఎలా అన్ని కులాలు ముఖ్యమంత్రి ని చేశాయే చెప్పారు. సహజంగానే ఆయన రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రినిచేయడంలో బిసిల, ఎస్ సిల పాత్ర గురించి వివరించారు. దేవేంద్ర గౌడ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలలో ఇది చాలా గొప్ప ప్రసంగం. ఆయన పరోక్షంగా రాజశేఖర్ రెడ్డి బిసిల, ఎస్ సిల వోట్లు సంపాదించడంలో విజయవంతమయ్యారని ప్రశంసించారు. అందువల్ల ఇది రెడ్డి రాజ్యం కాదని ,అలా అనడానికి వీల్లేదని వాదించారు.