పాలించే పార్టీల ధర్నాలు ఎవరికోసం?

పాలించే పార్టీల ధర్నాలు ఎవరికోసం?
ప్రజలు నిరసన తెలిపితే  లాఠీఛార్జితో రక్తం పారించారు. తెరాస ధర్నాలకు  పోలీసుల లాఠీలు పనిచేయవా?

(వడ్డేపల్లి మల్లేశము) 

ఇంటి యజమాని నిరసనకు దిగిన, ప్రభుత్వ పార్టీ బజార్ కెక్కినా, కంచే చేను మేసిన వికృతచేష్టలు గానే కనపడతాయి. బాధ్యతల్లో ఉన్న వాళ్లు మరింత కర్తవ్య దీక్షతో అందరి మేలు కోరి పని చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు అధికార పార్టీ సంయమనంతో ప్రజల కోసం పనిచేయాలి. కానీ దానికి భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ వరుసగా గురు, శుక్ర వారాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలతో ప్రజలను ఆశ్చర్యచకితులను చేశారు. ఎందుకంటే పరిపాలించే పార్టీలు ధర్నాలు, నిరసనలు చేయడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు.
అసలు సమస్య

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పండిస్తున్న టువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రాలకు జాతీయ పంపిణీ పథకం ద్వారా ప్రజలకు అందించడానికి కృషి చేస్తూ ఉంటుంది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రమేయం లేకుండా చివరి గింజ వరకు కూడా కొంటామని హామీ ఇవ్వడంతో పాటు కొనుగోలు కూడా చేసింది. అయితే తర్వాతి పంటకు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని రైతులు తమ ఇష్టం ఉన్న చోట అమ్ముకోవచ్చని కొనుగోలు చేయడం అనేది తమ బాధ్యత కాదని తెరాస ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తో వంత పాడింది.

కేంద్ర రైతు చట్టాలకు మద్దతుగా తెరాస శ్రేణులు ప్రదర్శనలు కూడా నిర్వహించారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చినటువంటి కేంద్ర రైతు చట్టాలు ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వ విధానాలే నచ్చవు అని చెప్పడంలో అర్థం ఏమిటి? అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను ఇటీవల హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా నూ వరి ధాన్యం కొనుగోలు సందర్భంగానూ ధర్నాలో తెరాస పార్టీ తూర్పారబట్టినది. ఇదంతా తెరాస పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి కాదా?🎂
ప్రస్తుత ధర్నా ల విషయానికి వస్తే వర్షాకాలపు పంట వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొ నడం లేదని బీజేపీ ధర్నాలు చేస్తే, యాసంగి పంట ను పూర్తిగా కొనుగోలు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ తెరాస ప్రభుత్వ శ్రేణులు శుక్రవారం ధర్నాలు చేసినవి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వ అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి బాధ్యత మరచిన ప్రదర్శనలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉన్నది.
అలాగే కేంద్రంలో అధికారంలో ఉండి గత సంవత్సరం రైతుల మేలు కోసం అంటూ చేసిన చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు అని రైతుల ఆగ్రహానికి గురైన సందర్భంలో ఆ సమస్యను పరిష్కరించుకునే బదులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ అయిన వరి కొనుగోలు విషయానికి హామీ ఇచ్చే బదులు నిరసనలతో తాత్సారం చేయడం కూడా అసంబద్ధ మే.
ధర్నాలు నిరసనలు జరిగిన తీరు

తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయడానికి అంటూ ప్రత్యేకంగా ఇందిరా పార్కు సమీపంలో ధర్నా చౌక్ గతంలో ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది.. ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిల పక్షాలు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల సందర్భంగా నిరసనలు తెలపడానికి ఈ ధర్నా చౌక్ అనాదిగా వాడుకుంటూ ఉన్నాము. తెరాస ప్రభుత్వం ధర్నాచౌక్ ను 2016లో ఎత్తివేస్తూ రాష్ట్రంలో ధర్నాలు చేయడానికి వీలు లేదని నిరసన ప్రదర్శనకు తావులేదని నియంత్రణ విధించడంతో పాటు అనేక సందర్భాలలో లాఠీచార్జి భాష్పవాయువు ప్రయోగం తో పాటు ఉద్యమాలను ప్రభుత్వం అణచి వేసింది. 2016లో ధర్నాచౌక్ ఎత్తివేసిన తర్వాత ప్రజా సంఘాలు అఖిలపక్షా లు పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాలేదు .చివరికి రాష్ట్ర హైకోర్టు జోక్యం తో తిరిగి ధర్నా చౌక్ సాధించుకోవడం జరిగింది 2018 సంవత్సరంలో. అయినా కూడా నిరసన తెలపదానికి ప్రభుత్వ, పోలీసు అనుమతి తీసుకోవాల్సి రావడం చాలా బాధాకరం.

ధర్నాచౌక్ ఎత్తివేసిన ప్రభుత్వమే ఈరోజు ధర్నా చౌక్ లో నిరసన ప్రదర్శన రాష్ట్రస్థాయిలో నిర్వహించడం విడ్డూరంగా ఉంది కదూ! ధర్నాలు నిరసనలు తెలుపవలసిన అవసరం ఈ రాష్ట్రంలో ఉండదని అందుకోసమే దానిని ఎత్తి వేస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాళ ఏ అధికారంతో ధర్నాలు చేసిందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ సిబ్బంది పోలీసులు ఆ ప్రాంతాన్ని పారిశుద్ధ్యం చేయడంలోనూ రక్షణ కల్పించడంలోనూ అతి ఉత్సాహాన్ని ప్రదర్శించడం నిజంగా అప్రజాస్వామిక మే. అదే నిన్నటి రోజున బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రతిచోటా లాఠీచార్జి తో పోరాట కార్యక్రమాన్ని భగ్నం చేయడం జరిగింది. నేటి తెరాస కార్యక్రమంలో ఎక్కడ కూడా పోలీసులు జోక్యం చేసుకున్న దాఖలా లేదు. అంటే ధర్నాకు పోలీసులు మద్దతు తెలిపిన ట్లే కదా!.
రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి రాష్ట్ర పాలనా వ్యవహారాలకు సంబంధించి ప్రతిపక్షాలతో, ప్రజా సంఘాలతో, రైతు సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవలసినది పోయి స్వప్రయోజనం కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని మళ్ళించడానికి, బిజెపి పార్టీ పైన వ్యతిరేకతను సృష్టించడానికి ధర్నాలకు పూనుకోవడం బాధ్యతను విస్మరించడమే.
రాష్ట్ర అవసరాలు ఏమిటి? ఏ పంట ద్వారా పూర్తి అవసరాలను సర్దుబాటు చేసుకోవచ్చు? రైతులకు సూచనలు సలహాలతో పాటు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించవలసింది పోయి ఘర్షణలకు తలపడడం కొరివితో గోక్కున్నట్లు ఉంటుంది. ధర్నాచౌక్లో అనేక ప్రజాసంఘాలు అఖిలపక్షాలు ఎన్నో సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పోలీసుల జోక్యంతో నిరసన ప్రదర్శనలను భగ్నం చేసిన సందర్భాలు ఎన్నో. అలాంటిది ప్రభుత్వ ధర్నాకు పోలీసులు అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేయడం వివక్షత కాదా?. ఇదంతా చూస్తే రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల మనసులో నుండి తొలగించి దారి తప్పించడానికి ఈ ఘర్షణ కు పూనుకున్నట్లు గా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విశ్లేషకులు, మిగతా రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వము ఏదిఏమైనా పూర్తి స్థాయిలో బాధ్యత వహించవలసి ఉంటుంది .ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయులు తమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *