ప్రధాని మోదీ ఎందుకు వస్తున్నట్లు???

 

*రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభమై ఏడాది దాటింది*

*ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 12 న జాతికి అంకితం చేయడానికి అని వస్తున్నారు.. సంతోషం*

*కానీ ఈ కార్యక్రమం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో గానీ, ముఖ్యమంత్రితో గానీ సంప్రదింపులు జరపక పోవడం బాధాకరం*

*ప్రధాని మోడీ సంకుచిత మనస్తత్వానికి ఇది నిదర్శనం*

*కేవలం రాజకీయ కోణంలోనే ప్రధాని మోడీ రామగుండం వస్తున్నారు*

*రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్న కర్మాగారం ఇది*

*ప్రధాని మోడీ జీ…*

*రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన జాతీయ రహదారులు అన్ని ప్రధాని మోడీ ప్రకటించాలి*

*రామగుండం నుంచి మణుగూరు వయా భూపాలపల్లి, మేడారం రైల్వే లైన్ ను ప్రకటించాలి:  రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో యూరియా తో పాటు ఇతర ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి ప్రారంభమై ఒక సంవత్సరం దాటిందని… అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి ఈనెల 12న రామగుండం వస్తున్నారని, సరే సంతోషం.. ప్రధాని పర్యటన సందర్భంగా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి గాని, రాష్ట్ర ముఖ్యమంత్రికి గాని ప్రధాని కార్యక్రమాలపై సంప్రదింపులు జరపాలన్న కనీస పద్ధతులను కేంద్ర ప్రభుత్వం, పీ.ఎం.ఓ అనుసరించకపోవడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

బుధవారం మంత్రుల నివాసంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రామచంద్రనాయక్, జీసిసి చైర్మన్ వాల్యా నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ లతో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని పద్ధతి ప్రకారం ఆహ్వానించక పోవడం, కావాలని నిరోధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

కేవలం రాజకీయ కోణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం వస్తున్నారని వినోద్ కుమార్ ఆక్షేపించారు.

ప్రోటోకాల్ ను పాటించకపోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇది కొత్త కాదని, గతంలో కరోనా సందర్భంగా భారత్ బయోటెక్ పరిశ్రమలో వ్యాక్సిన్స్ ఉత్పత్తి పరిశీలనకు వచ్చిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిరోధించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కొంతమంది పనికట్టుకుని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వినోద్ కుమార్ అన్నారు.

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ( ఈక్విటీ ) ఉందని, ఈ ఎరువుల కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, నీటి సరఫరా చేస్తోందని వినోద్ కుమార్ తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే మూత పడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిపించేందుకు టీ.ఆర్.ఎస్. ఎంపీలు, తాను కలిసి పార్లమెంటులో పోరాడామని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం ఇంజనీర్స్ ఇండియా, ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలతో కలిసి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ పేరు సంస్థ పేరిట కర్మాగారం తిరిగి ప్రారంభం అయిందని వినోద్ కుమార్ తెలిపారు. ఇది కొత్త కర్మాగారం కాదని, మూతపడ్డ కర్మాగారం తిరిగి ఏడాది క్రితం ఉత్పత్తి ప్రారంభం అయిందని ఆయన తెలిపారు.

*జాతీయ రహదారులపై…*

ప్రధాని మోడీ జీ… విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావలసిన అన్ని జాతీయ రహదారులను రామగుండం పర్యటన సందర్భంగా ప్రకటించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి రావలసిన జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ.. దీనికి సంబంధించిన దస్త్రాలు ప్రధాన మంత్రి కార్యాలయంలో, నీతి ఆయోగ్ కార్యాలయంలో ములుగుతున్నాయని వినోద్ కుమార్ తెలిపారు.

1) కరీంనగర్ – సిరిసిల్ల – కామారెడ్డి – పిట్లం, (2) కరీంనగర్ – వీణవంక – జమ్మికుంట – టేకుమట్ల – భూపాలపల్లి, (3) సిద్దిపేట – సిరిసిల్ల – వేములవాడ – కథలాపూర్ – కోరుట్ల, (4) సూరపాక – మంగపేట – ఏటూరునాగారం – తుపాకుల గూడెం – కౌటాల, (5) రాజీవ్ రహదారి – హైదరాబాద్ నుంచి రామగుండం వయా సిద్దిపేట, కరీంనగర్ , పెద్దపల్లి.. ఈ జాతీయ రహదారులను అయినా రామగుండం పర్యటన సందర్భంగా ప్రకటించాలని వినోద్ కుమార్ ప్రధాని మోడీకి డిమాండ్ చేశారు.

*రైల్వే లైన్ పై…*

రామగుండం నుంచి మణుగూరు వయా భూపాలపల్లి మేడారం రైల్వే లైన్ ను రామగుండం పర్యటన సందర్భంగా ప్రకటించాలని వినోద్ కుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి డిమాండ్ చేశారు.

ఈ రైల్వే లైన్ సర్వే పనులు 2005 లో ప్రారంభం అయినప్పటికీ.. ఇప్పటివరకు దాని అతి గతి లేకుండా పోయిందని వినోద్ కుమార్ అన్నారు.

భద్రాచలం – సత్తుపల్లి రైల్వే లైన్ ను ఈనెల 12 న ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారని, అయితే ఈ రైల్వే లైన్ కోసం మొత్తం రూ. 927.94 కోట్లు వ్యయం కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి రూ. 618.55 కోట్లు ఖర్చును భరించిందని వినోద్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *