నేడు తొలి భాషాప్రయుక్త రాష్ట్రం పుట్టిన రోజు

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)

శ్రీభాగ్ తమ అభిమతమని ప్రకటించిన వైసిపి ప్రభుత్వం తొలి భాషప్రయుక్త రాష్ట్రం ఏర్పాడిన అక్టోబర్ 1 ని గుర్తించకపోవడం అన్యాయం !!!

చారిత్రక సత్యాన్ని మరిచిపోతున్న బావి తరానికి చరిత్రను గుర్తించుకునే విధంగా ప్రజలలో చైతన్యం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం సహజం కానీ రాయలసీమ ప్రజల త్యాగాన్ని మరిచిపోతున్న ప్రభుత్వాలకు సీమ ప్రజలే గుర్తు చేయాల్సి రావడం బాధాకరం.

చరిత్రలో ఏమి జరిగింది…

1953 కి పూర్వం తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉంటే ప్రస్తుతం ఉన్న ఆంద్రప్రదేశ్ తమిళనాడులో కలిసి ఉన్నది.మద్రాసు రాష్ట్రంలో ఉండటం ఇష్టం లేక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెద్దల సారధ్యంలో ఆంధ్రమహాసభ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కారణం రాయలసీమ ప్రాంత ప్రజల భాగస్వామ్యం లేకపోవడం. మద్రాసు నగరం కూతవేటు దూరంలో ఉండటం , పెద్ద ప్రాంతం , వ్యవసాయం – విద్య పరంగా అప్పటికే ముందు వరుసలో ఉన్న కోస్తాంధ్రతో కేవలం భాష పేరుతో రాష్ట్రంగా ఉండటం నష్టం అన్న భావన సీమ పెద్దలది. రాయలసీమ ప్రజల భాగస్వామ్యం లేకుండా తెలుగు రాష్ట్ర సాధన సాద్యం కాదని గుర్తించిన కోస్తాంధ్ర పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకుని నూతన రాష్ట్రంలో రాజధాని , కృష్ణలో ప్రధమ వాటా హామీతో శ్రీభాగ్ ఒప్పందం చేసుకుని తమిళనాడు నుంచి తెలుగురాష్ట్రంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో 1953 అక్టోబరు 1 న తొలి భాషప్రయోక్త రాష్ట్రంగా దాదాపు ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రూపంలో నాడు ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అటు పిమ్మట ఆంధ్రరాష్ట్రం – తెలంగాణ కలిపి పెద్దమనుషుల అవగాహన మేరకు విశాలాంధ్రగా 1956 నవంబరు 1 ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.

1953_1956 హధ్య ఆంధ్ర రాష్ట్ర భూభాగం (బ్లూ భాగం). source . wikipedia

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నవంబరు 1 కి ప్రాధాన్యత లేదు

2014 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. సహాజంగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2 ను తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. విభజనను వ్యతిరేకించిన ప్రాంతం , చారిత్రకంగా 1953 రాష్ట్ర ఏర్పాటు జరిగిన ప్రాంత కావడం వల్ల జూన్ 2 ని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేము. అదే సమయంలో తెలంగాణ , ఆంధ్రరాష్ట్రం కలయకకు చిహ్నంగా ఉన్న నవంబరు 1 కి రాష్ట్ర విభజన , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణంగా ప్రాధాన్యత కోల్పోయింది. అదే సందర్భంలో 1953 అక్టోబరు 1న ఏర్పడిన పూర్వ ఆంధ్ర రాష్ట్ర రూపంలో శ్రీభాగా ఒప్పం అవగాహన , పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఏర్పడిన ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నందున చారిత్రకంగా అక్టోబర్ 1 న ఆంద్రప్రదేశ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగడం సముచితంగా ఉంటుంది.

రాయలసీమ అంశాలు చర్చకు వస్తుందన్న కారణమే అక్టోబరు 1 న అవతరణకు ఆటంకం అయితే సమైక్యతకు అర్థం లేదు……

చారిత్రకంగా చూచినా , నైతికంగా ఆలోచించినా తెలంగాణ , ఆంధ్ర రాష్ట్ర కలయకకు చిహ్నం జరుపుకునే నవంబరు 1 కి విభజన తర్వాత ప్రాధాన్యత లేదు. పూర్వ ఆంధ్ర రాష్ట్ర రూపంలో ఆంద్రప్రదేశ్ ఉన్న రాష్ట్రానికి చిహ్నంగా ఉన్న అక్టోబర్ 1 ని జరపకపోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా పాలకులు ముందుకు రాకపోవడానికి రాయలసీమ అంశాలు చర్చకు రావడమే ఆటంకంగా ఉన్నాయా ? అన్న అనుమానం కలగక మానదు. నాడు చెన్నై నుంచి కోస్తా ప్రాంతంతో విడిపోవడానికి రాయలసీమ ప్రజలు ఆసక్తి చూపలేదు. రాయలసీమ ప్రజలకు కోస్తా పెద్దలు ఇచ్చిన హామీ పత్రమే శ్రీభాగ్. నేడు అక్టోబర్ 1ని అవతరణ దినోత్సవం జరుపుకుంటే రాజధాని , కృష్ణా నది నీటి లభ్యతలో ప్రధమ ప్రాధాన్యత రాయలసీమకు ఇవ్వాలని అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలన్న విషయాలు చర్చకు రావడం , 69 సంవత్సరాలుగా అమలుకు నోచుకోని కారణంగా రాయలసీమ వెనుకబాటు ప్రజల ముందుకు వస్తుంది. అది ఇష్టం లేకనే అక్టోబర్ 1 ని గత ప్రభుత్వం గుర్తించలేదన్నది నగ్న సత్యం.

శ్రీభాగ్ మా విధానమన్న వైసిపి ప్రభుత్వం కూడా గుర్తించకపోవడం అన్యాయం.

శ్రీభాగ్ ఒప్పందాన్ని గుర్తుకు చేసుకుంటూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తమ ప్రాధాన్యత అని మూడు రాజధానుల అభిమతాన్ని ప్రకటిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా అక్టోబర్ 1ని గుర్తించక పోవడం అన్యాయం. శ్రీభాగ్ లేని ఆంధ్రరాష్టాన్ని ఉహించలేము. నవంబర్ 1 ని అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కనీసం రాయలసీమ ప్రజల త్యాగ ఫలితంగా తొలి భాషప్రయుక్త రాష్టం ఏర్పాటుకు దారి తీసిన చారిత్రాత్మక నేపథ్యం కలిగిన అక్టోబర్ 1- 1953 కి గుర్తింపు ఇవ్వడం ప్రస్తుత వైసిపి ప్రభుత్వ కనీస ధర్మం.

(మాకిిరెడ్డి రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *