కెసిఆర్ ఈ కృష్ణా జల ప్రశ్నలకు జవాబు చెప్పాలి: టి లక్ష్మినారాయణ

( టి.లక్ష్మీనారాయణ)
1. రాయలసీమకు కృష్ణా నదీ జలాల మళ్ళింపును కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరట – సముద్రం పాలౌతున్న గోదావరి వరద జలాలను మాత్రం వాడుకోమని ఉచిత సలహా పారేశారట – ఎంత ఉదార స్వభావమో! రాయలసీమకు గోదావరి వరద నీటిని ఎలా తరలించాలో కేసీఆర్ సెలవిస్తారా! నదీ జలాలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానిది హక్కుల పోరాటమే.
2. కృష్ణా నదీ జలాల వినియోగంలో శ్రీశైలం జలాశయం గుండెకాయ వంటిది. శ్రీశైలం జలాశయం నుండి ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకైనా నికర జలాల కేటాయింపు ఉన్నదా? శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(19), కె.సి.కెనాల్(10), చెన్నయ్ త్రాగు నీటికి(15), మొత్తం 44 టియంసిల నికర జలాలు శ్రీశైలం జలాశయం నుండే కదా! సరఫరా కావాలి? కేసీఆర్ సూటిగా సమాధానం చెప్పాలి.
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న తెలుగు గంగ(29), గాలేరు – నగరి(38) లకు మిగులు/వరద జలాలను, రాయలసీమకు త్రాగు నీటికి 3 టియంసి, మొత్తం 70 టీయంసిలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండే కదా! సరఫరా చేయాల్సింది! కేసీఆర్ సూటిగా సమాధానం చెప్పాలి.
4. విభజన చట్టంలో తెలంగాణకు సంబంధించిన కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులనే కదా పేర్కొన్నారు. కడకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎస్.ఎల్.బి.సి. ప్రస్తావన లేక పోయినా మీకు పట్టలేదే! పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్ ప్రాజెక్టు అయితే విభజన చట్టంలో ఎందుకు పేర్కొన లేదు? ఈ ప్రశ్నలకు కేసీఆర్ సూటిగా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి!
5. ఆ.ప్ర. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ – నీవా(40), వెలుగొండ(43.5), మొత్తం 83.5 టీయంసి మిగులు/వరద జలాలు కూడా శ్రీశైలం జలాశయం నుండే కదా సరఫరా కావాలి! కేసీఆర్ గారు!
( టి.లక్ష్మీనారాయణ, ప్రముఖ సాంఘిక రాజకీయ ఆర్థిక వ్యవహారాల విశ్లేషకుడు)