తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగాలకంటే తీసేసినవే ఎక్కువ : వంశీచంద్ రెడ్డి

ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాద్యాయులు నాకు రెండు కండ్లు అని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానంగా వేతనాలు అందిస్తామని, కాంట్రాక్టు, ఔట్ సోర్చింగ్ పద్ధతికి స్వస్తి అని హామీఇచ్చిన కేసీఆర్ అధికారం చేపట్టాక అన్నింటిని మర్చిపోయారని ఎఐసిసి కార్యదర్శి, మాజి ఎమ్మెల్య వంశీచంద్ రెడ్డి విమర్శించారు.
  పి.ఆర్.సి విడుదల చేయక, ఐ.ఆర్ ప్రకటించక, డి.ఏ ఇవ్వక, సి.పీ.యెస్ విధానం రద్దు చేయక, కొత్త ఉద్యోగాలు భర్తీ చేయక, చేసిన కొద్ది ఉద్యోగాలు శరమదోపిడికి పాలుపడుతూ కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తూ, నియమించిన ఉద్యోగలకన్నా ఎక్కువ ఉద్యోగాలు తొలగిస్తూ టిఆర్ ఎస్  ప్రభుత్వం ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వమని రుజువయిందని ఆయన అన్నారు.
ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వం అనడానికి గొప్ప ఉదాహరణ తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు దాటినా అంతర్రాష్ట్ర బదిలీలకు నోచుకోని ఉద్యోగస్తులని ఆయన వివరించారు.
ఉద్యోగరీత్యా భార్య-భర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో కుటుంబాలకు దూరంగా, జీవితాలు భారంగా నెట్టుకొస్తూ, ఇప్పుడు కరోనా భయంతో చాలా భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారని, వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ముఖ్యమంత్రికి  ఒక లేఖ రాశారు.
అంతరాష్ట్ర ఉద్యోగుల బదిలీలు చేపట్టుటకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తూ ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలు సమావేశమై జారీ చేసిన ఉత్తర్వులు: Cir. Memo No.9940/SPF&MC/2015, Dt.07.08.2017 ప్రకారం దరఖాస్తు చేసుకున్నాక  బదిలీ ప్రక్రియ 2 నెలల్లో పూర్తి చేయాలని, కానీ ఇప్పటికీ ఎన్నో బదిలీ ఫైళ్లు సెక్షన్ ఆఫీసర్ల దగ్గర మూలుగుతున్నాయని ఆయన అన్నారు.   లంచాలు ఇచ్చిన వారివి మాత్రం ఆఘమేఘాలమీద ఉత్తర్వులు విడుదలవుతున్నాయని ఆయన  పేర్కొన్నారు.
వచ్చిన దరఖాస్తులు అన్ని ఒకేసారి పరిశీలించి అర్హులు అయిన వారిని వెంటనే బదిలీ చేయవలసి ఉండగా కొంత మంది అధికారులు లంచాలు ఇచ్చిన వారివి ముందుగా పూర్తి చేసి లంచాలు ఇవ్వని వారి దరఖాస్తులు పరిశీలించకుండా పెండింగులో పెట్టడంలో గల ఆంతర్యమేమిటో ప్రభుత్వమే చెప్పాలని దుయ్యబట్టారు.
ఇప్పటికీ నాలుగు సార్లు బదిలీల ప్రక్రియ గడువును సవరిస్తు చివరి సారిగా 30.06.2019 తేది వరకు పెంచినప్పటికి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తూ , అవినీతికి పాల్పడుతూ కొన్ని ఫైళ్ళు మాత్రమే పూర్తి చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు శాసనసభ ఎన్నికలు ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ్ ఉందంటూ అధికారులు అన్ని బదిలీ ఫైళ్లు పెండింగులో పెట్టారన్నారు.
మరోసారి గడువు పెంపు విషయంలో AP ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఒక లేఖను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రాశారని, ఈ గడువు పెంపుకు సంబంధించిన ఫైల్ no.7824/2019 మన ముఖ్యమంత్రి వద్ద పెండింగులో ఉందన్నారు.
ఈ ఫైలు పక్కన పెట్టేసి , గడువు పెంపు ఉత్తర్వులకు సంబంధం లేకుండా మొన్నటికి మొన్న, అనగా కరోనా లాక్డౌన్ సమయంలో కూడా లంచాలకు మరిగి ఉద్యోగ బదిలీలు చేపట్టారన్నారు. ఇటీవల ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ AP నుండి రిలీవ్ అయి TS లో పోస్టింగ్ కూడా పొందారన్నారు.
ముఖ్యమంత్రి గారు తక్షణమే బదిలీల గడువు పెంపు ఫైల్ నెం.7824/2019 పై సానుకూల నిర్ణయం తీసుకొని పెండింగులో ఉన్న అన్ని అంతర్రాష్ట్ర బదిలీలను చేపట్టి ఉద్యోగస్తులకు మేలు చేయాలని కోరారు. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి భయానక పరిస్థితుల్లో భార్య భర్తలు వేరువేరు రాష్ట్రాల్లో ఉంటున్నవారు కొందరైతే, తమ కుటుంబాలకు దూరంగా తమ వృద్ధ తల్లీదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగాలు చేస్తున్న వారు కొందరు ఉన్నారని వారి మనోవేదన వర్ణాతీతం అని అన్నారు.
ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుండి NOC లు పొందిన వారందరినీ, గడువు పెంపుతో సంబంధం లేకుండా వెంటనే బదిలీ జి.ఓ లు జారీ చేసి వారి సర్వీస్ నష్టపోకుండా న్యాయం చేయాలని కోరారు.