కెసిఆర్ కి బర్త్ డే గిఫ్ట్ ‘కోటి వృక్షార్చన’

ఈ నెల 17న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు జన్మదినాన  ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కోటి వృక్షార్చన తో అభినందనలు చెప్పాలనుకుంటున్నది. కోటి మొక్కలు ఆయన బర్త్ డే గిఫ్ట్ గా ఈ రోజు కెటిఆర్ ప్రకటించారు.

ఎంపిగా ఎన్నికయిన అయిన మరుక్షణం నుంచి చెట్లు నాటుతున్న  టిఆర్ ఎస్ రాజ్యసభ్యుడు  జోగినపల్లి సంతోష్ కుమార్ ఆలోచన ఇది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు, మంత్రులు మహమూద్ అలీ, తలసానిలు ఇవాళ విడుదల చేశారు. మహబూబా బాద్ ‌ఎంపి మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎంపి అయ్యాక రాజకీయాలు మాట్లాడకుండా గమ్మున చెట్లు నాటే కార్యక్రమంలో సంతోష్ కుమార్ చాలా బిజీగా అన్నారు. ఎక్కడెక్కడి సెలెబ్రిటీలను పిలిపించి మొక్కలు నాటిస్తున్నారు. తొందర్లో సెలెబ్రిటీలు నాటి మొక్కలు ఎలలా బాగా బతికి ఎపుగా పెరుగుతున్నాయని ఆ ఫోటోలతో ఒక ఎగ్జిబిషన్ పెట్టబోతున్నారని వార్త. మొత్తానికి పార్లమెంటు సభ్యలులో ఇలా కోట్ల మొక్కలు నాటిన సభ్యుడీయనే.  చెట్ల నాటినందుకేదయినా అవార్డుంటే ఈ పాటికి వచ్చేది. ముందు ముందు రావచ్చు.

పోస్టర్ విడుదల చేస్తూ  కేటీయార్ మాట్లాడారు. తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న  ముఖ్యమంత్రి ఆశయాలు ప్రతిబించించేలా ప్రతీ ఒక్కరూ ఫిబ్రవరి 17న మూడు మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు.

టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎం.పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీయార్ కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, ఎం.పీ సంతోష్ కుమార్ ను కేటీయార్, మంత్రులు అభినందించారు.

ఆరేళ్ల హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, ఎంపీ సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పచ్చదనం పెంపులో అన్ని వర్గాలను జాగృతం చేస్తోందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని అన్నారు.

రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎం.పీ సంతోష్ కుమార్ కోరారు. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రలు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర మంత్రులు, నేతలకు కార్యక్రమం వివరాలు సంతోష్ కుమార్ ఫోన్ ద్వారా తెలిపి సహకారం కోరారు.

సీఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫోటోలను ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేయాలి.

యాప్ కోసం వాట్సప్ నుంచి 9000365000 నెంబర్ కు GIC అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్ తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫోటోలను ఎవరికి వారు అప్ లోడ్ చేయాలి. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈ మెయిల్ లేదా మొబైల్ కు వారం రోజుల్లో ఎవరికివారికి చేరుతుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *