అమరావతి మీద జగన్ రెడ్డికి రైతు నేత శివారెడ్డి జవాబు

రాజధాని అమరావతి ఒకే కులం వారిదని మీరు చేసిన విమర్శలను ఖండిస్తున్నామని ఇటువంటి వ్యాఖ్యలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దని  ముఖ్యమంత్రి స్థాయికి  ఇది  తగదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  అమరావతి పరిరక్షణ సమతి జెఏసీ కన్వీనర్ ఏ.శివారెడ్డి జవాబు చెప్పారు.
శివారెడ్డి ప్రకటన వివరాలు:
ఇళ్ళు లేని నిరు పేదలకి ఇంటీ స్థలాలు పంపిణి చేస్తూ, అలాగే 300 అడుగుల నుండి 450 అడుగుల వరకు ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. కానీ నిన్న, అమరావతి ఒక కులం వారిదని మీరు మాట్లాడిన తీరు మాకు చాలా బాధ కలిగించింది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు అయిన మేము మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
అమరావతి ప్రాంతం ఒక ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమని అమరావతి ప్రాంతంలో సుమారుగా 29 వేల మంది రైతులు 34 వేల 323 ఎకరాల భూమిని రాష్ట్ర రాజధానికి త్యాగం చేసిన విషయం మీకు కూడా తెలుసు.మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దేవాలయం లాంటి శాసనసభలో రాజధానికి 30 వేల ఏకరాల పైబడి భూమి కావాలని ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయిందని మేము అమరావతి ప్రాంతంలో వస్తున్న రాజధానిని స్వాగతిస్తున్నాము.
మేము రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.  కానీ మీరు ముఖ్యమంత్రి అయిన పిదప ఇచ్చిన మాట తప్పి దేవాలయం లాంటి శాసనసభలో మీరు చేసిన ప్రకటనను మరచి 3 రాజధానుల అంశం తెరమీదకు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి విగూతం కలిగిస్తున్నారు.
29 వేల మందిలో సుమారుగా 80 శాతం ప్రజలు రైతులు రైతు కూలీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి చెందినవారే. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి.
 ఇక అమరావతిలో ఉన్న రెండు నియోజకవర్గాలలో కూడా వైసిపి ఎమ్మెల్యేలే ఉన్నారు. అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి కోసం సుమారు ఐదు వేల ఇండ్లను నిర్మాణం చేశారు.  ఆ విషయం మీ దృష్టిలో ఉండి కూడా… ఆ ఇళ్లను మీరు ఇంతవరకు లబ్ధిదారులకు కేటాయించ లేదు. అన్ని వర్గాల వారు లబ్దిదారులుగా ఉన్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం. తాడికొండ అనేక సంవత్సరాలుగా ఎస్సీ నియోజకవర్గం. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో అనేక కులాలవాళ్లు అనేక తరాలుగా శాంతియుతంగా, ఎలాంటి అంతరాలు లేకుండా కలసి మెలసి బతుకుతున్నారు. వారిలో కూడా ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ. మీరు అధికారంలోకి వచ్చేంత వరకు రాజధాని ప్రాంతంలో ఏ కులం వారు ఎక్కువ ఉన్నారన్న ఆలోచనే ఎవరికీ రాలేదు. అలా ఆలోచించాల్సిన అవసరమూ అక్కడి వారికి రాలేదు. మీరు అధికారంలోకి వచ్చాకే… మీకు అలవాటైన కుల రాజకీయాల్ని అక్కడ కూడా రుద్దాలని చూస్తున్నారు. అన్ని కులాలవారు శాంతియుత సహజీవనం చేస్తున్న అమరావతిపై కులం ముద్ర వేసి చంపేయాలనుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి రైతులతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం తీసుకున్న భూమిలో రాజధాని భవిష్యత్‌ అవసరాల కోసం అట్టేపెట్టిన భూమిని… మీ ప్రభుత్వం అమరావతిని చంపేయాలన్న దురుద్దేశంతోను, కుట్రతోను రాజధానిలో పేదలకు 54 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పూనుకుంది.
మీ కుట్రను, కుతంత్రాలను అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించామే తప్ప, మేం పేదలకుగానీ, ఏ కులానికిగానీ వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ‘డెమొగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌’ అన్న పదానికి కులాల అసమతౌల్యం అని వక్రభాష్యం చెప్పడం దురదృష్టకరం.
రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందినవారే కావడం మీ దృష్టిలో కులాల అసమతౌల్యమా? తాడికొండ ఎస్సీ నియోజకవర్గం కావడం, రాజధాని గ్రామాల్లో ఎక్కువ మంది ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే కావడం మీ దృష్టిలో డెమొగ్రఫిక్‌ ఇంబ్యాలెన్సా?.
అమరావతి పరిరక్షణ సమితి కానీ అమరావతి ప్రాంత ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాల వారికి మీరు ఇళ్లు నిర్మించి ఇస్తామంటే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు.. అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వానికి రైతులకు జరిగినటువంటి ఒప్పందాలను ఉల్లంఘించి మీరు తీసుకున్నటు వంటి ఏకపక్ష నిర్ణయాలను మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము.
మీరు ఏదైతే రాజధాని పైన సంవత్సర కాలంగా అబద్ధాలు చెబుతూ ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.ఈ విషయాలన్నీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూనే ఉన్నాయని, మీరు వ్యక్తుల పైన ద్వేషంతో వ్యవస్థలను నాశనం చేస్తు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నాశనం చేస్తున్నారన్న విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాము.  ఇప్పటికే సంవత్సర కాలంగా అమరావతి పైన అబద్దాలను ప్రచారం చేస్తూ మీరు పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనే విధంగా మాట్లాడుతున్నారు.  వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారని, కానీ మరి అటువంటప్పుడు ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నాన్ని రాజధానిగా ఎందుకు అంటున్నారో మీకే తెలియాలి.
వెనుకబడిన రాయలసీమ ప్రాంతం మీద ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారు.  అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎంతో వెనుకబడిన ప్రాంతం ఉందని ఆప్రాంతం కనపడట్లేదా?  అదే విధంగా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా ఎంతో వెనుకబడి పోయాయి. మీరు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా 13 జిల్లాలో ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నాన్ని రాజధాని అనడం ఏమిటి?
కాబట్టి ఇకనైనా మీరు, మీ మంత్రులు, మీ ప్రభుత్వం అబద్ధాల ప్రచారం చేయడం మానేసి ఈ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి.
ప్రకటన మీద గద్దె తిరుపతిరావు, కో- కన్వీనర్
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కూడా సంతకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *