అగ్ని వీర్ పథకం ఎందుకు? ఎవరి కోసం?

 

(కన్నెగంటి రవి)

ప్రపంచీకరణ తరువాత దేశ సరిహద్దులకు ప్రాధాన్యత పోయింది. భౌతిక సరిహద్దులను మనం ఇంకా పట్టుకు వేలాడుతున్నాము కానీ, పాలకులు,స్వేచ్ఛా ఒప్పందాలతో దేశ సరిహద్దులను ఎప్పుడో తెరిచేశారు.

అమెజాన్,వాల్ మార్ట్,మెట్రో, మాన్సాంటో, కార్గిల్, సింజెంట లాంటి కంపెనీలు దేశంలోకి విమానాలు ఎక్కి వచ్చి,దేశ సంపదను కొల్లగొట్టడం ఎప్పుడో ప్రారంభం అయ్యింది.

ప్రధాని మోడీ ప్రకటించిన మానిటైజేషన్ తో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరమవుతున్నాయి.

నాలుగు లేబర్ కోడ్ లతో పర్మినెంట్ కార్మికుల సంఖ్య సున్నాకు చేరి కాంట్రాక్ట్,క్యాజువల్ కార్మికుల సంఖ్య పెరిగిపోతోంది.

జూలై 1 నుండీ అమలు కానున్న ఈ లేబర్ కోడ్ లు కార్మికుల పని గంటలను పెంచేస్తాయి.హక్కులను హరిస్తాయి.

రాబోయే కాలంలో హక్కుల కోసం కార్మికులు వీధుల్లోకి వస్తారు.వీళ్ళను అదుపు చేయడం అవసరం. సరిహద్దుల్లో కాదు, దేశం మధ్యలోనే యుద్ధ రంగం సిద్దం అవుతోంది.

పాలకులపై, కార్పొరేట్ యజమానులపై ఈ అంతర్గత యుద్ధాన్ని ఆపడం పాలకుల తక్షణ లక్ష్యం.నిజానికి దేశ రక్షణ కంటే, ఇంతకాలం రక్షణ బలగాలను వాళ్ళు అందుకే ఎక్కువ వినియోగించారు. వినియోగిస్తున్నారు. పైగా సర్వీస్ కాలంలో వీరికి ఇచ్చే శిక్షణ మానవ హక్కులను పూర్తిగా ఉల్లంఘించేది గాఉంటున్నది. సైనిక బలగాలకు ప్రత్యేక అధికారాల చట్టం వారిని మరింత అమానవీయంగా మార్చింది.

కాశ్మీర్ నుండీ ఈశాన్య రాష్ట్రాల వరకూ, దండకారణ్యం నుండీ అన్ని ఆదివాసీ ప్రాంతాల వరకూ, మిలటరీ, పారామిలటరీ, BSF, CISF బలగాలు మోహరించి ఉన్నాయి. ఎక్కడ ప్రజల కదలిక కనపడినా ఈ బలగాలే దర్శన మిస్తున్నాయి.

పాలకుల దృష్టిలో దేశ భౌతిక సరిహద్దులకు పెద్ద ప్రాధాన్యత లేదని, చైనా భారత సరిహద్దుల్లో నిర్మిస్తున్న గ్రామాలే చెబుతున్నాయి.

దేశమంతా విస్తరించే ప్రైవేట్ కార్పొరేట్లు ఎలాగూ ప్రైవేట్ బలగాలను రక్షణకు నియమించు కుంటాయి. వాళ్లకు తోడుగా శ్రామిక ప్రజల నుండే ఎంపిక చేసిన సల్వాజుడుం తయారు చేయడం ఇప్పుడు పాలకుల తక్షణ అవసరం. అందుకే నాలుగేళ్ల కాంట్రాక్ట్ ఉద్యోగాలు.

పర్మినెంట్ గా ప్రభుత్వ ఉద్యోగాలను కొనసాగించాల్సిన సోషలిస్టిక్ ఆర్థిక విధానాలు వారు కోరుకోవడం లేదు. అందుకే మొదటి ప్రయోగం ఈ రంగంలో చేస్తున్నారు.
ఆధునిక రక్షణ పరికరాలు ,యుద్ధ విమానాలు,క్షిపణులు కొనుక్కుంటే, పదాతి దళాలు ఎక్కువ అవసరం లేదని వాళ్ళ ఆలోచన.

ఎన్ని పదాతి దళాలు ఉన్నా, ఉక్రెయిన్ రష్యా దాడుల నుండి తనను తాను ఏమి కాపాడు కోగలిగింది ? .రెండు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఆకాశం పై నుండే సాగుతున్నది.ప్రపంచం నోరు తెరుచుకుని చూస్తున్నది. నిజంగా యుద్ధ అవసరాలు ఏర్పడితే మన పాలకులు అదే చేస్తారు.

ఎలాగూ ఉక్రెయిన్ కు అమ్ముకున్నట్లే నాటో మనకూ ఆయుధాలు అమ్ముకుంటుంది.

సో, కాంట్రాక్ట్ ఉపాధి కలిగిన ప్రజలను ,వారి ఉద్యమాలను అదుపు చేయడానికి కాంట్రాక్ట్ మిలటరీ బలగాలు సరిపోతాయి. నాలుగేళ్ల కాలం అయిపోయాక 75 శాతం మందిని తీసేసి 25 శాతం మందిని ఉంచుకుంటారు. అందుకే “అగ్నిపథ్”.

సరిహద్దు దేశాలతో యుద్ధ వాతా వరణం లేని సామరస్య పూర్వక సంభంధాలు మనం కోరుకుంటున్నాం. బహుళ జాతి కంపెనీల. దోపిడీ లేని ఆర్థిక వ్యవస్థను మనం కోరుకుంటున్నాం. ప్రజలకు రాజ్యాంగ హక్కులు దక్కే జీవన విధానాన్ని మనం కోరుకుంటున్నాం. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను ప్రాథమిక హక్కులుగా అమలు చేసే ప్రజాస్వామిక పాలన మనం కోరుకుంటున్నాం.

మిలటరీ,పోలీస్ నియామకాల కంటే,ఎక్కువ ప్రజా సంక్షేమ రంగంలో ప్రభుత్వ రంగ ఉద్యోగ ఖాళీల భర్తీ చేయాలని మనం కోరుకుంటున్నాం.కానీ ప్రభుత్వాలు ఇప్పటికీ మిగిలిన రంగాల పోస్టులను రద్దు చేస్తూ,కేవలం పోలీస్,మిలటరీ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి అంటే,తప్పకుండా,అవి ప్రజల ప్రాథమిక హక్కులను,మానవ హక్కులను కాల రాయడానికి మాత్రమే..

ప్రస్తుత పాలకుల ఆలోచనలు మన కోరికలకు పూర్తిగా భిన్నమైనవి.. ప్రస్తుతం పాలకుల ధైర్యం వాళ్ళు రిక్రూట్ చేసుకునే బలగాల మీద ఆధారపడి లేదు. మన అనైక్యత మీద ఆధారపడి ఉంది.కులం,మతం,చుట్టూ తిరిగే మన భావజాలం మీద ఆధార పడి ఉంది. వాళ్ళ కోసం ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మన నుండే నిర్మించిన సంఘ్ మూకలు చాలని వాళ్ళ భావన.ఎలాగూ మనం పూర్తి బానిసత్వంలో కి వెళుతున్నా, ఇంతకాలం మౌనంగానే ఉంటున్నాం కదా.. దానిని ఆపేందుకు ఐక్య ఉద్యమాల ఊసే లేదు కదా..

మనం మార్క్స్ ,అంబేద్కర్ ఆలోచనా ధారలపై కొట్టుకుంటామని, నిర్మాణం అయి ఉన్న ప్రజా,శ్రామిక సంస్థలను చీలికలు పీలికలు చేసుకుంటామని వాళ్లకు నమ్మకం. మనల్ని అదుపులో ఉంచడానికి అగ్ని పథం చాలు..

ఇప్పుడు మనం కోరుకోవాలసింది ఒక్కటే..

* నిరుద్యోగుల ఉద్యమం వర్ధిల్లాలి. పోలీస్ కాల్పుల్లో మరణించిన ,గాయపడిన యువకులకు పరిహారం అందించాలి. వారిపై బనాయించిన కేసులను ఎత్తవేయాలి.
* వాళ్ళ ఉద్యమం సరైన రాజకీయ ఆలోచనతో నడవాలి. హింస, విధ్వంసం ఉద్యమ ప్రధాన లక్ష్యం కాకూడదు.
* ఈ ఉద్యమం పాలకులను గద్దె దించే రాజకీయ ఉద్యమంగా మారాలి..
* ప్రజా పక్ష రాజకీయ పార్టీల,సంస్థల ఆలోచనలు,కార్యచరణ దానికి మార్గం సుగమం చేయాలి.

( కన్నెగంటి రవి, సామాజిక కార్యకర్త)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *