కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నట్లు… నిర్మలా సీతారామన్ బడ్జెట్

 కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నట్లున్న కేంద్ర బడ్జెట్ ?
విభజన చట్టం అమలుకు నిజాయితీగా కార్యాచరణ ఏది ?
కీలక అంశాలపై పరస్పర విరుద్ధంగా కేంద్ర బడ్జెట్!
రెండవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. తొలి బడ్జెట్ కావడం వల్ల ఈ బడ్జెట్ స్వభావం రాబోయే ఐదు సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ నడకను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా ఈ బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
మోదీ తొలి బడ్జెట్ గ్రామీణాభివృద్ధి , రహదారుల విస్తరణకు సానుకూలంగా స్పందించింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రం వారి ప్రయోజనాల కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రోపర్షనల్ విద్యారంగం సీట్ల సంఖ్యను 2 లక్షలుకు పెంచడం , దేశవ్యాప్తంగా 150 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం లాంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ కీలక అంశాల విషయంలో పరస్పర విరుద్ధమైన ప్రతిపాదనలు కనిపిస్తుంది.
ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే కీలకమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలపై దృష్టి సారించినపుడే సాధ్యం. పద్దులో ఈ రంగాలే తమ ప్రాధాన్యత అని చెపుతూనే ఎంచుకున్న మార్గం మాత్రం భిన్నంగా ఉంది.
విత్త మంత్రి తన ప్రతిపాదనలో ప్రపంచ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గుముఖం పట్టాయి అని స్పష్టంగా ప్రకటించారు. దానర్థం రాబోయే కాలంలో విదేశీ పెట్టుబడులుకు అవకాశాలు తక్కువ.
సాధారణంగా కేంద్ర కీలక సంస్థలు మొదట నిర్మాణం చేస్తేనే వాటి చుట్టూ ప్రవేటుసంస్థలు ముందుకు వస్తాయి. హైదరాబాద్ అనుభవం కూడా అదే. నేడు కేంద్రం కీలక సంస్థలు అయిన మహానవరత్న స్థాయి సంస్థలను కుదించే ప్రతిపాదనలు చేయడం జరిగింది.
దేశంలో కీలక సంస్థల స్థాపన, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులను సమకూర్చింది యల్ ఐ సి. బీమారంగాలే.  దేశంలో ప్రజల పొదుపు తద్వారా దేశాభివృద్ధికి నిధుల అవకాశం ఏర్పడింది.
ఇలాంటి సంస్థను బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాల్సింది పోయి ఆరంగాన్ని బలహీన పరిచే విధంగా ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులకు 100 శాతం అనుమతి ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
పలితం ప్రజల పొదుపుకు ముప్పు ఏర్పడటంతో బాటు మన సొమ్ము విదేశీ సంస్థలకు చేరి దేశ అవసరాలకు అందకుండా పోతుంది. విదేశీ పెట్టుబడులుకు అవకాశాలు తక్కువని అంచనా వేస్తూనే స్వదేశీ సంస్థలను ప్రవేటికరిస్తూ ఎలా దేశంలో పారిశ్రమిక అభివృద్ధి చేస్తారో అర్థం కావడం లేదు.
వ్యవసాయ రంగంలో రైతులకు పెట్టుబడి సాయం లాంటి ఊరట కలిగించే చర్యలు తీసుకున్నా కీలకమైన నీటి కొరతను అధిగమించడానికి నదుల అనుసంధానం చేసే ప్రయత్నానికి తగిన చర్యలు పద్దులో లేవు.
అలా కేంద్రం భారతదేశం ఆర్థిక పునాదులను తానే బలహీనపరిచే చర్యలు చేపట్టడానికి పూనుకోవడం ద్వారా తాను కూర్చున్న కొమ్మను తానే స్వయంగా నరుకొంటున్నట్లు చెందంగా మారింది అని చెప్పక తప్పదు.
విభజన చట్టం అమలుకు నిజాయితితో కూడిన కార్యాచరణ ఏది…..
ఏపీకి సాయం అంటే అర్థం విభజన చట్టాన్ని అమలు చేయడం , హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడం. విభజన చట్టం అమలుకు పది సంవత్సరాల కాలపరిమితి ఉన్నది. అందులో ఐదు సంవత్సరాలు ముగిసింది. ఇక మిగిలింది ఈఐదు సంవత్సరాలు మాత్రమే.
రాజధాని నిధులు , లోటు బడ్జెట్ , కీలక సంస్థల స్థాపన , ముక్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి నిధులుపై స్పష్టంగా బడ్జెట్ లో పేర్కొనాలి.
కానీ అలాంటి ఆలోచన కూడా కేంద్రం చేయకపోవడం అన్యాయం. కేంద్రం స్పష్టంగా తమ సాయాన్ని ప్రకటించాలి. కానీ అందుకు భిన్నంగా కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసే సాదారణ నిధులను, విభజన చట్టంలోని కొన్ని అంశాలకు అవసరమైన నిధులను కలిపి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నామని రాజకీయాలు చేస్తున్నారు.
సాధారణ నిధుల కేటాయింపు , విభజన చట్టం అమలు , హోదా లేదా దాని స్థానంలో ప్యాకేజి అమలుకు కేంద్రం తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుచేయాలి. ఆవైపుగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కృషి చేయాలి.
(యం. పురుషోత్తమ రెడ్డి,సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరం)