హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుపతి,  న‌వంబ‌రు: 21

కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు , కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *