జార్ఖండ్ ఎన్నికల్లో బిజెపి పరాజయం, 10 ఆశ్చర్యాలు…

(జింకా నాగరాజు)
నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో జార్ఖండ్ లో  భారతీయ జనతా పార్టీ ఘోర పరపరాజయం పాలయింది.
రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ, కేంద్రంలో అధికారంలో ఉంటూ,  బాహుబలి ప్రధానినరేంద్ర మోదీ ప్రచారం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిత్యం పర్యవేక్షణ చేస్తూ  ఉన్నా అక్కడ బిజెపి అతికష్టం మీద 25 స్థానాలుగెల్చుకోలిగింది.
గత ఎన్నికలకంటే ఇది 12 స్థానాలు తక్కువ. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ ల కూటమికి మెజారిటీ వచ్చింది. అసెంబ్లీలో 81 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుచేయాలంటే 41 స్థానాలుండాలి. ఈకూటమికిఈ 47 దాకా  స్థానాలున్నాయి. ఇతరులు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది.
ఈ ఎన్నికలు చాలా విధాలుగా ఆసక్తికరమయినవి. మోదీ బొమ్మ ఉంటే చాలు ఎన్నికల్లో గెలుస్తామన్న భిజెపి ధీమా వరుసగా పటాపంచలు కావడం ఇది మూడోసారి. మొదటి సారి 2018లో ఛత్తీష్ గడ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లలో ఇది జరిగింది. రెండో సారి రెన్నెల్ల కిందట మహారాష్ట్రలో జరిగింది. ఇపుడు జార్ఖండ్ లో జరిగింది. జార్ఖండ్ ఎన్నికల్లో కనిపిస్తున్న10 అసక్తి కరమయినవిషయాలివే.
1. బిజెపి ఈ ఎన్నికలను నాలుగు అంశాల ప్రచారవేదికగా మార్చింది.. ఇవన్నీ జాతీయాంశాలే. నేరుగా జార్ఖండ్ ప్రజల దైనందిన జీవితాలకు సంబంధించినవి కాదు.  నాలుగు ఆంశాలమీద ఉమ్మడిగా జరిగిన జరిగిన తొలి ఎన్నిక ఇదే. నాలుగు సమస్యలు ఇవే: ఆర్టికిల్ 370, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ ఆర్ సి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా ప్రధాని మోదీ అనేక సార్లు జార్ఖండ్ పర్యటనకు వచ్చి ఈ అంశాల మీద తప్ప మరొక విషయం ప్రస్తావించకుండా ప్రచారం చేశారు. దేశమంతా సిటిజన్ షిప్ చట్టం గురించి చర్చ, ఆందోళన జరుగుతున్నపుడు జార్ఖండ్ లో ఈ ఎన్నికలొచ్చాయి.  స్థానిక సమస్యలెన్నున్నా భారతీయ జనతా పార్టీ జాతీయాంశాల మీదే ప్రచారం చేసింది. స్థానిక సమస్యను పట్టించుకోనే లేదు. ఈ నేపథ్యం భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ప్రధాని మో దీ తీసుకువచ్చిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం బలహీనపడుతూ ఉందనేందుకు మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్ మరొక ఉదాహరణ.
2.  ముఖ్యమంత్రి రఘబర్ దాస్ ఓడిపోవడం బిజెపికి పెద్ద దెబ్బ. అయన 1995నుంచి, అంటే దాదాపు 25 సంవత్సరాలలో ఇంతవరకు ఓడిపోలేదు. ఈ సారి ఓడిపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థులు సాధారణంగా ఓడిపోరు. అందునా పాతుకుపోయి ఉన్న రఘుబర్ దాస్ వంటి వారు అసలూ ఓడిపోరు. జమ్ షెడ్పూర్ ఈస్టు నుంచి దాస్ ఓడిపోవడం బిజెపి మీద ఉన్న వ్యతిరేకత లోతుపాతులు చెబుతుంది.
2. దాస్ ఎవరి చేతిలో ఓడిపోయారు? బిజెపిలో తిరుగుబాటు దారుడు, మొన్న మొన్నటి దాకా బిజెపి ప్రభుత్వంలో సివిల్ సప్లయిస్  మంత్రి అయిన సరయూ రాయ్ చేతిలో ఓడిపోయారు. సరయు రాయ్ నిజాయితీపరుడని పేరు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల అవినీతి  మీద తిరుగు బాటు చేశారు. చివరకు ఆయనకు బిజెపిటికెట్ ఇవ్వలేదు. అపుడాయన కసితో ముఖ్యమంత్రి దాస్ మీదే పోటీ చేసి దాస్ అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసినెగ్గారు. ఇది కూడా బిజెపికి ఉన్న అపకీర్తిని సూచిస్తుంది.
3. ఈ ఎన్నికల్లో మరొక విశేషం. జెఎంఎం నేత హేమంత్ సోరెన్ డుమ్కా, బరేత్ లనుంచి గెలుపొందడం. గతంలో 2014లో ఆయన డుమ్కానుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి. అయినా ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ బరేత్ నుంచి పోటీచేసి గెల్చి ప్రతిపక్షనాయకుడయ్యారు.
4. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రితో పాటు మరొక అయిదుగుర క్యాబినెట్ సభ్యులు కూడా ఓడిపోయారు.
5. ప్రతిపక్ష కూటమి మాత్రం స్థానిక సమస్యల మీదే ఎన్నికల్లో ప్రచారం చేసింది. బిజెపి ప్రభుత్వంలో అవినీతి, నిరుద్యోగం, ముస్లిమ్ మైనారిటీలను బిజెపి అభిమానులు హత మార్చడం (మాబ్ లించింగ్ ) వంటి స్థానిక అంశాలను ముందుకు తీసుకువచ్చింది.
6. బిజెపి ఎన్నికల్లో బాగా ప్రచారం చేసిన మరొక అంశం రామాయలయం. కేంద్ర ముఖ్యంగా హోమ్ మంత్రి అమిత్ షా పదే పదే రామాయాలం నిర్మాణం మీద ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయినా సరే జార్ఖండ్ ప్రజలు రామాలయం ప్రధానం కాదనుకున్నారు.
7. బిజెపి ఛత్తీష్ గడ్ కు చెందిన రఘబర్ దాస్ ను ముఖ్యమంత్రిని చేసింది. జార్కండ్ ప్రధానంగా ట్రైబల్ రాష్ట్రం. ఇలాంటి చోటికి ఒబిసికి చెందిన బయటి వ్యక్తిని తీసుకురావడం గిరిజనులకు నచ్చలేదు.ఆయన స్థానికుడు కాదన్నది కూడా ఒక ప్రధానాంశమయింది.2000 జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినుంచి దాస్ తప్ప మిగతా వారంతా ట్రైబల్ ముఖ్యమంత్రులే.
8. ఈ ఎన్నికలలో పూర్తిగా మోదీ బొమ్మను చూపే భారతీ జనతా పార్టీ ప్రచారం చేసింది. ఎన్నికను మొత్తం ప్రధాని మోదీ చుట్టే తిప్పింది. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి , మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేశాక ఆరునెల్లలోనే జరిగిన ఎన్నిక ఇది. ప్రజలు ఇంతతొందరగా బిజెపిని విస్మరించారా, ఎందుకు అనేది పెద్ద ప్రశ్న.
9. మోదీ కరిష్మాతో రాష్ట్రాలలో గెలవడం కష్టమని, దీనికి మోదీ కాకుండా స్థానిక కరిష్మా ఉన్న నాయకులు అవసరమమని ఈ ఎన్నికల చెబుతుంది. రాష్ట్రాలలో మోదీ బొమ్మ చూపినా వోట్లు పడవని మధ్యప్రదేశ్, ఛత్తీష్ గడ్, రాజస్థాన్, మహారాష్ట్రల ఎన్నికలు చెప్పిన విషయాన్ని ఇపుడు జార్ఖండ్ కూడా రుజువు చేసింది. ఇవన్నీ కూడా బిజెపి రాష్ఱాలే. ఇక్కడ మోదీ విపరీతంగ ప్రచారం చేశారు. అయినా బిజెపి ఓడిపోయింది. అంటే, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో మోదీ మీద ఆదారపడకుండా స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించాల నేనా సందేశం…
10. జార్ఖండ్ ఖనిజ సంపద విపరీతంగా ఉన్న రాష్ట్రం. అయితే, ఇటీవల ఆర్థిక మాంద్యం పరిశ్రమలను దెబ్బతీసింది. దీనితో ఉత్పత్తి పడిపోయింది. ముడి ఖనిజాల డిమాండ్ తగ్గిపోయింది. గనుల ప్రొడక్షన్ తగ్గిపోయి వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సమస్యను జెఎంఎం-కాంగ్రెస్-ఆర్ జెడి కూటమి బాగా ప్రచారానికి వాడుకుంది.