రేపు తిరుమలలో శ్రీవారి ప్రణయ కలహం

 తిరుమల, 2022 జనవరి 17:
తిరుమలలో జనవరి 18న శ్రీవారి ప్రణయకలహోత్సవం జరుగు తున్నది.
శ్రీవేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 18వ తేదీ తిరుమలలో వైభవంగా జరుగనుంది.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం||ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు.
ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *