అచ్చన్నాయుడి అరెస్టు వెనక రాజధాని తరలింపు రాజకీయం: కిలారు దిలీప్ అనుమానం

విజయవాడ : టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అక్రమ అరెస్టు చేసిన తీరును ఏపీ బిజెపి నాయకుడు, బిజెపి అధికార ప్రతినిధి దిలీప్ కిలారు ఖండించారు.
రేపిస్టులు, గూండాలను అరెస్ట్ చేసిన పద్థతిలో ఒక మాజీ మంత్రిని ఏసీబీ అరెస్ట్ చేయడం సరికాదని,  కొరోనా టైంలో మూడు వందల మంది పోలీసులతో హంగామా సృష్టించి, అరెస్ట్ చేసిన విధానం ఏ మాత్రం సరిగ్గా లేదని దిలీప్  తప్పుబట్టారు.
అచ్చన్నాయుడు వెనక ఉత్తరాంధ్ర  రాజకీయం ఉందని, రాజధాని తరలించాలనే తాపత్రయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు వ్యతిరేకంగా మారిన  ఒక ఉత్తరాంధ్ర  రాజకీయ కుటుంబం గొంతు నొక్కే కుట్ర ఇందులో కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు.
“అసెంబ్లీ సమావేశాలకు కేవలం నాలుగు రోజుల ముందు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఒక హిడెన్ ఎజెండాతోనే ఏపీ సిఎం జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని అనుమానంగా ఉంది. విశాఖను రాజధానిగా చేయాలనే అలోచన వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్  ఉత్తరాంధ్రపై ఎక్కువగా దృష్టిపెట్టారు.  ఆ ప్రాంతంలో పట్టు కోసం పాకులాడుతున్నారు.”
“అచ్చెన్నాయుడు, కింజారపు కుటుంబం జగన్‌కు కంటగింపుగా మారడం వల్లే ఏసీబీ విచారణ పేరుతో ఉచ్చు బిగించి రాజకీయంగా దెబ్బకొట్టేందుకే ఇలా చేస్తున్నారని పిస్తుంది.” అని దిలీప్ వ్యాఖ్యానించారు.
‘ఒకవేళ రూ.150 కోట్ల అవినీతి ఈఎస్ఐ మందుల స్కాంలో జరిగిందని ఏసీబీ భావిస్తే.. అందుకు తగ్గ ఆధారాలతో లీగల్ నోటీసులు ఇచ్చి ఓ పద్ధతి ప్రకారం వెళ్లి ఉండొచ్చు.  వాస్తవానికి ఈఎస్ఐ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం.  వాటిని అమలు చేసే బాధ్యత మాత్రమే రాష్ట్రాల పరిధిలో ఉంటుంది.  ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి,’ అని దిలీప్ పేర్కొన్నారు.
 అక్రమాలు జరిగాయనే ఆధారాలు ఉంటే క్లర్క్ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకూ అందరినీ ఈ పాటికే విచారించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
 సంబంధిత శాఖా మంత్రి కేవలం లెటర్ రాశారనే నెపంతో ఆయనపై నేరం మోపడం సరికాదని అంటూ  ఒక మాజీ మంత్రిని హ్యాండిల్ చేసే విధానం ఇది కానే కాదని, కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం బాధాకారమని కిలారు దిలీప్ ఆవేదన వ్యక్తం చేశారు.
 రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏపీపై రాజకీయాలపై మాయని మచ్చలాంటిదని వ్యాఖ్యానించారు.
దిలీప్ ఇంకా ఏమన్నారంటే...
 ఏడాది పాలన అసమర్థత బయటపడకుండా, జనాలను దృష్టి మరల్చేందుకే జగన్ ఇలాంటి డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారనిపిస్తున్నది.  కోర్టు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా.. తన పద్థతి, పంథాలో ఎలాంటి మార్పూ లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఏపీ బిజెపి నాయకులు పదే పదే జగన్మోహన్ రెడ్డి తప్పులను ఎండగడ్తుంటే.. వాటికి సమాధానం చెప్పాల్సిందిపోయి రివర్స్‌లో మమ్మల్ని టిడిపి ఏజెంట్లని ముద్రవేయడం జగన్ కు  అలవాటైపోయింది .  మనీ పాలిటిక్స్ చేసేవాళ్లు కాబట్టే తమనీ ఆ కోవలో చేర్చాలని తాపత్రయపడ్తున్నారు.  ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి.