భోగాపురం- విశాఖపట్నం మధ్య మెట్రో రైలు: జగన్ హామీ

అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ప్రభుత్వంతో జీఎంఆర్‌ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖనగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటుపైనా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
ఈ ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్రప్రాంతానికి మంచి రవాణ సదుపాయం వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. ఎయిర్‌ పోర్టునుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని, వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేస్తామని సీఎం చెప్పారు.
విశాఖ-భోగాపురం మధ్య దూరం దాదాపు 60 కిమీ.
 పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాలవలవన్, జీఎంఆర్‌ ఛైర్మన్‌ జీబీఎస్‌. రాజు సంతకాలు చేశారు.పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఆర్కే రోజా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎప్పటికీ గుర్తుండిపోయే రీతిలో  ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని, తాము పుట్టిన ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.