ఆగ‌స్టు 12న తిరుమలలో ఛత్రస్థాపనోత్సవం…అంటే ఏమిటి?

తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగ‌స్టు 12న సోమ‌వారం ఛత్రస్థాపనోత్సవం జ‌రుగ‌నుంది.
ఛత్రస్థాపనోత్సవం అంటే శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం. ఇది ఏడాదికోసారి జరిగే ఉత్సవం. తిరుమలలో ఇది ఆనవాయితీ.
పురాణ ప్రాశస్త్యం
తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయినది నారాయణగిరి శిఖరం . కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా ఇక్కడే కాలు మోపినట్టు పురాణాలు చెబుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవం నిర్వహణ వెనక మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా (గాలికాలం) వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారనేది ఒక ఒక నమ్మకం.
ఛత్రస్థాపనోత్సవాన్ని టిటిడి కొన్ని వందల సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నది. ఈ కార్యక్రమం కోసం నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనానికి నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థమును తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు.
అక్కడినుండి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారుబావి నుండి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. తదనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.