తెలంగాణ విమోచన, రాజకీయాలు, వాస్తవాలు

 

ఆదిత్య కృష్ణ

సెప్టెంబర్‌ 17 విమోచన దినం అని బీజేపీ వారు మళ్ళీ ఊరేగుతున్నారు. కేంద్ర పభుత్వం తరఫున  తెలంగాణ విమోచన వజ్రోత్సవాలు ఒక సంవత్సరం పాటు ఘనంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను  పాల్గొన వలసిందిగా ఆహ్వాన లేఖలు రాశారు [ఇవి గత నిజాం రాష్ట్రం లోని భాగాలు ]. మరు క్షణమే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది విలీన వజ్రోత్సవాల సంవత్సరంగా ప్రకటించింది.  విలీన, విమోచన, విద్రోహ, విషాద దినం అంటూ తెలంగాణలో లోగడ చాలా చర్చే సాగింది. తెలంగాణ ప్రత్యేక  రాష్ట్ర ఉద్యమ కాలంలో సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కానీ ఆంధ్ర పాలకులు తెలంగాణ చరిత్రను అణచివేయటానికే ఈ ఉత్సవాలు నిర్వహించటం లేదని  కె సి ఆర్  చెప్పేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర అవతరణ దినోత్సవం [2-06-2014 ] జరుపుతున్నారు కానీ సెప్టెంబరు 17  అధికార పూర్వకంగా నిర్వహించటం లేదు. దాని విషయంలో అనేక వాదోపవాదాలు ఉన్నాయి. విమోచన దినం గురించి మాట తప్పారన్న ఆరోపణకు కేసిఆర్ గతంలో జవాబు చెప్పారు: చాలామంది విజ్ఞులను, చరిత్రను సంప్రదించానని; అనేక విషాదాలతో కూడిన ఆ ఘట్టాన్ని ఉత్సవంగా జరపటం భావ్యం కాదని  ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాల ప్రతిష్టను మూట గట్టుకు పోకుండా ఇప్పుడు తాను కూడా వజ్రోత్సవాలను ప్రకటించారు. బి జె పి కుటిల రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టటం పేర  మజ్లిస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా అనేక పేర్లతో ఈ సంబరాలు జరపటానికి సిద్దపడుతున్నాయి. ఈ సంవత్సరం మనం ఎన్ని నాటకాలు చూడవలసి వున్నదో !

పేరుకి  నిజాము నుంచి విమోచన కానీ, సైన్యం తెలంగాణలో ప్రవేశించిన మూడు రోజులలో నిజాం ప్రతిఘటన ముగిసిపోయింది.  సైన్యం ఇక్కడే తిష్ట వేసి  1948-51కాలంలో వేలాది రైతాంగ, కమ్యునిస్టు కార్యకర్తలను హతమార్చింది. లక్ష మందిని జైళ్లలో నిర్బంధించింది. అంతేకాక 25 నుంచి 40వేల మంది  ముస్లిం లను ఊచకోత కోసిందని, వందలాది మానభంగాలు జరిగాయని ప్రధాని నెహ్రూ నియమించిన సుందర్లాల్ కమిషన్ తేల్చింది. దశాబ్దాల పాటు రహస్యంగా వుంచిన  ఆ రిపోర్టు ఆలస్యంగా బైటపడింది. ఈ గాయాలన్నీ ప్రత్యేక రాష్ట్ర  ఉద్యమంలో ప్రస్ఫుటమైనాయి. అందుకే విమోచన దినం జరపాలన్న ఆలోచనను మానుకున్నారు. కేసిఆర్ ని వ్యతిరేకించటానికి అనేక సమస్యలున్నాయి. కానీ ద్వేషాగ్నిలో చుట్టలు ముట్టించుకునే బీజేపీ రాజకీయాలకది చాలదు, పడదు. గత చరిత్రని నిజాం వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక కోణంలోనే అది ప్రచారం చేస్తూ ఉంటుంది.

తెలంగాణ ప్రజలు – ముఖ్యంగా గత చరిత్ర అంతగా తెలియని యువతరం – కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సిఉంది. చారిత్రకమైన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం గురించి పాఠ్యపుస్తకాలలో ఏమాత్రం లేకుండా ఆరున్నర  దశాబ్దాలు దొర్లి పోయాక, ఇటీవలే సిలబసులో  ప్రవేశపెట్టారు, కానీ లోతైన అధ్యయనం లేకపొతే ఉద్యమాల లోతుపాతులు తెలియవు. పాలకులు చెప్పే వక్రీకరణల గొంతు పెద్దది కనుక అదే నిజమని నమ్ముతారు.  దానికి తోడు తెలంగాణా, హైదరాబాదుల చరిత్ర బొత్తిగా తెలియని ఉత్తరాది బిజెపి నాయకుల అజ్ఞానాన్ని, అబధ్ధాలను ప్రశ్నించకుండా ప్రచారంచేసే మీడియా కథనాలకు అడ్డులేకుండా పోతున్నది. నైజాము రాజు రజాకార్ల నేతృత్వంలో పనిచేసారనటం చారిత్రక అజ్ఞానం. హైదరాబాదు సంస్థానానికి, బ్రిటిషువారికి మధ్య క్రీ.శ.1800 అక్టోబరు 12నాడు చేసుకున్న ఒప్పందం (The Treaty of Subsidiary Alliance) ప్రకారం నైజాము బ్రిటిషువారికి సామంతరాజ్యంగా వుండేది. “బ్రిటిషువారు నామినేటుచేసిన ఒక ప్రధాని వుండేవారు. ముఖ్య మైన రెవిన్యూ, పోలీసు, ఆర్థికమంత్రులను  బ్రిటిషువారే  నియమించే వారు. అన్నిటికన్నా మించినది బ్రిటిషువారి సైన్యం సికింద రాబాదులో మకాంవేసి వుండేది.” అని దేవులపల్లి వెంకటేశ్వరరావు  తెలంగాణ ప్రజల సాయుధపోరాట చరిత్రలో రాశారు

చరిత్ర రచనలో కమ్యూనిస్టు ప్రభావం ఉందని కిషన్ రెడ్డి వాపోయారు (స్వరాజ్య 2020 సెప్టెంబరు16). నిజానికి  రచనలో కాదు, తెలంగాణ చరిత్ర నిర్మాణంలోనే కమ్యూనిస్టుల పాత్ర ఘనమైనది. అదలా ఉంచి పాలకుల సాధికారిక కథనాన్నే చూద్దాం.  “భారతదేశ సంస్థానాల విలీన గాథ” (The Story Of The Integration Of The Indian States) ను , వివరించిన ప్రసిధ్ధ గ్రంథ రచయిత విపి మీనన్. 1917 నుంచి వరుసగా ముగ్గురు వైస్రాయిలకు, చివర మౌంట్ బాటనుకి కార్యదర్శిగా, రాజ్యాంగ సలహాదారుగా పనిచేసిన ఐసియస్ అధికారి ఆయన, సంస్థానాల విలీన వ్యవహారాల పరిష్కారానికై 1947జూన్ 27న ఏర్పడిన  ‘కేంద్ర సంస్థానాల మంత్రిత్వశాఖ’ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ శాఖ మంత్రి సర్దార్ పటేలుకి కుడి భుజంగా వుండేవారు. పటేల్ కోరికపైనే ఈ గ్రంథాన్ని రచించానని ముందుమాటలో (1955 సెప్టెంబర్) ఆయన రాసారు. ఈ పనిలో మౌంట్ బాటన్ కీలకపాత్ర అవసరమన్న మీనన్ సూచనను పటేల్ వెంటనే అంగీకరించారు. అలా ఈ ముగ్గురు కృష్ణులతో రాయబారం నాటకంలా సాగింది విలీన ప్రక్రియంతా. సంస్థానాల విలీనంలో పటేలు హీరో ఐతే, స్క్రీన్ ప్లే మౌంట్ బాటన్, డైలాగ్ మీనన్. హైదరాబాదు గురించి ఉత్తర ప్రత్యుత్తరాలే కాక, కనీసం పది కీలక సమావేశాల్లో వైస్రాయి పాల్గొన్నారు. ఆధునిక భారత నిర్మాత మౌంట్ బాటన్ వర్ధిల్లాలి అని దేశంలోని అనేక చోట్ల నినాదాలిచ్చారు!

