‘అమ్రపాలి’ కష్టాల్లో ఎంఎస్ ధోని, భార్య సాక్షి ధోని

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కష్టాల్లో పడ్డాడు. ఈ సారి ఆయన భార్య వ్యాపార లావాదేవీలు వివాదాస్పదమయ్యాయి.
ధోని క్రికెట్ నుంచి రిటైర్ అవుతారని మొన్నామధ్య వూహాగానాలు వెలు వడ్డాయి. ఇదే మంత సీరియస్ వ్యవహారం కాదు. అయితే, ఇపుడు సుప్రీంకోర్టు నియమించిన ఆడిటర్లు ధోని భార్య సాక్షి ధోని గురించి చాలా ఇబ్బందికరమయిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు.
దేశాన్ని కుదిపేస్తున్న హౌసింగ్ కంపెనీ ‘అమ్రపాలి గ్రూప్’  తో  ధోనికి సాక్షికి సంబంధాలున్నాయని, అంతేకాదు, అమ్రపాలి కంపెనీ కొనుగోలు దార్లనుంచి వసూలు చేసిన చాలా డబ్బును ధోని, భార్య అకౌంట్లోకి బదలాయించారని వారు కనుగొన్నారు.
సుప్రీంకోర్టు ఫొరెన్సిక్ ఆడిటర్లు పవన్ కుమార్ అగర్వాల్, రవీంద్ర భాటియా ఒక ఆసక్తికరమయినవిషయాన్ని వెల్లడించారు.
అక్రమాల్లో పీకలదాకా కూరుకుపోయిన అమ్రపాలిగ్రూప్ రీతి స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ప్రయివేటు లిమిటెడ్, అమ్రపాలి మహి డెవెలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలతో బోగస్ అగ్రి మెంట్లు చేసుకుంది.
మహి అంటే ఎవరో తెలుసుగా,అది ధోని ముద్దుపేరు. ధోనికి రీతి స్పోర్స్ట్ కంపెనీలో భాగస్వామ్యం ఉంటే, సాక్షి ధోని ఆమ్రపాలి మహి డెవెలపర్స్ డైరెక్టర్. ఇక అమ్రపాలి గ్రూప్ కు ధోని బ్రాండ్ అంబాసిడర్.
ఇది కూడా చదవండి: బెల్జియం మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆంధ్రా సక్సెస్ స్టోరీ
అమ్రపాలి గ్రూప్ కంపెనీల దగ్గిర ఇళ్లు కొనాలని మోసపోయిన వేలాది మంది మధ్య తరగతి కుటుంబాల వాళ్ల వత్తిడి తీసుకురావడంతో ధోని బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టు నుంచి తప్పుకున్నాడు.
‘ఇళ్ల కోసం కొనుగోలు దారులు చెల్లించిన డబ్బులో కొంత భాగాన్ని అమ్రపాలి గ్రూప్ రీతి స్పోర్ట్స్ కు మళ్లించింది. ఇది తప్పు. ఈ డబ్బునంతా ఈ కంపెనీ నుంచి రాబట్టాలి. రీతి కంపెనీ అమ్రపాలి గ్రూప్ తో చేసుకున్న ఒప్పందం బోగస్. అది చెల్లదు,’ అని సుప్రీంకోర్టు ఆడిటర్లు చెబుతున్నారు.
వారు చెప్పిన విషయాలను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యు యు లలిత్ తమ తీర్పులో ఆడిటర్లు చెప్పిన విషయాలను ప్రస్తావించారు. తీర్పు నిన్న వెలువడింది. కంపెనీ రేరా రిజస్ట్రేషన్ ను, నోయిడా, గ్రేటర్ నోయిడా పాలకసంస్థలు ఈకంపెనీకి ఇచ్చిన లీజ్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
చారిత్రాత్మకమయి ఈ తీర్పులో న్యాయమూర్తులు 23 కంపెనీల పేర్లను ప్రస్తావిస్తూ వీటన్నింటి అమ్రపాలి గ్రూప్ కేవలం డబ్బులు దొంగగా ట్రాన్స్ ఫర్ చేసేందుకు సృష్టించిందని, అఫీస్ బాయ్స్ తో కూడా కంపెనీలు ఏర్పాటుచేశారని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
రీతి స్పోర్ట్ట్స్ మేనేజ్మెంట్ ప్రయివేటు లిమిటెడ్ ప్రొఫెషనల్ చార్జెస్ పేరుతో అమ్రపాలి రు. 24 కోట్లు చెల్లించిందని, 2009-2015 మధ్య ఆమ్రపాలి గ్రూప్ రీతి స్పోర్ట్స్ కు మొత్తంగా రు. 42.22 కోట్లు చెల్లించింది. రీతికి ఎందుకు ఇంత పెద్ద మొత్తం లో డబ్బు చెల్లించారనేందుకు సమాధానం లేదు.
