మళ్లీ మొదటికొచ్చిన చంద్ర బాబు… ఆనందంతో ఉక్కిరి బిక్కిరి

 (టేకుమళ్ల సురేష్ బాబు)
కొన్ని విషయాల్లో రాజకీయనాయకులంతా ఒకలాగే ప్రవర్తిస్తారు.  ముఖ్యంగా గెల్చినపుడు అదంతా తమ గొప్పతనమే అనుకుంటారు. ఓడిపోయినపుడు కుంగిపోతారు. దాన్ని ప్రజలకు మీదకు తోస్తారు. ప్రజాస్వామ్యంలో గెలుపువోటములుంటాయి. ఎదురుదెబ్బలు తగులుతాయి. అయినా ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే తీసుకోవాలి. అయితే, అలా కాకుండా రెచిపోయి, వాటిని రాజకీయం చేయడం జరగుతూ  ఉంటుంది.  ఇపుడు ఆంధ్రలో జరుగుతున్నదిదే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరు ఒకే లాగా కొంచెం తీవ్రంగా స్పందిస్తున్నారు.
 నిన్న కౌన్సిల్ లో వికేంద్రీకరణ బిల్లు, సిఆర్ డిఎ బిల్లు పాస్ కాలేదు. కౌన్సిల్ ఛెయిర్మన్ వాటినికి సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించారు. పార్లమెంటురీ డెమోక్రసీలో ఇాది కామన్. దీనికి ఎవరూ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. అలాగనీ చంకలెగరేస్తూ పండగ చేసుకోనవసరం లేదు. లా టేక్స్ ఇట్స్  వోన్ కోర్సూ రోజు చెబుతూనే తమ  దాకా వచ్చినపుడు తలికిందులవడం జరుగుతుంటుంది
 రోజు అమరావతిలో రెండుదృశ్యాలుకనబడుతున్నాయి. ఒకటి కౌన్సిల్ లో బిల్లలు ఇరుక్కుపోయినందుకు జగన్ ఆగ్రహంతో ఉన్నారని, ప్రత్యామ్నాయాలు అలోచిస్తున్నారని అంటున్నారు.
మరొకవైపు టిడిపి నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టపాకాయాలు కాల్చి దీపావళి చేసుకుంటున్నారట.
పొద్దునే ఆయన   నాయుడు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కౌన్సిల్ లో నిన్న టిడిపి ఎమ్మెల్సీలు అసాధారణంగా పోరాడారని కొనియాడారు. ఇందులో పోరాటమేముంది. టిడిపి కి కౌన్సిల్ బలముంది. టెలికాన్ఫరెన్స్లో ఆయన చేసిన వ్యాఖ్యలు:
 ‘కౌన్సిల్ లో తెలుగుదేశం సభ్యులు ధర్మాన్ని కాపాడారు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు, ప్రజాస్వామ్యాన్ని బతికించారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారు. యనమల అనుభవం- పరిజ్ఞానంతో ప్రజాస్వామ్యానికి జీవం. టిడిపి యువ ఎమ్మెల్సీలు ధైర్యం, తెగువ ప్రశంసనీయం. వైసిపి మంత్రులు కౌన్సిల్ ఛైర్ పర్సన్ షరీఫ్ పై దాడి చేశారు. ముస్లిం సమాజాన్ని అవమానపర్చేలా దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో చైర్మన్ ని అవమానించారు. నమాజు చేయనీకుండా వైసిపి మంత్రులు అడ్డం పడ్డారు. ముందు మాట్లాడాలి, ఆ తర్వాతే నమాజు గిమాజు అని మంత్రి బొత్స అవహేళన చేశారు.
‘మీకూ పిల్లలు, మనవళ్లు ఉన్నారని గుర్తుంచుకోండని బెదిరించారు.ముగ్గురు మంత్రులు లోకేష్ పై దౌర్జన్యం చేశారు. ఉన్మాదంతో, రాక్షసత్వంతో పోరాడటానికి సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. భోజనం లేకున్నా, అనారోగ్యంతో ఉన్నా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు.ఫరూక్, శత్రుచర్ల అనారోగ్యాన్ని కూడా లేక్క చేయలేదు.
‘అసెంబ్లీలో వైసిపి ఏకపక్షంగా వ్యవహరించింది.చర్చకు అవకాశం ఇవ్వకుండా మొండిగా చేసింది.శాంతియుతంగా టిడిపి ఎమ్మెల్యేల ఆందోళనను అడ్డుకున్నారు. రింగుదాటి వస్తే బైట పడేయండని సీఎం జగన్ మార్షల్స్ ను ఆదేశించారు.మరి అదే వైసిపి మంత్రులు కౌన్సిల్ లో చేసిందేమిటి..? పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను, వైసిపి ఎమ్మెల్సీలను ఏం చేయాలి..?
‘ప్రజాస్వామ్యాన్ని చెరపట్టాలని వైసిపి చూసింది. టిడిపి ఎమ్మెల్సీలంతా ప్రతిఘటించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఒకరితో ఒకరు పోటిబడ్డారు, వాళ్లకుండే శక్తినంతా వినియోగించారు. ఇది ప్రజా విజయం, ప్రజాస్వామ్య విజయం..ప్రజల ఆకాంక్షలు నిలబెట్టే ప్రజాస్వామ్య పోరాటం
‘సంఖ్య కాదు ముఖ్యం, స్పూర్తి ముఖ్యం అని రుజువు చేశారు. సభలో వైసిపి ఎన్నో దురాగతాలకు పాల్పడింది.కరెంట్ కట్ చేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు. 25మంది మంత్రులు కౌన్సిల్ లోనే తిష్ట వేసి వీరంగం చేశారు.1984ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చారు. అప్పుడూ ఇలాగే సభలోపల, బయటా పోరాటం చేశాం. ప్రాణాలకు తెగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు.
‘ఇప్పుడూ అదే స్ఫూర్తిని మళ్లీ టిడిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చూపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని రాజధాని పరిరక్షణ ఉద్యమం జ్ఞాపకం తెచ్చింది. వైసిపి వాళ్లు వేధించినా టిడిపి ఎమ్మెల్సీలు వీరోచితంగా నిలబడ్డారు. గల్లా జయదేవ్ ను శారీరకంగా మానసికంగా హింసించారు.
‘టిడిపి ఎమ్మెల్సీలు ధ్వజస్థంభాలుగా నిలబడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు .చరిత్రలో మీ పోరాటం మిగిలిపోతుంది, మీ త్యాగాలు వృధా కావు. మీ స్ఫూర్తి కలకాలం చరిత్రలో నిలిచిపోతుంది.చట్ట సభ పోరాటంలో ప్రజా ఆకాంక్షలను టిడిపి నిలబెట్టింది. ఇక ఇప్పుడు అంతా ప్రజల చేతుల్లోనే ఉంది.
‘జెఏసి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి.అంబేద్కర్ సాక్షిగా నేడు జరిగే ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి. దీనిని ఒక ప్రజావిజయంగా గ్రామగ్రామానా జరపాలి…’
ఇదీ సంగతి.