మోదీగారు నెలకొల్పిన భారీ పటేల్ విగ్రహానికి  స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనిపేరుపెట్టారు. కానీ తెలంగాణలో వారి పనంతా ప్రజలను విభజించే  ద్వేష రాజకీయాలవ్యాప్తే. పటేల్ ని  ఆకాశాని కెత్తటం, నెహ్రూని తూలనాడటం వారి ఎత్తుగడల్లో భాగం. 565 సంస్థానాల విలీన గాథలో ఉక్కుమనిషిగా పటేలుని స్మరిస్తుంటారు. విలీన వివరాలు కొన్ని చూద్దాం: ‘రక్షణ, విదేశీ, కమ్యూనికేషన్లు మాత్రమే కేంద్రానివి’ అని చెప్పి 140 పెద్ద సంస్థానాలతో విలీన ఒప్పందం  చేసుకున్నారు. ఈనాడు రాష్ట్రాల అధికారాలు కుంచించుకు పోయి కేంద్ర ప్రభుత్వమే అన్నీ అధికారాలు గుప్పెట పెట్టుకున్నది చూస్తున్నాము. 565 లో సుమారు ఒక వంద తప్ప మిగతా సంస్థానాలు నేటి గుజరాత్, రాజస్తాన్, ముంబయి ప్రాంతాలవే. 300 మరీ చిన్నవి, గుజరాతుకి చెందినవి; ఈ రాజులలో అత్యధికులు గుజరాతు నాయకుడైన పటేలుకి, గాంధీకీ పరిచయస్తులే. 565 లో “327 చిల్లర రాజ్యాలు (పెటీస్టేట్స్), వీటి సగటు విస్తీర్ణం 20 చ.మైళ్ళు, సగటు జనాభా 3000, వారివి పరిమిత అధికారాలే” అన్నారు రాజ్యాంగ సభ సలహాదారు బి యన్ రావు. 450 సంస్థానాలకి అప్పటి సగటు వార్షిక ఆదాయం 15 లక్షల రూ. లోపే. అలా రాజుల్లో అత్యధికులు మంచి బేరాలాడుకొని, లాభంగా తేలిగ్గా  ఇండియాలో కలిసిపోయారు.

కనుక విలీనగాథలో పటేల్ కథానాయకుడే కానీ, ఎవరూ విలన్లే కారు! నిజాముతో సహా వర్గపరంగా అంతా చాలా ఆప్తులు. “ఈ రాజులపట్ల పటేల్ వైఖరి విభిన్నమైనది. వారిని భారతదేశ సహ నిర్మాతలుగా (కోఆర్కిటెక్ట్స్) గౌరవించాలంటారు. జాగీర్దారుల భవితవ్యం పట్లా అంతే ప్రగాడ సానుభూతి. వారి ఆస్తుల స్వాధీనాన్ని ఆయన ఎప్పుడూ చోరీ, డెకాయిటీ అనే అభివర్ణించేవారు,” అంటారు మీనన్.

విలీనం ద్వారా  ‘మీరంతా గొప్ప త్యాగం చేస్తున్నారు’ అంటూ, వీరికి నచ్చచెప్పటానికి పటేలూ, ప్రభుత్వమూ చేసిన ముఖ్యవాదనలు రెండు: 1) కలిస్తేనే మీకు లాభం, భద్రత; మీ ఆస్తులు, రాజభరణాలు, లాంఛనాలు, అన్నీ కొనసాగుతాయి. (నిజాముతోపాటు వారిలో పెద్దవారంతా గవర్నరు(రాజ్ ప్రముఖ్) హోదాలో 1956దాకా కొనసాగారు కూడా.2)విలీనం కాకపోతే ప్రజల ఆగ్రహాగ్నికి బలైపోతారు, మీరు తట్టుకోలేరు. యూరపు రాజ వంశాల బంధువుగా, విప్లవాల స్వానుభవంతో చెప్తున్నా ను, అని  మౌంట్ బాటన్ వారికి చెప్పేవారు. నిజాంల స్థితి-గతీ కూడా  అదే.  ఈ వాదనలతో అత్యధికులు ‘శాంతియుతంగా’ కలిసిపోయారు. కాశ్మీర్ హిందూ రాజు,  హైదరాబాదులో ముస్లిం నిజాము మొండికేసారు. ఇవే జటిల మైనాయి.

కేంద్రం సుదీర్ఘ బేరసారాలు సాగించి 1947 నవంబరు 27న యథాతథ ఒప్పందం చేసుకొని నిజాముని కొనసాగించింది. ఈ ఒప్పందంని పటేలు పూర్తిగా బలపరుస్తున్నారని; వెంటనే బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని  కోరుతున్నారని మౌంటుబాటెన్ 1948 మార్చి 2 సమావేశంలో చెప్పారు. ఆపని చేస్తే “నిజాము, ఆయన వారసులు రాజ్యాంగబధ్ధ పాలకులు గా శాశ్వతంగా కొనసాగుతారని” చెప్పారు. అలా కాని పక్షంలో నిజాము తన సింహాసనాన్నే కోల్పోవచ్చని చెప్పారు. పటేల్ గుండెపోటుతో, అనారోగ్యంతో 1948మార్చి తర్వాత రెస్టు తీసుకోవాల్సి వచ్చింది. మీనను, మౌంటుబాటెను  కాసిం రజ్వితో కూడా మాట్లాడారు. స్వయంగా ఉక్కుమనిషి కూడా రజ్విని  కలిసారు. పోలీసు యాక్షనుకి రెండు వారాల ముందు ఆగస్టు 28న తాము ఐరాసకు వెళ్తున్నామని, తమకు డిల్లీలో విమానఏర్పాట్లు చేయాలని నిజాము కోరారంటే వారి సంబంధాలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. ఐరాస కు వెళ్ళే ప్రతినిధి వర్గంలో ముస్లింలే కాదు హిందూ కులీనులు (పింగ్లే దొరలు) కూడా ఉన్నారని గమనించాలి. అయితే తరువాత  కేసుని ఉపసంహరించుకుంటున్నామని నిజాము ఐరాసకే రాసారు!

“ నిజాముతో ఘర్షణ 108గంటలలో ముగిసిందనీ, కమ్యూనిస్టుల అణచివేతకు మూడేళ్లు పైగా పట్టిందని” మీనన్ రాసారు .  ప్రతిరోజూ వస్తున్నకమ్యూనిస్టు తిరుగుబాటు రిపోర్టులు చూసిన నాకు నిజాము విలీనంకన్నా అవే ఆందోళనకరంగా తోచాయని రాసారు. 1947నవంబర్లో యథాతథ ఒప్పందం కుదిరాక, సంస్థానం అదనపు బలగాలతో 28వేలసైన్యం కలిగి ఉండటానికి కేంద్రం అంగీకరించింది. నిజాము వ్యతిరేక పోరాటంలో విజయం సాధిస్తున్న కమ్యునిస్టుల అణచివేతకై తమకు ఆయుధాలు కావాలని నిజాము కోరారని, పటేలు, కేంద్రం దానికి అంగీకరించినారనీ  వెల్లడించారు. రజాకార్లను రద్దుచేయా లని, ఐతే “అది ఒకేసారి కాక, క్రమంగా చేయాలనీ” – నెహ్రూ, పటేలు, రాజాజీ అంతా -అంగీకరించారు.. రైతాంగాన్ని అణచడా నికే ఇదికూడా. సంస్థానంలో ఆంతరంగిక కల్లోలంగురించి తమకు బాగా తెల్సునని, ఈ ఒప్పందం కుదిర్చి నందుకు మౌంటు బాటె ను కి కృతజ్ఞతలు చెపుతూ నవంబరు 29న  రాజ్యాంగ సభలో పటేల్ మాట్లాడారు. అంతేకాక ఒప్పందం మేరకు కేంద్ర సైన్యాలను సంస్థానం నుంచి ఉపసంహరించు కున్నామనీ రాసారు. విమోచన నిజాము నుంచి కాదనటాని కివన్నీ తిరుగులేని నిదర్శనాలు. విలీనం తర్వాత కూడా మీనన్- రజ్వీని కలిసారు. తనని జైల్లో బాగానే చూస్తున్నారని, సమస్యలేమీ లేవనీ రజ్వి చెప్పాడు. 1957లో అతన్ని పాకిస్తానుకి క్షేమంగా పంపారు. ఈ వివరాలన్నీ మీనన్ గ్రంథస్థం చేసారు. వేలమంది రైతాంగా న్ని కాల్చి చంపిన  కేంద్ర ప్రభుత్వానికి  ఎవరు అసలు శత్రువులు? ఎవరు మిత్రులు? తెలిసి పోతున్నదిగదా

17న నిజాము లొంగుబాటు వెంటనే ఆయన భవిష్యత్తు గురించి పటేల్ని సంప్రదించానని, నిజాముని, ఆయన పేరిటే పాలననీ కొనసాగించాలని నిర్ణయించామని మీనన్ రాసారు . 1956లో సమైక్యరాష్ట్రం ఏర్పడేదాకా నిజామే రాజప్రముఖుగా (గవర్నర్) కొనసాగారు. ఆయనతో పాటు రాజులందరికీ ప్రత్యేకహక్కులు, భరణాలు 1970 లో అవి రద్దు చేసే వరకూ కొనసాగాయి. ఆ రద్దుని వాజపేయీ పార్లమెంటులో వ్యతిరేకించారు.

ఇక నిజాం రాజ్యం భారత్ లో విలీనం కాకపోవడానికి రాజు ముస్లిం కావటం కారణం కాదు. హిందూ రాజుల పాలనలోని ఇండోర్, మణిపూర్ కూడా విలీనాన్ని తోసిపుచ్చాయి. తిరువనంతపురం  1947 జూలై14న కూడా స్వతంత్రంగా ఉంటాం అని ప్రకటించింది.  మైసూరు ఆగస్టు 9 దాకా సంతకం చేయలేదు; 1949 జూన్ 1 న గానీ భారత డొమినియనులో కలవలేదు. ఇక  కాశ్మీరు సంగతి తెలిసిందే ఇవన్నీ  హిందూరాజుల పాలనలోనివే. ఇక  ఫ్రెంచి వలసలు పుదుచ్చేరి, యానాం 1954దాకా, పోర్చుగీసు వలసలు (గోవా)1961డిసెంబరు దాకా ఇండియాలో కలువలేదని గమనించాలి . కనుక  విలీనంలో హిందూ-ముస్లిం అనే అంశమే లేదు. అంతేకాదు రైతాంగ పోరాటం జరుగుతున్న నిజాం రాజ్యం లో తప్ప మరెక్కడా ఆయా ప్రాంతాలను విలీనం చేయడానికి  మిలిటరీని పంప లేదని గుర్తించాలి.

హిందూ దొరలు నిజాము ప్రభుత్వంలో ముఖ్య పాత్ర వహించి,రాజ భక్తి పరాయణులుగా ఉంటూ, తమ ఫ్యూడలిజాన్ని కాపాడుకున్నారు.ఆనాటి పోరాటం ముస్లిములకు వ్యతిరేకంగా సాగినదికాదు. ఆ పోరాటంలో ముస్లిము రైతు షేకు బందగీ, విప్లవకవి మఖ్దూం మొహియుద్దీన్, ఫతేవుల్లా ఖాన్ వంటి కార్మిక నాయకులు, జవ్వాద్ రజ్వీ వంటి విద్యార్థి నాయకులు, బాఖరుల్లా ఖాన్ వంటి ముస్లిం వకీళ్లు, షోయబుల్లా ఖాన్ ఎడిటరుగా వుండిన ఇమ్రోజ్, మీజాను వంటి ఉర్దూ పత్రికలు,నిజాముకి వ్యతిరేకంగా చేసిన కృషిని మరిచిపోలేము.

హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పడిన  ఆర్యసమాజుకి తెలంగాణాలో తొలిదశలో స్వల్పపాత్ర ఉండేది; ముస్లింలుగా మారిన  హిందువులను తిరిగి హిందూ మతంలోకి తెస్తుండేవారు. వారు కమ్యూనిస్టు ఉద్యమాలపట్ల సానుభూతి కలిగి వుండేవారు   వారికీ, ఆర్.యస్.యస్.కీ పడేది కాదు.  1940-51 నిజాము వ్యతిరేక పోరాటంలో– 1925లో స్థాపించబడిన ఆర్.యస్ .యస్.గాని 1915లో స్థాపించబడిన హిందూమహాసభ వంటి హిందూ మత, రాజకీయ సంస్థలు గాని పోషించిన పాత్ర  సున్నా. 1952ఎన్నికల్లో వారు ఐదు సీట్లు మాత్రం పోటీ చేసారు; మొత్తం ఐదున్నరవేల వోట్లు తెచ్చుకున్నారు.  తెలంగాణ ప్రజల పోరాటం తో గాని , ఆ ప్రజల ఆకాంక్షలతో గాని ఏ సంబంధం లేని సంస్థలు ఈ నాడు ఆ పోరాట స్థలాలను సందర్శించి, అమరులకు నివాళులు అర్పిస్తూ వారి చరిత్రను తమకు అనువైన రీతిలో ప్రచారం చేసుకుంటూ ప్రజలను వంచన చేస్తున్నారు

విమోచన దినం అని, వజ్రోత్సవమని వారు  చేస్తున్న హడావుడి ప్రజల దేశ భక్తిని తమకు వోట్లుగా మార్చుకునే  బరి తెగించి న వైనమే.అధికార ప్రాప్తికయి చేస్తున్న నయవంచన  నాటకమే.  తస్మాత్ జాగ్రత్త

 

[ఆదిత్యకృష్ణ  రాజకీయ విశ్లేషకుడు. మీడియా రచయిత ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *