హైదరాబాదీయులకు సమృద్ధిగా చేపలు, వూరంతా మొబైల్ ఫిష్ స్టాల్స్

కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని తన కార్యాలయం వద్ద మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
 ప్రజలకు పరిశుభ్రమైన చేపలు, చేపల వంటకాలను అందించేందుకు ghmc పరిధిలోని 150 డివిజన్ లలో డివిజన్ కు ఒకటి చొప్పున ఒక మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
దూర ప్రాంతాలలో ఉన్న చేపల మార్కెట్ కు వెళ్లి చేపలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్దకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ద్వారా తక్కువ ధరకు చేపలను విక్రయించే అవకాశం ఉంటుందని, వివిధ రకాల చేపల వంటకాలు చేరువ చేసేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
నేషనల్ ఫిష్ డెవలప్ మెంట్ బోర్డ్, తెలంగాణ మత్స్య శాఖల ఆధ్వర్యంలో ఈ వాహనాలను అర్హులైన లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ వాహనాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని  తలసాని చెప్పారు.
కులవృత్తుల పై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి.  వారి జీవితాలలో వెలుగులు నింపాలి అనేది ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం, కల. గత ప్రభుత్వాలు మత్స్య శాఖ కు నిధులు కేటాయించకుండా తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేశాయి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నది.  ఉచితంగా చేపపిల్లల పంపిణీతో రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా 2019-20 సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో 3 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుంది.
అంతేకాకుండా చేపలు విక్రయించుకోవడానికి 65 వేల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లగేజి ట్రాలీలు, వృత్తి పరంగా అవసరమైన వలలు, కేట్స్ ను మత్స్యకారులకు పంపిణీ చేశాం.
రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన నీటి ప్రాజెక్ట్ లతో అనేక నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయి.  ప్రతి నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసి మత్స్య సంపదను పెంచడం ద్వారా మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం.
రానున్న రోజులలో పెరగనున్న మత్స్య సంపదను మార్కెటింగ్ చేసేందుకు కూడా భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
పశుసంవర్ధక శాఖ కార్యదర్శి శ్రీ అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, TSLDA CEO మంజువాణి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్  లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్  రాంచందర్, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.