ఇది కూడా చదవండి: చంద్రయాన్ 2 అసలు థ్రిల్లర్ ఇక మొదలవుతుంది, ఇలా
కేవలం నిధులు మళ్లించేందుకే ధోని కంపెనీతో బోగస్ అగ్రిమెంటు చేసుకున్నారని, అది కూడా తెల్లకాగితం మీద చేసుకున్నారని అడిటర్లు పేర్కొన్నారు.
ఆమ్రపాలి స్కామ్ ఏమిటి,ఎవరా అనిల్ శర్మ?
అమ్రపాలి అనేది ‘My Home My Right’ అనే నినాదంతో సుడిగాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ప్రవేశించిన కంపెనీ. ఫ్లాట్స్ కట్టి అమ్మడం వ్యాపారం. పాట్నాసమీపంలోకి ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అనిల్ శర్మ ఈకంపెనీ ఎండి. పల్లెటూరి నుంచి వచ్చినా అనిల్ శర్మ విజయవంతంగా ఉన్నత విద్య నభ్యసించాడు.
ఈ వ్యాపారానికి గుర్తింపు తెచ్చేందుకు, బయ్యర్ల విశ్వాసం పెంచుకునేందుకు మహేంద్ర సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్ గా అమ్రపాలి కంపెనీ పెట్టుకుంది.
ఈకంపెనీ ఢిల్లీలోని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలలో 170 టవర్లను నిర్మించే ప్రాజక్టు చేపట్టింది. ఇందులో ఇళ్లు కొనుగోలుచేయాలనుకునే వారి నుంచి భారీ గా అడ్వాన్సులు వసూలు చేసింది.
ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ప్రాజక్టును పూర్తి చేసేందుకు ఖర్చు చేయకుండా ఇతర బోగస్ కంపెనీలు సృష్టించి వాటికి మళ్లించింది.
ఈ సంస్థలో మొత్తం 46,000 మంది బయ్యర్లు ఇళ్లు కొనుగోలుచేసేందుకు డబ్బు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో నుంచి రు.2,996 కోట్లను ఇతర కంపెనీలకు మళ్లించారు.
ధోని, ధోని భార్య కంపెనీలు కూడా ఇందులో భాగమే. ఆమ్రపాలి గ్రూప్ కు చెందిన 15 కంపెనీలు ప్రజలనుంచి రు.11,573 కోట్లు వసూలు చేశాయి. మొదట్లో కంపెనీ బాగా విజయవంతమయింది. దీనితో కంపెనీ ఎండి అనిల్ శర్మకు అత్యాశ పట్టుకుంది.
అనిల్ శర్మ మామూలోడేం కాదు. ఎన్ ఐటిలో ఇంజనీరింగ్, ఐఐటిల పిజి చేశారు. కంపెనీ వ్యాపారం బాగా జరగడంతో ఇతర రంగాలలోకి విస్తరించానుకున్నారు.
రిటైల్ వ్యాపారంలోకి వచ్చాడు. సినిమా రంగంలోకి ప్రవేశించాడు, Gandhi to Hitler, I Don’t Love You అనే సినిమాలు తీశాడు.రాజకీయాల్లో కి వచ్చాడు. బీహార్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయాడు.
తర్వాత రాజ్యసభలో ప్రవేశించే ప్రయత్నం చేశాడు చేతులు కాల్చుకున్నాడు. ఈ క్రమంలో మోసాలు మొదలు పెట్టారు. బోగస్ కంపెనీలు పెట్టి వాటికి డబ్బులు మళ్లించారు.
ఈ దశలోని ధోనిని కూడా తన వ్యాపారంలోకి రప్పించుకున్నాడు. బోగస్ చెక్కులిచ్చాడు. ఖానీలు చేయించాడని ఆరోపణలున్నాయి. ఆయన మీద ఒక అరడజన్ మర్డర్ కేసులున్నాయి. కుంభకోణం ఫిర్యాదులు రావడం,చివరకు కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది.
చేసిన మొసాలన్నింటిని సుప్రీంకోర్టు అనిల్ శర్మ చేత చెప్పించింది. నిధులు మళ్లించిన విషయం , ఎంత మళ్లించింది కూడా ఆయన కోర్టులో వెల్లడించాడు.

(Photo: Outlook India)