108లో రు. 307 కోట్ల స్కామ్, విజయసాయి రెడ్డిని అరెస్టు చేయాలి: టిడిపి

*అల్లుడి సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం కోసమే  పాత కాంట్రాక్టులు రద్దు
*జగన్మోహన్ రెడ్డి, ఆరోగ్యశాఖా మంత్రి సమాధానం చెప్పాలి
* 108 కాంట్రాక్టులో కుంభకోణం?
ఆంధ్రప్రదేశ్ లో 108 అంబులెన్సుల కొనుగోళ్లు, నిర్వహణలో భారీ స్కాం జరిగిందని  వీటి  నిర్వహణ పేరుతో 108 అంబులెన్సుల్లో రూ.307 కోట్ల కుంభకోణానికి వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.
విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ కు చెందిన అరబిందో ఫౌండేషన్ కు ఉన్నఫలంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా 108 అంబులెన్సుల నిర్వహణలోనే రూ.307 కోట్ల కుంభకోణం జరిగిందని పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. విజయసాయిరెడ్డిని అరెస్టు చేసి ఈ కుంభకోణం మీద దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కుంభకోణమేమిటో పట్టాభిరామ్ ఇలా వివరించారు.
2016కి ముందు వరకు జీవీకే ఈఎంఆర్ సంస్థ అంబులెన్సుల్ని నిర్వహించేది. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2011 అక్టోబర్ 1 నుండి 2016, 30 సెప్టెంబర్ వరకు ఒప్పందం జరిగింది.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందం విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా.. జీవీకే నిర్వహణకు అన్ని విధాలుగా సహకరించారు.
2016లో ఓపెన్ టెండర్లు పిలవడం ద్వారా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పాటు, లండన్కు చెందిన యుకే ఎస్ఏఎస్ భాగస్వామ్యం కలిగిన బీవీజీ కంపెనీ టెండర్లు దక్కించుకుంది.
నియమనిబంధనలకు అనుగుణంగా2017, డిసెంబర్ 13న ఐదేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్టు 2020, డిసెంబర్ 12 వరకు ఉంటుంది. అయితే.. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతోనే 2019, సెప్టెంబర్ 5న ఉన్న అంబులెన్సులకు అదనంగా మొత్తంగా 439 అంబులెన్సులు కొనుగోలు చేసేందుకు 105 జీవో ఇచ్చారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా ఉండేందుకు ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2019, సెప్టెంబర్ 20న పాత, కొత్త అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి కొత్త ఏజెన్సీని గుర్తించాలని 111 జీవో విడుదల చేశారు. బీవీజీ సంస్థ కాంట్రాక్టు పరిమితి ముగియక ముందే కొత్త సంస్థను గుర్తించాల్సిన అవసరం ఏమిటో ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖా మంత్రి సమాధానం చెప్పాలి.
2019, అక్టోబర్ 18న అంబులెన్సులను పైనాన్స్ విధానంలో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, నేరుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేలా జీవో నెం.117 విడుదల చేశారు.
అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉండకూడదని ఫైనాన్స్ అన్న ప్రభుత్వ పెద్దలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి కారణమేంటి.? ఎవరితో ఎంత కమిషన్ కోసం ఈ జీవో మార్పు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
మొదటి నుండి ఆరోగ్యశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంబులెన్స్ సర్వీసులను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద నిర్వహించే విధంగా 2019, అక్టోబర్ 30న జీవో (నెం.566) ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవో గా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఆఘమేఘాలపై  నియమించారు. ఈ మార్పు ఎందుకు చేశారో ముఖ్యమంత్ర సమాధానం చెప్పాలి.
ఈ అంబులెన్సులను కొనుగోలు చేయడం కోసం రూ.71.48 కోట్లను విడుదల చేస్తున్నట్లు 2019, డిసెంబర్ 30న 679 జీవో ఇచ్చారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టుకు డిప్యూటీ సీఈవోగా నియమించిన రాజశేఖర రెడ్డికి నెల రోజులకే  అడిషనల్ సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ  ఆరోగ్యశ్రీ నిర్వహణ మొత్తం అతని చేతుల్లో పెడుతూ జీవో నెం.72 ఇచ్చారు.
ఒక ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం అమల్లో ఉండగానే  దాన్ని రద్దు చేయడం ఏమిటి? కొత్త ఏజన్సీకి భారీగా కొత్త అంబులెన్సులకు నెలకు రూ.1.78లక్షలు, పాత అంబులెన్సులకు రూ.2.21లక్షలు చొప్పున నిర్వహణ ఖర్చుల కింద చెల్లించేలా 2020, ఫిబ్రవరి 13న జీవో నెం116 విడుదల చేశారు. ఇదేమిటి?  గతంలోని బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్సుకు రూ.1.31 లక్షలకే నిర్వహిస్తుంటే  ఆ సంస్థను కాదని అరబిందో ఫౌండేషన్ కు బాధ్యతలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
ఇది కేవలం 108లో మాత్రమే. 104లో మరింత కుట్ర జరిగిందో.? ఒక సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్టును అర్ధాంతరంగా రద్దు చేసి సొంత కంపెనీకి కట్టబెట్టడంలో విజయసాయి రెడ్డి పాత్ర లేదంటారా.?
ఈఎస్ఐలో ఏమీ లేని చోట ఏదో జరిగిపోయిందని ఆరోపిస్తూ.. ట్విట్టర్ లో కూతలు కూస్తున్న విజయసాయి రెడ్డి ఈ విషయంలో సమాధానం చెప్పాలి. ఏమీ లేని చోట ఏదో అవినీతి జరిగిందని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి.. విజయసాయి రెడ్డి కుంభకోణాలను సాక్ష్యాధారాలతో బయటపెడుతున్నాం. అతనిని, అతని అల్లుడిని అరెస్టు చేయాలి,’ అని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.