(వి శంకరయ్య)
కృష్ణ గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాలు ముగిశాయి. ఇరు రాష్ట్రాల పరస్పర ఆరోపణలతో సమావేశాలు జరిగాయి. బోర్డులు – ఇవన్నీ కట్ట గట్టి కేంద్ర జల సంఘానికి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు పంపు తున్నారు. అప్పుడే కేంద్ర జల శక్తి శాఖ డిపిఆర్ లు సమర్పించ కుండా కృష్ణ నదిపై నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణం నిలుపుదల చేయమని ఆదేశించింది. ఇందులో తెలంగాణకు చెంది ఎక్కువ ప్రాజెక్టులున్నాయి.
ప్రస్తుతం” బాల్” కేంద్ర ప్రభుత్వ కోర్టు చేరింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విధంగా పోట్లాట కొనసాగించితే కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక వంక బెట్టి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించ వచ్చు. ఇందుకు చెందిన డిపిఆర్ తయారు చేసుకొని రెడిగా వుంది. ఇరువురు ముఖ్యమంత్రులు సామరస్యానికి సిద్ధం కాక పోతే అంతిమంగా రెండు రాష్ట్రాలు నష్ట పోతాయి. ఏ ప్రాజెక్టులు కొత్తవి ఏవి పాతవి అనే అంశంపై సాగుతున్న రగడకు బోర్డు తెరదించింది.
ప్రస్తుతం సాంకేతిక అనుమతులు లేని ప్రాజెక్టులన్నీ కొత్తవేనని కృష్ణ నదీ యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. డిపిఆర్ లు సమర్పించితే హైడ్రాలజీ డిజైన్లు తదితర అంశాలను కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్ పరిశీలించి అనుమతులు ఇస్తుందని సమావేశానంతరం బోర్డు చైర్మన్ పరమేశం ప్రకటించారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు చెంది పలు ప్రాజెక్టుల పనులు ఆగి పోయి కెసిఆర్ సాగు నీటి రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానంగా పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకం ఆగి పోవడంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో రాజకీయంగా ప్రతి ఘటన ఎదుర్కొనక తప్పదు.
కాళేశ్వరం కొత్తది కాదు
ఇదిలా వుండగా గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కానే కాదని లొకేషన్ డిజైన్ మారినంత మాత్రాన కొత్తది కాదని తమ వాటా నీళ్ల మేరకే ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని కాళేశ్వరం డిపిఆర్ అడగ వద్దని ఖరాఖండిగా తెలంగాణ చెప్పింది. మరో సెంట్ మెంట్ ఆయుధం కూడా ప్రయోగించింది. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వాటా సరిగా లేదనే కారణంతో తెలంగాణ ఉద్యమం వచ్చిందని ఆ దృష్ట్యా కూడా కాళేశ్వరం డిపిఆర్ అడగ వద్దని గట్టిగా కోరింది. మరో విశేషమేమంటే గోదావరి జలాల్లో ఎవరి వాటా ఎంత అనే అంశం ఈ సమావేశంలో మళ్లీ మొదటికొచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ వాదనతో ఏకీభవించని తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని ఉదాహరణగా తీసుకొచ్చింది. . ఇందుకు ఎపి అంగీకరించ లేదు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అయితే దాని ప్రారంభోత్సవానికి ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలా వచ్చారనే ప్రశ్నకు సౌభ్రాతృత్వంతో వచ్చారని ఎపి అధికారులు సమాధానం చెప్పుకున్నారు .

పైగా పట్టి సీమ నుండి 80 టియంసిలు కృష్ణ బేసిన్ కు తరలించుతున్నందున అందులో వాటా తెలంగాణ డిమాండ్ చేసింది. ఎపి అధికారులు ఈ దఫా మాత్రం చురుకుగా వ్యవహరించారు. కాళేశ్వరం తుపాకుల గూడెం దేవాదుల మూడవ దశ సీతారామ ఎత్తిపోతల పథకం తదితరాలన్నింటిపై అభ్యంతరాలు లేవ నెత్తారు. సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మాట్లాడుతూ డిపిఆర్ ఇస్తామని ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు ప్రకటించడం గమనార్హం. ఇరు రాష్ట్రాలు డిపిఆర్ సమర్పించితే ఏ రాష్ట్రం ఏమేరకు గోదావరి జలాలు వాడుకొనేది తేలుతుందని బోర్డు చైర్మన్ తెలిపారు.
ఇరుకున పడిన ముఖ్యమంత్రులు
ఇదంతా పరిశీలించితే కొండ నాలుకకు మందు వేస్తే వున్న నాలుక ఊడిన చందమైనట్లుంది – రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి. బోర్డుల నిర్ణయాలను
తుదకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రెండు రాష్ట్రాలు ఎంత వరకు అమలు చేస్తాయో పక్కన పెడితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రతి పథకమూ పాతదేననే వాదనతో ముందుకు పోతాయేమో. ఈ వెర్రి ఎంత వరకు వెళ్లినదంటే ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మాణం చేపట్టిన ముచ్చు మర్రి కూడా కొత్త పథకమేనని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది.
అభిప్రాయం