హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి రూ. 500 కోట్లు కావాలి: కెటిఆర్

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిన మంత్రి కేటీఆర్

 

హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన హైదరాబాద్ – విజయవాడ హైవే విషయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు తొలగించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 500 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించాలని మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కెటిరామారావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన విజయవాడ -హైదరాబాద్ హైవే.. నగర పరిధిలో సుమారు 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదని తను రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే హైదరాబాద్ లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉన్న ఈ హైవేకు ప్రత్యేకంగా లెవెల్ జంక్షన్లు, సర్వీస్ రోడ్డు వంటి సౌకర్యాలు లేవని చెబుతూ లెన్ కెపాసిటీ మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేరొన్నారు.
ఈ రోడ్డుని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 500 కోట్ల రూపాయలతో డీటెయిల్ ప్లానింగ్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేసిందని మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరం పెరుగుతున్న విస్తరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌళిక వసతుల కల్పన కోసం ప్రాజెక్టులు చేపట్టిందని మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ నగరానికి 4 అర్బన్ ప్రాజెక్ట్ లు వచ్చాయని అందులో మూడు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.
త్వరలోనే అంబర్ పేట ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయని మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి గడ్కరీకి తెలియ జేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ వంటి కార్యక్రమాలకు  పూర్తిగా రాష్ట్ర నిధులను ఖర్చు చేస్తుందని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పాటు హైదరాబాద్ కు ఉన్న భౌగోళిక అడ్వాంటేజ్ వలన హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామి సంస్థ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, సేల్స్ ఫోర్స్ వంటి సంస్థలు తమ రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని, దీంతో పాటు హైదరాబాద్ నగరంలో ఫార్మా, డిఫెన్స్, ఎరో స్పేస్  వంటి రంగాల్లో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.
ఇలా ప్రస్తుతం ఉన్న డిమాండ్ తో పాటు భవిష్యత్తు అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేసిందని, దీంతో పాటు ఎస్సార్ డిపి కార్యక్రమాన్ని తీసుకొని అనేక ఫ్లైఓవర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి లను పూర్తి చేయడంతో పాటు పెద్ద ఎత్తున లింకు రోడ్ల సౌకర్యం కూడా కల్పించిందని నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
కోవిడ్ సంక్షోభం సందర్భంగా ఉన్న లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున రోడ్డు మౌళిక వసతులకు సంబంధించిన కార్యక్రమాలను పూర్తిచేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మౌలికవసతుల కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి కి 500 కోట్లు అదనపు నిధులు కేటాయించాలని కోరారు.